ఏపీలోని వైజాగ్ స్టీల్ ప్లాంట్ నుంచి కేంద్రం తమ వాటాను ఉపసంహరించుకున్నది. దీంతో స్థానికులు, కార్మిక సంఘాలు పార్టీలకతీతంగా కేంద్రం తీసుకున్న నిర్ణయాన్ని వ్యతిరేకించాయి. ఇదిలా ఉంటే బొగ్గు రంగంలో కీలక పాత్ర వహిస్తున్న కోల్ ఇండియాను సైతం ప్రైవేటీకరించే దిశగా కేంద్రం అడుగులు వేస్తున్నది. దక్షిణ భారతంలో ఏకైక బొగ్గు సంస్థ సింగరేణి కాలరీస్. ఈ కంపెనీలోని 4 బొగ్గు బ్లాకులను వేలం పాట ద్వారా కేంద్రం కార్పొరేట్ శక్తులకు అప్పగించే ప్రయత్నం చేస్తున్నది.
గత పన్నెండేండ్లలో కోల్ ఇండియా లిమిటెడ్ (సీఐఎల్)లో ప్రభుత్వం ఇప్పటికే తన వాటాను 66 శాతానికి తగ్గించింది. ఇప్పుడు తమ వాటాను విక్రయించడం ద్వారా దాని అనుబంధ కంపెనీల ప్రైవేటీకరణను ప్రారంభించాలని యోచిస్తున్నది. భారత్ కోకింగ్ కోల్ లిమిటెడ్ (బీసీసీఎల్) అండ్ సెంట్రల్ మైన్ ప్లానింగ్ అండ్ డిజైన్ ఇనిస్టిట్యూట్ లిమిటెడ్ (సీఎంపీడీఐఎల్)లో 25 శాతం వాటాను విక్రయించాలని బొగ్గు మంత్రిత్వ శాఖ ప్రతిపాదించింది. సెంట్రల్ కోల్ఫీల్డ్స్ లిమిటెడ్, ఈస్టర్న్ కోల్ఫీల్డ్స్ లిమిటెడ్, మహానది కోల్ఫీల్డ్స్ లిమిటెడ్, నార్తర్న్ కోల్ఫీల్డ్స్ లిమిటెడ్, సౌత్ కోల్ఫీల్డ్స్ లిమిటెడ్ అండ్ వెస్ట్రర్న్ కోల్ఫీల్డ్స్ లిమిటెడ్ వంటి సీఐఎల్ బొగ్గు ఉత్పత్తి అనుబంధ సంస్థల వాటాలను విక్రయించడానికి ప్రణాళికలు రూపొందించబడ్డాయి.
ఉక్కు ఉత్పత్తికి ముఖ్య ముడిసరుకు అయిన ‘కోకింగ్ బొగ్గు’కు సంబంధించి దేశంలో పరిమిత నిల్వలున్నాయి. దీని ఉత్పత్తిలో ఎక్కువ భాగం ‘భారత్ కోకింగ్ కోల్ లిమిటెడ్’ ద్వారా జరుగుతుంది. ప్రస్తుతం దేశానికి యాభై శాతం మేర అందిస్తున్నది. ఇంతటి వ్యూహాత్మకంగా, కీలక కంపెనీని ప్రైవేటీకరించడం దేశ ప్రయోజనాలకు భంగం కలిగించడమే. సీఎంపీడీఐఎల్ (కోల్ మైన్స్ ప్లానింగ్ డెవలప్మెంట్ ఇన్స్టిట్యూట్ లిమిటెడ్) వాటాల విక్రయానికి ముందే, ప్రభుత్వం మినరల్ ఎక్స్ప్లోరేషన్ కార్పొరేషన్ లిమిటెడ్ (ఎంఈసీఎల్)ను విలీనం చేసి ప్రణాళికను ప్రకటించింది. సీఎంపీడీఐఎల్ ప్రైవేటీకరణ, ఎంఈసీఎల్ ప్రైవేటీకరణకు సమానమవుతుంది. ఈ విలీనం సీఎంపీడీఐఎల్ కార్మికుల్లో ఆందోళనలను లేవనెత్తింది.
సీఎంపీడీఐఎల్ బొగ్గు కార్మికులకు సురక్షితమైన మైనింగ్ను నిర్ధారిస్తుంది. దీని ప్రైవేటీకరణ కార్మికుల భద్రతతో రాజీపడేలా చేస్తుంది. ఎంఈసీఎల్ దేశంలోని వివిధ ఖనిజాలను కనుగొంటున్నది. ఇలాంటి కీలక కార్యకలాపాలను ప్రైవేటు చేతులకు అప్పగించాలని కేంద్రం భావిస్తున్నది. బొగ్గు వంటి సహజ వనరులు ప్రజల ఆస్తి. వాటిని లాభాల కోసం ప్రైవేటుకు అప్పగించడం సామాజిక నేరం. దేశంలోని బొగ్గు కార్మికులు తమ పరిశ్రమను ప్రైవేటీకరించడాన్ని వ్యతిరేకిస్తున్నారు. కాబట్టి అన్నిరంగాల కార్మికులు వారితో జతకట్టాలి!
– ఆళవందార్ వేణుమాధవ్, 86860 51752