దేశానికి దార్శనికతను చూపి, భవిష్యత్తుకు పునాది వేసిన దిక్సూచి డాక్టర్ బీఆర్ అంబేద్కర్.
అంతటి మహనీయుడు ఒక కులానికో, ఒక మతానికో సంబంధించిన వ్యక్తి కాదు. నిజానికి కులం పునాదుల మీద ఒక నీతిని, జాతిని నిర్మించలేమని తెగేసి చెప్పిన వ్యక్తి అంబేద్కర్. ఆయనను ఒక కులానికే పరిమితం చేసి చూడటం ఆయన గౌరవాన్ని తగ్గించడమే. ఇలా అంబేద్కర్ పరిధిని కుదించడమనేది నికృష్ట రాజకీయాలకు పరాకాష్ఠ. అంబేద్కర్ ఆలోచనలను దరిదాపుల్లోకి కూడా రాకుండా జాగ్రత్తపడే పార్టీ బీజేపీ. సంఘపరివార్ పేర అగ్రవర్ణాల గుప్పిట్లో ఉన్న హిందూ సమాజం ఆయన ఆలోచనావిధానం, బోధనలు, ప్రసంగాలను అంటరానివిగా, ప్రమాదకరమైనవిగా చూశాయి.
బీజేపీ, కాంగ్రెస్లు ప్రతి గ్రామంలో దళితవాడల్లో విగ్రహాలకు అంబేద్కర్ను పరిమితం చేశాయి. స్వాతంత్య్రం వచ్చిన నాటినుంచి దేశాన్నేలిన పార్టీలు దగుల్భాజీ పనులే చేశాయి. ఈ క్రమంలో భాగంగానే దేశ ప్రజలు కుల, మత, లింగ, ప్రాంతాల వివక్ష లేకుండా అన్ని వర్గాలు సమానంగా గౌరవించబడి, అందరికీ సమాన అవకాశాలు కల్పించబడటమే నిజమైన భారతీయత అని నమ్మి బహుజనోద్ధరణకు బయల్దేరిన ‘అభినవ అంబేద్కర్ కేసీఆర్’పై మత ఛాందసవాదులు దాడికి పూనుకున్నారు.
లాల్-నీల్ సిద్ధాంతాలను పుణికిపుచ్చుకున్న నేతగా కేసీఆర్ సమాజాన్ని ప్రగతిపథంలోకి తీసుకెళ్లాలి. స్వాతంత్య్ర ఫలాలు అందరికీ సమానంగా ఎలా అందుతాయనే ఆలోచనలు కేసీఆర్ లాంటి అభ్యుదయవాదులకే ఉంటాయి. వాటిని ఆచరణలో పెట్టాల్సిన సందర్భమిది. నిర్దిష్ట పరిస్థితులకు లోబడి అంటే దేశ, కాలమాన పరిస్థితులకు లోబడి మాత్రమే సూత్రీకరణలు చేయగలం. ఏ భావజాలమైనా సామాజిక వాస్తవాలపై ఆధారపడక తప్పదు. సమస్యలపై ఉద్యమం ప్రజాపరమైనప్పుడు వచ్చే చైతన్యం నిజంగానే సమాజంలో కదలిక తెస్తుంది.
‘సేవ్ తెలంగాణ’ నినాదం ప్రజాపరమవడం వల్లనే విజయవంతమైంది. శత్రువు బలమైన వాడైతేనే మనలో ఐక్యత వస్తుంది. నిజానికి అంబేద్కర్ తెలంగాణ ఉద్యమానికి మార్గదర్శి. ‘బోధన, సమీకరణ, పోరాటం’ ద్వారా తెలంగాణ సమాజం ఆయన బాటలో నడిచి రాజ్యం సాధించుకున్నది. ఆ తర్వాత సామాజిక, రాజకీయ, ఆర్థిక, సాంస్కృతిక రంగాల్లో సబ్బండ వర్గాలను సమున్నత స్థాయిలో నిలుపుతూ కొనసాగిస్తున్న స్వయం పాలన అనతికాలంలోనే దేశానికి ఆదర్శంగా నిలిచింది. దీనివెనుక డాక్టర్ బీఆర్ అంబేద్కర్ ఆశయాలు ఇమిడి ఉన్నాయి. ఆ మహానుభావుడు కలలుగన్న భారతదేశంలో భిన్నత్వంలో ఏకత్వం సిద్ధాంతంపై నిర్మితమైంది. ఈ ఆశయాల స్ఫూర్తితోనే కేసీఆర్ ప్రభుత్వం నడుస్తున్నది. సమాఖ్య స్ఫూర్తిని అమలుచేయడం ద్వారానే అన్ని వర్గాలకు సమాన హక్కులు అవకాశాలు లభిస్తాయి. దేశ ప్రజలందరికీ అన్నిరంగాల్లో సమాన గౌరవం దక్కాలనే అంబేద్కర్ మహాశయుని తాత్వికతను తెలంగాణ ప్రభుత్వం అందిపుచ్చుకొని ముందుకుసాగుతున్నది. దళితులను సంపన్నులుగా మార్చే ‘దళిత బంధు’ పథకాన్ని ప్రభుత్వం తెచ్చింది. సామాజిక, ఆర్థిక ప్రజాస్వామ్యాన్ని సాధించకుండా రాజకీయ ప్రజాస్వామ్యాన్ని సాధించలేమని అంబేద్కర్ చెప్పారు. ఆయన స్ఫూర్తితో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ, మహిళా వర్గాలతో పాటు అగ్రకులాల పేద ప్రజలకు కుల, మత, ప్రాంత వివక్ష లేకుండా అందరికీ సమానావకాశాలు కల్పించడమే నిజమైన భారతీయత. అలా అన్ని వర్గాలకూ మానవీయ పాలన అందిస్తున్న ఏకైక రాష్ట్రం తెలంగాణే.
‘నీ కోసం జీవిస్తే నీలోనే నిలిచిపోతావు, జనం కోసం జీవిస్తే జనంలో నిలిచిపోతావు’ అన్న అంబేద్కర్ స్ఫూర్తితో తెలంగాణ రాష్ట్ర ప్రధాన పరిపాలనా సముదాయ భవనమైన రాష్ట్ర సచివాలయానికి అంబేద్కర్ పేరు పెట్టాలని సీఎం కేసీఆర్ నిర్ణయించడం ముదావహం. ఇలా పేర్లు పెట్టడం ఆ వ్యక్తులకు, వారు చూపిన విలువలకు గౌరవాన్ని ఆపాదించడమే కాదు, వారి మార్గాల్లో నడుస్తామని ప్రతిన పూనడం కూడా. వ్యక్తుల పేర్లు భవనాలు, జిల్లాలకు లేదా పాలనా సంస్థలకు, వ్యవస్థలకు పెట్టడం, తీసివేయడం దేశంలో వివాదమవుతుంటుంది. అందులో అంబేద్కర్ పేరు పెట్టిన ప్రతిసారీ అది వివాదమే కాదు, హింసకు కారణం కావడం చరిత్ర పొడవునా చూస్తున్నాం.
కొత్తగా ఏపీలో కొత్త జిల్లాల్లో భాగంగా ఒక జిల్లాకు అంబేద్కర్ అని నామకరణం చేస్తే అగ్గి మీద గుగ్గిలమైన సందర్భం కండ్లారా చూశాం. ఉమ్మడి ఏపీలో ఎన్టీఆర్ పేరుతో స్థాపించిన ఆరోగ్య విశ్వవిద్యాలయానికి పేరు మార్చి వైఎస్సార్ పేరు పెట్టారు. ఇది వివాదాస్పదమైంది. దీంతో ఏపీలో మరోసారి ఘర్షణ వాతావరణం నెలకొన్నది. ఇలా అధికారం ఉన్నదని పేర్లు మార్చితే ఆ తర్వాత అధికారంలోకి వచ్చినవాళ్లు వాటినీ మార్చే అవకాశం ఉన్నది.
ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్య దేశమైన మన భారతదేశ పార్లమెంట్ భవనానికి (టెంపుల్ ఆఫ్ డెమొక్రసీ) పేరు పెట్టడానికి అంబేద్కర్ను మించిన గొప్ప వ్యక్తి, మహానుభావుడు ఇంకెవరు లేరన్న భావనతో నిండు రాష్ట్ర శాసనసభ, శాసనమండలిలో ఏకగ్రీవ తీర్మానం చేశారు. కేసీఆర్ ప్రతిపాదన పట్ల ప్రజల్లో సర్వత్రా ఆమోదం కనిపించడం తెలంగాణ సంస్కారానికి నిదర్శనం. ఏదేమైనా మహత్తర విప్లవానికి బాటలు వేస్తున్న కేసీఆర్కు అభినందనలు. ఫూలే ఆలోచనాపరులు, అంబేద్కర్వాదులు, దళిత నాయకులు కేసీఆర్ నిర్ణయం పట్ల ప్రశంసల వర్షం కురిపిస్తుండటం ఆహ్వానించదగిన పరిణామం.
ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్య దేశమైన మన భారతదేశ పార్లమెంట్ భవనానికి (టెంపుల్ ఆఫ్ డెమొక్రసీ) పేరు పెట్టడానికి అంబేద్కర్ను మించిన గొప్ప వ్యక్తి, మహానుభావుడు ఇంకెవరు లేరన్న భావనతో నిండు రాష్ట్ర శాసనసభ, శాసనమండలిలో ఏకగ్రీవ తీర్మానం చేశారు. కేసీఆర్ ప్రతిపాదన పట్ల ప్రజల్లో సర్వత్రా ఆమోదం కనిపించడం తెలంగాణ సంస్కారానికి నిదర్శనం. ఏదేమైనా మహత్తర విప్లవానికి బాటలు వేస్తున్న కేసీఆర్కు అభినందనలు.
– డాక్టర్ సంగని మల్లేశ్వర్
98662 55355
(వ్యాసకర్త: విభాగాధిపతి, జర్నలిజం శాఖ, కేయూ)