దేశమంతా ఎమ్మెల్యేలను కొనుగోలు చేసి ఏకపార్టీ నియంతృత్వాన్ని స్థాపిద్దామనుకున్న బీజేపీకి మరోసారి ఎదురుదెబ్బ తగిలింది. మా ఎమ్మెల్యేలను కొనుగోలు చేయడం బీజేపీకి సాధ్యం కాదంటూ సవాలు విసిరిన ఆమ్ ఆద్మీ పార్టీ నాయకుడు, ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ ఢిల్లీ అసెంబ్లీలో విశ్వాస తీర్మానాన్ని ప్రవేశ పెట్టారు. బలపరీక్ష బుధవారం జరగనుండగా, ఒక రోజు ముందు అసెంబ్లీలో బీజేపీ ఎమ్మెల్యేలు అడ్డమైన ఆరోపణలతో గందరగోళం సృష్టించారు. దీన్నిబట్టి ఆమ్ ఆద్మీ పార్టీని చీల్చడంలో బీజేపీ విఫలమైందని స్పష్టమవుతున్నది. ఢిల్లీ అసెంబ్లీలో మొత్తం సభ్యుల సంఖ్య 70. కాగా కేవలం ఎనమండుగురు సభ్యులున్న బీజేపీ 63 మంది సభ్యులున్న ఆప్ ప్రభుత్వాన్ని కూలదోయాలని తెగబడుతున్నది. ఢిల్లీ ఉప ముఖ్యమంత్రి మనీశ్ సిసోడియాపై సీబీఐ దాడులు చేయించిన బీజేపీ.. ఢిల్లీలో ఆప్ ఎమ్మెల్యేల కొనుగోలుకు వందల కోట్లు సిద్ధంగా పెట్టుకున్నదనే ఆరోపణలు ఉన్నాయి. అయినా ఈ కుట్రను కేజ్రీవాల్ ధీటుగానే ఎదుర్కొన్నారు.
బీజేపీ జిత్తులు ఇక సాగబోవనేది ఇటీవలి బీహార్ పరిణామాలు కూడా సూచిస్తున్నాయి. మహారాష్ట్రలో శివసేనను చీల్చిన తరువాత బీహార్లో మిత్రపక్షమైన జేడీయూను చీల్చాలని బీజేపీ ప్రయత్నించింది. ఈ కుట్రలను ముందే పసిగట్టిన నితీశ్ బీజేపీతో పొత్తు వదులుకొని, ఆర్జేడీతో కలిసి కొత్త ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశారు. మధ్యప్రదేశ్, కర్ణాటక, మహారాష్ట్రతో పాటు కొన్ని చిన్న రాష్ర్టాలలో ప్రభుత్వాలను కూలదోసిన బీజేపీ ఇప్పుడు జార్ఖండ్పై కన్నేసింది. జార్ఖండ్ ముక్తి మోర్చాకు సొంతంగా మెజారిటీ లేనందున కాంగ్రెస్తో కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. ముఖ్యమంత్రి హేమంత్ సొరేన్ మెడపై ఆనర్హత కత్తి వేలాడుతున్నందున, రాష్ట్ర ప్రభుత్వాన్ని అస్థిరపరచాలని బీజేపీ కుయుక్తులు పన్నుతున్నది. దీంతో సొరేన్ ఎమ్మెల్యేలను కాంగ్రెస్ అధికారంలో ఉన్న ఛత్తీస్గఢ్కు తరలించారు.
వివిధ రాష్ర్టాలలోని పరిణామాలు బీజేపీ దుర్మార్గాన్నే కాదు, అశక్తతనూ వెల్లడిస్తున్నాయి. విపక్షాలు అప్రమత్తంగా, బలంగా ఉంటే బీజేపీకి ఆయా ప్రభుత్వాలను కూల్చడం సాధ్యం కాదని బీహార్, ఢిల్లీ అనుభవాలు చెబుతున్నాయి. భారీ మెజారిటీ ఉన్నప్పుడు కూడా బీజేపీ ఆటలు సాగవు. మహారాష్ట్ర, మధ్యప్రదేశ్, కర్ణాటక, జార్ఖండ్ మాదిరిగా బొటాబొటి మెజారిటీ ఉంటే లేదా సంకీర్ణాలు ఉంటే వెంటాడటానికి బీజేపీ వెనుకాడదు. ఎన్నికలు సమీపించినప్పుడు, కేంద్ర సంస్థల చేత దాడులు చేయించడమే కాకుండా మీడియా ద్వారా బీజేపీ ఊదరకొడుతుంది. బెంగాల్లో కూడా ఇదే రీతిలో చెలరేగిపోయింది. అయినా అక్కడ 292 స్థానాలలో మమతా బెనర్జీ 213 గెలుచుకుని అజేయంగా నిలిచారు. తెలంగాణలో కూడా ముఖ్యమంత్రి కేసీఆర్ ఇలాగే అప్రమత్తంగా ఉండి బీజేపీ నైజాన్ని ఎప్పటికప్పుడు బట్టబయలు చేస్తున్నారు. బీజేపీ అరాజకీయం నేపథ్యంలో, తమ ప్రాంత ప్రగతిని ఆకాంక్షించే తెలంగాణ పౌరులు ఎంత అప్రమత్తంగా ఉండాలో, టీఆర్ఎస్కు వెన్నుదన్నుగా నిలువడం ఎంత అవసరమో వివిధ రాష్ర్టాల పరిణామాలు సూచిస్తున్నాయి.