ఆరు దశాబ్దాల పాటు పోరాడి సాధించుకున్న ‘తెలంగాణ’ ప్రపంచం ముందు ఇప్పుడు సగర్వంగా నిలిచింది. ఎనిమిదేండ్ల వ్యవధిలో దేశానికి దిశానిర్దేశం చేసే కరదీపికగా మారింది. కుటుంబసభ్యుల అవసరాలను తీరుస్తూ ఓ కుటుంబ పెద్ద తన ఇంటిని ఏ విధంగా నడిపిస్తుంటాడో నేడు అదేతీరున ముఖ్యమంత్రి కేసీఆర్ తెలంగాణను ముందుకు నడిపిస్తున్నారు. తెలంగాణ అభివృద్ధి పట్ల కేసీఆర్కు ఉన్న విజన్, లక్ష్యాలు అనతికాలంలోనే రాష్ర్టాన్ని ప్రగతిపథంలో దూసుకుపోయేలా చేస్తున్నాయి. ఈ విధమైన దూరదృష్టితో కూడిన సుస్థిరపాలనను తెలంగాణ ఒక్కటే కాదు, యావత్ భారతదేశం ఆశిస్తున్నది. దానికి అర్హులు, సమర్థులు.. కేసీఆరే. అందుకే తమ అభినవ నాయకుడిగా, ఈ ‘ఒకే ఒక్కడి’ వైపు యావత్ దేశం చూస్తున్నది.
ప్రజల మధ్య వైషమ్యాలు సృష్టించి లబ్ధి పొందాలని బీజేపీ చూస్తున్నది. మరోవైపు ప్రతిపక్ష పాత్రను కూడా సరిగా నిర్వహించలేని దుస్థితిలో కాంగ్రెస్ ఉన్నది. ఈ పరిస్థితుల నుంచి బయటపడేందుకే దేశం ప్రత్యామ్నాయ పార్టీ కోసమో, ప్రభుత్వం కోసమో కాకుండా ప్రత్యామ్నాయ ఎజెండా కోసం ఎదురు చూస్తున్నది. అలాంటి ఎజెండా ఆవశ్యకతను వెల్లడించినందునే ప్రస్తుతం యావత్ భారతదేశం ముఖ్యమంత్రి కేసీఆర్ను స్వాగతిస్తున్నది.
ఒక్క తెలంగాణ మినహా, దేశంలోని అన్ని రాష్ర్టాలు కరెంట్ సమస్యను ఎదుర్కొంటున్నాయి. ముఖ్యమంత్రి కేసీఆర్ ముందుచూపుతో తెలంగాణలో కరెంటు కొరత ఉత్పన్నం కాలేదు. కేసీఆర్ చేపట్టిన ప్రతి పనికి ప్రజలు పూర్తిస్థాయిలో మద్దతునిచ్చారు. ప్రస్తుత పరిస్థితుల్లో సీఎం కేసీఆర్ స్థాపించే జాతీయపార్టీ దేశానికి ఎంతో అవసరం. మతపరమైన అలజడులను సృష్టించే నాయకులకు చరమగీతం పాడే రోజులు దగ్గర పడ్డాయి. ముఖ్యమంత్రి కేసీఆర్ ఏ పని తలపెట్టినా, అవతలి వ్యక్తులకు అపనమ్మకం ఎంత సహజమో, ఆయన విజయం సాధించటం కూడా అంతే సహజం. కేసీఆర్ 2001లో ‘తెలంగాణ రాష్ట్ర సాధన’ను తలకెత్తుకున్ననాడు ఇలాగే అన్నారు. ‘కాళేశ్వరం’ ప్రాజెక్టును ప్రకటించినప్పుడు విమర్శించారు. ‘మిషన్ భగీరథ’ నీళ్లు ఇయ్యకుంటే ఓట్లు అడగనని శపథం చేసినప్పుడు ఇలాంటి అపశకునపు మాటలే వినిపించాయి. ‘రైతుబంధు’ ప్రకటించగానే ‘ఎన్నేండ్లు అమలుచేస్తరో చూస్తం’ అన్న వెకిలిమాటలూ విన్నాం. ‘సచివాలయం’ కడుతామన్నప్పుడు సైతం అడ్డగోలుగా మాట్లాడారు. ఇవన్నీ ముఖ్యమంత్రి కేసీఆర్ సాధించి చూపించారు. వాస్తవానికి తెలంగాణ ఉద్యమం మొదలుపెట్టిన్నాడు ఒక్క అనుకూల అంశం కూడా ఆయనకు లేదు, ఇప్పుడు జాతీయపార్టీ ఏర్పాటుకు అనేక సానుకూల అంశాలున్నాయి.
మోదీకి దీటుగా, కేంద్ర వైఫల్యాలను ధైర్యంగా ఎండగడుతున్నది ముఖ్యమంత్రి కేసీఆర్ మాత్రమే. నాడు ఇందిరాగాంధీ, రాజీవ్గాంధీ లాంటి వారు సైతం వారికి వ్యతిరేకంగా అప్పటికప్పుడు ఉద్భవించిన పార్టీలు, కూటములతో కుప్పకూలారు. ఇప్పుడు కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ కూడా నిఖార్సయిన నాయకుడు కేసీఆర్ సారథ్యంలో కుప్పకూలిపోవడం ఖాయంగా కనిపిస్తున్నది. స్వరాష్ట్రంలో ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రవేశపెట్టిన పథకాలు అన్నివర్గాల ప్రజలను సంతృప్తి పరిచాయి. ప్రధాని మోదీ ఇటువంటి పథకాలను అమలుచేయలేక దేశాన్ని దోపిడీదారులైన అదానీ, అంబానీల చేతుల్లో పెడుతూ సొమ్ము చేసుకుంటున్నారు. దేశ ప్రజలపై సవతి తల్లి ప్రేమను చూపిస్తున్నారు. మోదీ మాటలు తప్ప చేసిందేమీ లేదు. ఒక గొప్ప పథకం లేదు. సమస్యను పరిష్కరించిందీ లేదు. సరిహద్దు భద్రతలో విఫలం, ఆర్థికంగా విఫలం, విదేశాంగ విధానంలో విఫలం, అంతర్గత భద్రతలో విఫలం, సంక్షేమంలో విఫలం, సామాన్యుడిని ఆదుకోవటంలోనూ విఫలం. రైతుల ఆదాయాన్ని రెట్టింపు చేయడంలోనూ విఫలం. అన్నింటిలోనూ విఫలమే. పంటలు పండించుకోనీయరు, పండిన పంటను సక్రమంగా అమ్ముకోనీయరు. సవాలక్ష కొర్రీలు పెడతారు. ఎటుచూసినా మోదీ సర్కారుది వైఫల్యమే. ఎనిమిదేండ్లయినా చెప్పుకోవటానికి ఏమీ లేదు.
ఇప్పుడున్న పరిస్థితుల్లో దేశానికి కావాల్సింది ప్రత్యామ్నాయ పార్టీలో, ప్రభుత్వాలో కాదు. ప్రత్యామ్నాయ ఎజెండా కావాలి. అందుకోసం యావత్ భారత్ ఎదురుచూస్తున్నది. ఇప్పటివరకు దేశ అవసరాల కోసం ఏ రాజకీయ పార్టీ కూడా సరైన పునాదులు నిర్మించలేకపోయింది. స్వతంత్ర పోరాటం అనంతరం అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ గానీ, ఆ తర్వాత తామే ప్రత్యామ్నాయం అంటూ ఏర్పడిన రాజకీయపార్టీల సమూహాలు కానీ, ఆ తర్వాత కాలంలో గుజరాత్ను చూపించి దేశాన్ని ఉద్ధిరిస్తామంటూ అధికారంలోకి వచ్చిన బీజేపీ గానీ వరుసగా వైఫల్యం చెందడం చూశాం. ఈ పార్టీలేవీ దేశ ప్రజల సమస్యలపై, మౌలిక సదుపాయాల కల్పనపై దృష్టిసారించలేకపోయాయి.
తెలంగాణ రాష్ర్టాన్ని సాధించడమే కాకుండా కేవలం ఎనిమిదేండ్లలోనే ప్రపంచ చిత్రపటంలో తెలంగాణకు ప్రత్యేక గుర్తింపును తెచ్చిన మహా నేత ముఖ్యమంత్రి కేసీఆర్. ఆయన సారథ్యంలో తెలంగాణ రూపురేఖలు మారిపోయాయి. ఎలాంటి కొలమానాన్ని పెట్టి చూసినా దేశంలో తెలంగాణే నెంబర్ వన్ స్థానంలో కనిపిస్తున్నది. అందుకే ప్రస్తుతం యావత్ భారతదేశం ముఖ్యమంత్రి కేసీఆర్ వైపు చూస్తున్నది. దేశానికి కావల్సిన ప్రత్యామ్నాయ ఎజెండా ప్రజల ఆకాంక్షలకు అద్దం పడుతుంది. ప్రజాస్వామ్యంలో ప్రజలే చరిత్ర నిర్మాతలు. అలాంటి ప్రజాభీష్టానికి అనువైన ఎజెండాను ముఖ్యమంత్రి కేసీఆర్ రూపొందించి ముందుకు సాగుతుంటే దేశానికి ఉజ్వల భవిష్యత్తు ఖాయం.
– లలిత్చౌదరి, 94403 05165