గత కొద్ది కాలంగా కిషన్రెడ్డికి నిద్రపోయినా మేలుకొన్నా హుజూరాబాద్ తప్ప మరేమీ కనిపించడం లేదు. పార్టీ సమావేశాలైనా ప్రెస్మీైట్లెనా హుజూరాబాద్ జపం చేస్తున్నారు. ఆ ఎన్నికతో కేసీఆర్ మారిపోయారట. భయపడుతున్నారట. పాపం ఇంకా ఏమేమో చెప్పేసుకుంటున్నారు. ఆ మధ్య ప్రెస్మీట్ పెట్టి 25 నిమిషాలు మాట్లాడితే అందులో పాతికసార్లు హుజూరాబాద్ పదాన్ని వల్లెవేశారు. ఈ క్రమంలో మోదీ పేరు ఎత్తడం కూడా మరిచిపోయారు. ఇంతకూ హుజురాబాద్ గెలుపు ఏమిటి? ఆ సందర్భమేమిటి? ఇంటోల్లను వెంటేసుకొని ఇల్లిల్లు తిరిగి కన్నీళ్లు పెట్టుకొని కడుపులో తలపెట్టి పాపం అనే సానుభూతితో గెలిచిన గెలుపు.
వాట్సప్ యూనివర్సిటీ టీఆర్ఎస్ మీద చేసిన దుష్ప్రచారం…సహజంగానే మంత్రి పదవి పోయిందనే జాలి, కేసుల్లో ఇరుక్కున్నాడన్న సానుభూతి తోడైంది. అంతే తప్ప అదేదో మోదీ నోట్ల రద్దుకు, గ్యాస్ ధరల పెంపునకు, దేశాన్ని ఎక్కడికో తీసుకుపోయినందుకు ఉబ్బితబ్బిబ్బై ప్రజలు వేసిన వరమాల కాదు. అయినా హుజూరాబాద్ తర్వాత టీఆర్ఎస్ మారిందా? లేక కేసీఆర్ దేశంలో గుణాత్మక మార్పు కోసం ఉద్యమ ప్రకటన చేసిన తర్వాత బీజేపీ భుజాలు తడుముకుంటున్నదా? అందరికీ తెలిసిందే. ఆ దెబ్బకే కదా.. వారానికో నాయకుడు తెలంగాణలో దిగి విషం కక్కడం. ఎంతచేసినా ఎటు పెట్టినా బీజేపీ సర్కారుకు మిగిలింది రెండేండ్ల కాలమే. దేశాన్ని ఉద్ధరించింది లేదు. ఇది చేశామని చెప్పుకోవడానికీ ఏమీ లేదు.
దేశ ఆర్థిక వ్యవస్థ కుప్పకూలింది. అన్ని రంగాలు సర్వనాశనమయ్యాయి. ఇప్పటికే యూపీ ఎన్నికల్లో బయటకు కనిపించని దెబ్బలు తగిలాయి. శిఖండి పార్టీలు లేకుంటే ఫలితాలెలా ఉండేవో విశ్లేషకులు చెప్పారు. రేపు పార్లమెంటు ఎన్నికల్లో ఫలితాలు ఏమవుతాయోనని ఆ పార్టీ జాతీయ నేతలకు దిగులు పట్టుకుంది. ప్రతిపక్ష శిబిరమే గనుక ఒక్కతాటి మీదికి వస్తే అధికార పార్టీకి నూకలు చెల్లిపోతాయని ఢిల్లీ రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. అవును.. జనతా ఆవిర్భావానికి ముందు కాంగ్రెస్ శత్రుదుర్భేద్య దుర్గం. కానీ నెలల వ్యవధిలో జనతాపార్టీ ఆ దుర్గాన్ని నేలమట్టం చేసింది. చరిత్ర మళ్లీ పునరావృతమవుతుంది. కేంద్రంలోనే ఏమవుతుందో తెలియని స్థితిలో ఉంటే ఇక్కడ రాష్ట్రంలో కొందరు వెర్రి వెంగళప్పలు అధికారంలోకి వచ్చేది బీజేపీయే అంటూ కోరస్ అందుకుంటున్నారు. ఏ ప్రాతిపదిక? ఏ విధానాలు? కేసీఆర్ కంటే గొప్పగా ఏం చేస్తారు? ఇవేవీ అడగాల్సిన పని లేదు. వాళ్లు నమ్ముకున్నది హింసను. మతాన్ని. ఎన్నికల సమయంలో ఏదో పుల్లలు పెట్టి మత కల్లోలాలు పుట్టించాలి. ఆ విధ్వంసాల మీద సీట్లు ఏరుకోవాలి. హిజాబ్ ఉదంతం ఈ విషయాన్ని మరోసారి రుజువు చేసింది. బహుశా ఈ భూగోళం మొత్తం మీద ఎన్నికలను ఈ రకంగా డీల్ చేసే పార్టీ కాగడా పెట్టి వెతికినా ఎక్కడా దొరకదేమో!