‘నువ్వు యూత్ ఏంట్రా?’ అని కమెడియన్ సునీ ల్ను ఉద్దేశించి అన్న డైలాగ్ ఒకటి అప్పట్లో చాలా పాఫులరైంది. సీనియర్ సిటిజన్ వయసున్న నేతలు కూడా ఆ రోజుల్లో యువజన కాంగ్రెస్ నేతలుగా చెలామణి అయ్యేవారు. వారిని ఉద్దేశించే ఈ డైలాగ్ రాసి ఉంటారనే చర్చ జరిగింది. విద్యార్థి, యువజన సం ఘాలకు నేతృత్వం వహించే నేతలకు కనీసం ఆ పదవులకు తగ్గట్టు వయస్సున్న వారిని నియమిస్తే బాగుంటుంది. తెలంగాణ కాంగ్రెస్ కమిటీ (టీపీసీసీ) తాజా గా విద్యార్థి ఉద్యమాల కమిటీకి చైర్మన్గా సీనియర్ నేత మల్లు రవిని నియమించింది. ‘మీరూ స్టూడెంటేనా సార్’ అని ఎన్ఎస్యూఐ నేతలు ఆటపట్టిస్తున్నరట. పాపం టీపీసీసీ మాత్రం ఏం చేస్తుంది? ఒక పక్క ఓల్డేజ్ హోమ్లో విశ్రాంతి తీసుకునేవారిని, బాత్రూమ్కు కూడా వెళ్లలేని స్థితిలో ఉన్న వారిని కూడా వదిలి పెట్టకుండా చక్రాల కుర్చీలో మరీ తీసుకొచ్చి పార్టీ లో చేర్చుకుంటుండగా, స్టూడెంట్ లీడర్గా ఎవరుంటే ఏం? అని ఎదురు ప్రశ్నిస్తున్నారు.
కేంద్రం తెలంగాణకు ఏమీ ఇవ్వడం లేదని బీఆర్ఎస్ నేతలు ఎప్పుడూ విమర్శిస్తుంటారు. ఈ విషయాన్ని వారు బాహాటంగా చెప్పుకొంటున్నారు, మేం చెప్పుకోలేకపోతున్నాం. వారికీ మాకూ అదొక్కటే తేడా తప్ప, ఇక్కడ మా పరిస్థితి అలాగే ఉన్నదని బీజేపీ రాష్ట్ర నాయకులు వాపోతున్నారు. వచ్చే ఎన్నికల్లో తెలంగాణలో తమదే అధికారమని ఢిల్లీలో కూర్చొని పెద్ద పెద్ద మాటలు చెప్తారు కానీ, ఆ దిశగా తమకు ఎలాంటి కార్యాచరణ ఇవ్వడం లేదంటున్నారు. ఢిల్లీకి వెళ్తే రేపో మాపో తామే హైదరాబాద్కు వస్తున్నట్టు తేదీలతో సహా ప్రకటిస్తారు. కానీ, చివరి నిమిషంలో తమ పర్యటన వాయిదా పడిందని చావు కబురు చల్లగా చెప్తారు. ఇలా ఇప్పటివరకు మోదీ పర్యటన మూడు సార్లు, అమిత్ షా పర్యటన రెండు సార్లు, జేపీ నడ్డా పర్యటన రెండు సార్లు వాయిదాల మీద వాయిదాలు పడుతుండటంతో వారి కోసం పిట్టకు ఎదురుచూసినట్టు చూడటంతోనే కాలం గడిచిపోతుందని బీజేపీ సీనియర్ నేత ఒకరు వాపోయారు. అధిష్ఠానానికి చెప్పకుండా తామేం చేయకూడదు, వారేమో తమకేమీ రోడ్మ్యాప్ ఇవ్వరని ఆయన అసహనం వెళ్లగక్కడం కొసమెరుపు.