కేసీఆర్ సార్ సీఎం అయిన తర్వాతే నీళ్ల సౌలత్ వచ్చి భూముల రేటు పెరిగింది. అంతకుముందు వీటిని కానినోడు ఎవడు? నాకు తెలిసి ఇప్పుడు రైతులంతా కోటీశ్వరులే!’ ఇది నర్సయ్య మాట!
కింది ఫొటోలో కనిపిస్తున్న రైతు పేరు ములుగు నర్సయ్య. ఈయనది సిద్దిపేట జిల్లా కొమురవెల్లి మండలం తపాసుపల్లి. నర్సయ్యకు, ఉమ్మడి కుటుంబీకులు ముగ్గురితో రోడ్డు పక్కన 24 ఎకరాల భూమి ఉండేది. అంతా కలిపి వ్యవసాయం చేసేవాళ్లు. తెలంగాణ రావడానికి ముందు, 2007లో ఆ భూమిలో నాలుగైదు చోట్ల బోర్లు వేశారు. కానీ చుక్క నీరు రాలే. అందరూ అప్పుల పాలయ్యారు.
దీంతో 2007లో రోడ్డు పక్కన ఉన్న 24 ఎకరాల భూమినీ, ఎకరా లక్షా పది వేల చొప్పున అమ్మారు. వచ్చిన సొమ్ముతో అప్పులు కట్టుకున్నరు. పొత్తుల భూమి కాకుండా నర్సయ్యకు ఊరికి దూరంగా మరో 4 ఎకరాలున్నది. ఎందుకూ పనికిరాని భూమి. అమ్మినా లాభం లేదని దాన్ని అట్టే పెట్టుకున్నడు. కేసీఆర్ వచ్చాక ప్రభుత్వం ఇచ్చిన రైతు బంధుతో ఆ పనికిరాని భూమిని చదునుచేసి అచ్చుకట్టుకున్నడు. భూగర్భ జల పెరగడంతో నీళ్ల సౌలత్ వచ్చింది. నర్సయ్య ఇప్పుడు దాంట్లోనే వ్యవసాయం చేసుకుంటున్నడు.
ఇప్పుడు ఆ భూమి ధర ఎకరా 50 లక్షలపైనే పలుకుతున్నది. ‘ఇప్పుడు నాకు ఏ రందీ లేదు. అప్పో సప్పో అయినా, పానం బాగలేకున్నా, పెండ్లో గిండ్లో చేయాలనుకున్నా, అద్దెకరం అమ్మితే సాలు. కట్టమంతా పోతదన్న భరోసా ఉన్నది. కేసీఆర్ సార్ రావడానికి ముందు 24 ఎకరాల భూమిని, మంచిగ రోడ్డుపక్కన ఉన్నదాన్ని, ఎకరా లక్ష చొప్పున అడ్డికి పావుసేరు లెక్క అమ్ముకున్నం. దాని విలువ ఇప్పుడైతే ఎకరా కోటి పైమాటే. ఆ భూమి ఉంటే ఎంత బాగుండు అని అప్పుడప్పుడు అనిపిస్తది.
Telangana | అదే తెలంగాణ. అదే ఊరు. అదే నేల. అదే రైతు. తెలంగాణ రావడానికి ముందు రోడ్డు పక్క ఉన్న భూమికే ఎకరా లక్ష పలికితే, ఇప్పుడు ఊరు చివర మారుమూల ఉన్న భూమికి కూడా 50 లక్షలు ధర. ఎందుకీ వ్యత్యాసం? 2014కి ముందు, ఇప్పటికి వచ్చిన తేడా ఏమిటి? ప్రత్యేక రాష్ట్రం కావడమా? నీళ్ల సౌలత్ ఏర్పడటమా? రైతుబంధు ఇవ్వడమా? 24 గంటల కరెంటా? ధరణితో రికార్డులు క్లియర్ చేయడమా? వ్యవసాయం బాగుపడటమా? ఎందుకు నర్సయ్య భూమి ధర లక్ష నుంచి 50 లక్షలకు చేరింది! ఒక్క నర్సయ్యదే కాదు; రాజధాని- శివారు అన్న తేడా లేదు. పట్నం- పల్లె అన్న తేడా లేదు. తరి- ఖుష్కీ అన్న తేడా లేదు. గుట్ట- చెలక అన్న తేడా లేదు. తెలంగాణలో ఇప్పుడు ఎక్కడి భూమికి అక్కడే గతం కంటే పదింతల ధర. ఇదెలా సాధ్యమైంది?
మరి, తెలంగాణ భూములకు ఉమ్మడి రాష్ట్రంలో ధరలెందుకు పడిపోయినయి? మన భాగ్యనగరి శివారు భూములు అడ్డగోలు రేట్లకు ఎట్ల అన్యాక్రాంతమైనయి? మన రైతన్నలు లక్ష, రెండు లక్షలకే ఎందుకు అమ్ముకోవాల్సి వచ్చింది? ఆంధ్రాలో ఎకరా అమ్ముకొని వచ్చినవాడు తెలంగాణలో 20 ఎకరాలు ఎట్లా కొనగలిగిండు? ఇక్కడ ప్రతి జిల్లాలో గుంటూరు పల్లెలు ఎట్ల వెలిసినయ్? వలస పాలకులు పన్నిన కుట్ర ఫలితమే ఇదంతా. వారు తెలంగాణను అభివృద్ధి చేయడానికి కాదు; సుసంపన్నమైన హైదరాబాద్ స్టేట్ను నిరంతరం పేదరికంలో ఉంచడానికి, ముంచడానికి మాత్రమే ప్రణాళికలు రచించారు. జూరాలైనా, శ్రీశైలమైనా, నాగార్జున సాగరమైనా మనకు నీళ్లిచ్చే చోట కాకుండా, మన నీళ్లను తీసుకుపోయే చోట వెలిసేది. హైదరాబాద్ శివార్లకు వచ్చే పెట్టుబడి సమాచారం మన రైతులకన్నా ముందు, పొరుగు రాష్ట్ర రియల్టీ వ్యాపారులకు తెలిసేది. నిన్ననే చేతులు మారిన తన భూమి ధర తన కండ్లముందే పెరిగి, దాని యజమానిగా ఉన్న రైతే అందులో కూలీగా మారేవాడు. ఇలా చెప్పుకొంటూ పోతే ఈ ముచ్చట వొడువదు.
డెక్కన్ పీఠభూమిలో మొలిచిన పసిడి కొండ తెలంగాణ. భౌగోళికంగా చూసినా, వాతావరణపరంగా చూసినా, నేల స్వభావాన్ని చూసినా, సాగు యోగ్యతను చూసినా తెలంగాణ భూమి ఎంతో నాణ్యమైనది. అయినా మన భూములకు గత అరువై ఏండ్లుగా సరైన ధరలు పలుకకగపోగా, ఈ పదేండ్లలో భారీగా పెరిగాయి. వాతావరణం అదే, ప్రాంతమూ అదే, నేల అదే, మనుషులూ వారే. మరి మార్పు ఎలా సాధ్యమైంది? ఇదీ మనం ఆలోచించాల్సిన ప్రశ్న. ఏ ప్రాంతం అభివృద్ధి చెందాలన్నా దాన్ని ప్రేమించే ఒక భూమి పుత్రుడు, ముందుండి నడిపించే సేనాని కావాలి. నిన్న ఏం జరిగింది? నేడు ఏం చేయాలి? రేపటికి ఏ ప్రణాళిక అవసరం? అని ఆలోచించే దార్శనికుడు అవసరం. నెవడా అమెరికాలోని ఎడారి ప్రాంతం. 1930 మహా మాంద్యంలో తీవ్రంగా దెబ్బతిన్న నెవడాను ఎలా అభివృద్ధి చేయాలా అని ఆలోచించిన అక్కడి పాలకులు దాన్నొక గేమింగ్ సెంటర్గా, క్యాసినో హబ్గా మార్చారు. తర్వాత అది పర్యాటక, వాణిజ్య, పారిశ్రామిక ప్రాంతంగా అభివృద్ధి చెందింది. గల్ఫ్లో ఎడారి ప్రాంతమైన దుబాయిని అక్కడి పాలకులు ప్రపంచంలోనే పెద్ద పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దారు. ఇసుక పర్రల ఇజ్రాయెల్ను ఆ దేశ పాలకులు అద్భుతమైన వ్యవసాయ క్షేత్రంగా మలిచారు. తొండలు గుడ్లు పెట్టని ఎడారులనే అక్కడి ప్రభుత్వాలు ప్రపంచ ప్రసిద్ధ క్షేత్రాలుగా, కేంద్రాలుగా మార్చినప్పుడు, తెలంగాణను ఎందుకు మార్చలేమని కేసీఆర్ ఆలోచించారు. ఆ ఆలోచన ఫలితమే ఈ అభివృద్ధి. మిగతా దేశాలు, రాష్ర్టాల్లో ఒక ప్రాంతాన్ని ఒక్క రంగానికే పరిమితం చేసి అభివృద్ధి చేయగా, కేసీఆర్ మాత్రం తెలంగాణను షణ్ముఖ వ్యూహంతో అభివృద్ధి చేశారు.
1. ఐటీ, సాఫ్ట్వేర్ పరిశ్రమ కేంద్రంగా పశ్చిమ హైదరాబాద్, పారిశ్రామిక సెజ్లుగా హైదరాబాద్ శివారు ప్రాంతాలు (దండుమల్కాపూర్ పార్క్, శామీర్పేటలో జీనోమ్ వ్యాలీ, మహేశ్వరంలో ఎలక్ట్రానిక్ మాన్యుఫ్యాక్చర్ సిటీ, ఏరోనాటికల్ సిటీలతో పాటు కొత్తూరు, కొంగరకలాన్లో ఇండస్ట్రియల్ పార్కులు వంటివి).
మిగిలిన అన్ని మెట్రో నగరాలతో పోలిస్తే హైదరాబాద్లో ప్రభుత్వ భూమి ఎక్కువ. దీనికి అత్యద్భుత పారిశ్రామిక అనుమతుల పాలసీని జోడించడంతో అంతర్జాతీయ కంపెనీలు హైదరాబాద్కు క్యూ కడుతున్నాయి. ఫలితంగా శివారు భూముల ధరలు ఎంతో పెరిగిపోయాయి.
2. పర్యాటక కేంద్రాలుగా కాళేశ్వరం సాగర్లు, సోమశిల వంటి ప్రదేశాలు, ఆధ్యాత్మిక టూరిజం స్పాట్లుగా యాదాద్రి, ఇతర దేవాలయాలు. దీంతో ఆయా ప్రాం తాల్లో భూములకు విపరీతమైన డిమాండ్ ఏర్పడింది.
3. వ్యవసాయానికి 24 గంటల ఉచిత విద్యుత్తు, రైతుబంధు, రైతు బీమా, సకాలంలో ఎరువులు, నాణ్యమైన విత్తనాలు, మొత్తానికి మొత్తం ధాన్యం మద్దతు ధరకు కొనుగోలుతో సేద్యం లాభసాటిగా మారింది. అటు పంటలు పుష్కలంగా పండటం, ఇటు ప్రభుత్వ సాయమూ అందడంతో రైతు భూమిని తెగనమ్ముకునే దుస్థితి నుంచి, భూమినే నమ్ముకునే పరిస్థితి ఏర్పడింది.
4. పరిపాలన వికేంద్రీకరణ కోసం 33 కొత్త జిల్లాలు, 612 కొత్త మండలాలు, 74 కొత్త డివిజన్లు ఏర్పాటుచేయడం, ఎక్కడికక్కడ కలెక్టరేట్లు, ఎస్పీ ఆఫీసులు, మెడికల్ కాలేజీలు పెట్టడంతో వాటి సమీప ప్రాంతాల్లో రియల్టీ విపరీతంగా పెరిగింది.
5. పల్లె ప్రగతి, పట్టణ ప్రగతి ద్వారా మౌలిక సదుపాయాల కల్పనకు ప్రాధాన్యం ఇవ్వడంతో ఎక్కడికక్కడ భూముల విలువలు పెరిగిపోయాయి.
6. ధరణి ద్వారా తెలంగాణ భూభాగం మొత్తాన్నీ డిజిటలైజ్ చేయడంతో, తెలంగాణలో భూమికి, యజమానులకు, రికార్డులకు భద్రత ఉందన్నది అందరికీ తెలిసింది. దీంతో క్రయ విక్రయాలు సులువు కావడం, వ్యాపారుల ఆసక్తికీ కారణమైంది. ఏకకాలంలో అమలుచేసిన ఈ ఆరు విధానాలతో తెలంగాణలో భాగ్యనగరం నడిబొడ్డు నుంచి మారుమూల పల్లెదాకా భూమికి విలువ పెరిగింది. వలస పాలకులు చేయనిది, చేయలేనిది, కేసీఆర్ చేసింది. ఇదీ కేసీఆర్ మాడల్.
ఇప్పుడు తెలంగాణలో భూమి కొనుక్కునే వాడే తప్ప అమ్ముకునేవాడు కరువయ్యాడు. సైప్లె తగ్గిపోవడంతో సహజంగానే డిమాండ్ పెరిగింది. డిమాండ్కు తగ్గట్టే మంచి ధర కూడా పలకడం మొదలైంది. దేశంలోని మిగతా రాష్ర్టాల్లో కేవలం నగర ప్రాంతాల్లోనే ధరలెక్కువ. తెలంగాణలో పల్లె పట్నం తేడా లేకుండా అవే ధరలు. తెలంగాణలో ఇప్పుడు సగటున ప్రతి పది కిలోమీటర్లకు ఒక గ్రోత్ సెంటర్/ ఇంజిన్, అంటే మండలమో, పట్టణమో, నగరమో, కలెక్టరేటో, ఎస్పీ ఆఫీసో, ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీసో ఏదో ఒకటి ఉంటుంది. దాన్ని ఆనుకునే వెంచర్లు వెలుస్తాయి. పిల్ల చదువుకైనా, పిల్లగాని పెండ్లి కోసమైనా తెలంగాణలో ప్రజలు తమ కష్టార్జితాన్ని బ్యాంకుల్లోనో, ఎఫ్డీల్లోనే ఇన్వెస్ట్ చేయడం లేదు.
భూమిలో పెట్టుబడి పెడుతున్నారు. అది ప్లాట్ కావచ్చు, ఫ్లాట్ కావచ్చు. నా ఊర్లో నాకొక ఇల్లు (ముద్దుగా ఫాంహౌజ్), గంటెడో, గుంటెడో పొలం ఉండి తీరాల్సిందే అన్నది నేటి తెలంగాణ పౌరుడి ‘జన్మభూమి’ కాన్సెప్ట్. రైతు, కూలీ, ట్రాక్టర్- డోజర్ డ్రైవర్, రైసు మిల్లు యజమాని, హమాలీ, ధాన్యం రవాణా చేసే లారీ డ్రైవర్, పొదుపు చేసే చిరుద్యోగి, రియల్ ఎస్టేట్ వ్యాపారి, రియల్టీ బ్రోకర్.. ఇలా ఇప్పుడు తెలంగాణ ప్రపంచమే భూమి చుట్టూ ప్రదక్షిణ చేస్తున్నది. రాష్ట్రంలో ఒక్క రియల్ఎస్టేట్ వ్యాపారం మీద ఆధారపడి దాదాపు 16 లక్షల మంది బతుకుతున్నారట. ఇప్పుడు హైదరాబాద్ కంటే బెంగళూరులో ఫ్లాట్ ధర తక్కువంటున్నారు. తెలంగాణ కంటే ఇప్పుడు అమెరికాలో భూమి అగ్వకు దొరుకుతుందట! గత పదేండ్లలో తెలంగాణలో ఎకరా ధర ఐదు నుంచి 20 రెట్లు పెరిగిందన్నది ఒక లెక్క. హైదరాబాద్లో కూడా భూమిని గజాల్లో కాకుండా అడుగుల్లో కొనుక్కునే రోజులు ఎంతోదూరంలో లేవంటున్నారు. ఇదీ కేసీఆర్ మాడల్.
భరోసా కోసం, భద్రత కోసం మనిషి పురాతన కాలం నుంచి రెండింటినే నమ్ముకున్నాడు. ఒకటి భూమి, రెండు బంగారం. ఇప్పుడు తెలంగాణలో భూమే బంగారం. బంగారానికి లేని భద్రత భూమికి ఉంది. బంగారాన్ని మించిన రిటర్న్స్ భూమి ఇస్తున్నది. కారణం కేసీఆర్ దార్శనికత. కేసీఆర్ ఇంత అద్భుతమైన మాడల్ తెచ్చి, పదేండ్లలోనే ఫలితాలు కూడా చూపిస్తే, ఒకాయన అంటాడు… ‘మీ భూమిని తీసుకుంటా. కంపెనీలకు తాకట్టు పెడతా. తలకు మాసిన మాడల్ తెస్తా’ అని అడ్డంగా ఫెయిలైన అమరావతి గురించి చెప్తాడు. అమరావతిలో ఏం జరిగిందో, ఇప్పుడు ఆ రైతుల పరిస్థితి ఏమిటో ప్రపంచానికి తెలుసు. అది మనకు అక్కర్లేని ముచ్చట. దానికి భిన్నంగా తెలంగాణలో ఎవడి భూమి వాడి దగ్గరే. దాన్ని అమ్ముకునే అధికారం కూడా రైతు వేలి దగ్గరే. ఆ భూమికి ధర ఎంత పెరిగినా అదంతా రైతుకే సొంతం. ఎవరికీ పత్రాలు రాసివ్వనక్కర్లేదు. వాటాలు అడుక్కోనవసరం అంతకంటే లేదు. ఇదీ కేసీఆర్ మాడల్!
వలస పాలనలో తెలంగాణలో భూమి భారం. ఇప్పుడు బంగారం! ప్రత్యర్థులు సైతం పొగడక తప్పనం త విలువగా మారింది తెలంగాణ భూమి! 60 ఏండ్ల వలస పాలనలో మన రైతు అమాయకత్వాన్ని అడ్డం పెట్టుకొని కొందరు చౌకగా భూములు కొట్టేశారు. దందాగిరీ, దాదాగిరీతో హైదరాబాద్లోని మన చెరువులను,ప్రభుత్వ భూములను చెరపట్టారు. మన ప్రజల సొమ్ము మనకు కాకుండా చేశారు. ఇప్పుడు మరో రాష్ట్రం (కర్ణాటక) నేతలు, వ్యాపారులు హైదరాబాద్ భూములపై కన్నేశారు. “తెలంగాణ ఎన్నికల్లో పెట్టుబడులు పెట్టండి. హైదరాబాద్ మన చేతికే రాబోతున్నది. మీరు పెట్టినదానికి వందింతలు కండ్ల చూస్తారు. ఇది నా మాట” అని భరోసా ఇస్తూ కర్ణాటక వ్యూహకర్త, తన పార్టీ నేతల నుంచి ఎలక్షన్ ఫండ్ వసూలు చేస్తున్నారట.
రాకముందే ఇట్లుంటే, వస్తే ఏం జరుగుతుందన్నది అర్థం చేసుకోవచ్చు! ఆ ముప్పు అట్లుంటే, కాంగ్రెస్ అధ్యక్షుడు చెప్పినట్టు, ‘సాగుకు మూడు గంటల కరెంటిస్తే’, లేక కర్ణాటకలో ఇచ్చినట్టు ఐదు గంటల కరెంటు చాలంటే మన భూముల ధరలు ఇట్లుంటయా? ఇంకో నేత చెప్పినట్టు ‘దుబారా’ అని రైతు బంధు ఆపేస్తే మన భూముల ధరలు ఇట్లుంటయా? ‘ఎత్తిపోతలకు కరెంటు ఖర్చ’ని కాళేశ్వరాన్ని ఆపి, గతంలోలా చెరువులు, చెక్డ్యాములు ఎండబెడితే మన భూముల ధరలు ఇట్లుంటయా? ఇన్ని మండలాలు, జిల్లాలు అక్కర్లేదు, వేస్టు ఖర్చని తీసేస్తే మన భూముల ధరలు ఇట్లుంటయా? మన హైదరాబాదు, బెంగుళూరుకు అడ్డమొస్తున్నదని కాంగ్రెస్ పెద్దలు ఇక్కడి కంపెనీల్ని తరలించుకుపోతే మన భూముల ధరలు ఇట్లుంటయా? అమరావతిలోలాగ మన రాచకొండలోనూ ‘ఇన్సైడర్ ట్రేడింగ్’ ఆరోపణలొచ్చి కోర్టు కేసుల్లో ఇరుక్కుంటే మన భూముల ధరలు ఇట్లుంటయా?
మరి 1956లో చేసినట్టు మన చేతిలో
ఉన్న భూమిని మనమే పొగొట్టుకుందామా?
మన భూమి ధరలను మనమే తగ్గించుకుందామా?
పెండ్లి కోసమో, చదువు కోసమో, పింఛన్ కోసమో,
కొనిపెట్టుకున్న ప్లాటు ధరను పడగొట్టుకుందామా?
లక్షలాది మంది ఆధారపడి ఉన్న తెలంగాణ రియల్టీ
రంగాన్ని మన చేతులతో మనమే చంపుకొందామా?
ఇవన్నీ జరుగుతాయా అనుకోకండి. తెలంగాణ ఉన్న నీళ్లు పోలేదా? ఊళ్లు వల్లకాడు కాలేదా? ఈసారి దేశమంతా వానలు పడలేదు. కేసీఆర్ ముందుచూపు వల్ల తెలంగాణ తెరిపిన పడ్డది. మరి కర్ణాటక కరువులో కూరుకుపోలేదా? దేశమంతా కాలుష్యం, ట్రాఫిక్ కోరల్లో ఇరుక్కుపోయి ఉంది. హైదరాబాద్ ట్రాఫిక్ మూవ్ అవుతున్నది. అద్భుతమైన నగరం బెంగళూరు సర్వనాశనం కాలేదా? ఆ రాష్ట్ర పారిశ్రామిక వేత్తలే ఈ మాట అనడం లేదా? అందువల్ల వచ్చినవి పోవనే గ్యారెంటీ ఏమీ లేదు. అరువై ఏండ్ల వలస పాలనలో లేనివన్నీ, కానివన్నీ కేసీఆర్ వచ్చిన తర్వాత జరిగినయి. కేసీఆర్ లేకుంటే ఇవన్నీ పోతయ్. అందులో అనుమానం లేదు. ఎర్రిమొర్రి నిర్ణయాలు తీసుకుంటే, ఎట్లొచ్చినయ్ అట్లే పోతయి. ఎవరితోటి వచ్చినయ్ వాళ్లతోటే పోతయ్. 1948లో పోరాడి తెచ్చుకున్న తెలంగాణ 1956లో పోలేదా? ఏదైనా రావడం కష్టం. పోవడం సులువు. వలస పాలనే బాగుంది. వలస పాలకులు అరువై ఏండ్ల పాటు నీళ్లు, నిధులు, నియామకాలు అన్నీ ఇచ్చారు. అందుకే తెలంగాణే అక్కర్లేదంటున్నారు ఇవాళ. భూములు, వాటి ధరలే కాదు; వీళ్ల మాటలు వింటుంటే రేపు తెలంగాణే పోతదేమో అన్న భయం కలుగుతున్నది.
తపాసుపల్లిలో ములుగు నర్సయ్య… తను 2007లో అమ్ముకున్న 24 ఎకరాలు ఇప్పుడుంటే బాగుండు అంటున్నడు. అనుకుంటున్నడు. కానీ ఉన్నదా? అనుకుంటే వస్తదా? ఒకసారి పోగొట్టుకుంటే మళ్లీ వస్తదా?
కర్ణాటకలో ఇచ్చినట్టు ఐదు గంటల కరెంటు చాలంటే మన భూముల ధరలు ఇట్లుంటయా? ఇంకో నేత చెప్పినట్టు ‘దుబారా’ అని రైతు బంధు ఆపేస్తే మన భూముల ధరలు ఇట్లుంటయా? ‘ఎత్తిపోతలకు కరెంటు ఖర్చ’ని కాళేశ్వరాన్ని ఆపి, గతంలోలా చెరువులు, చెక్డ్యాములు ఎండబెడితే మన భూముల ధరలు ఇట్లుంటయా?
– తిగుళ్ల కృష్ణమూర్తి