కాళేశ్వరం ప్రాజెక్టు తెలంగాణ రాష్ర్టాభి వృద్ధికి మకుటం లాంటిది. గోదావరి నీటిని తెలంగాణ భూ భాగంలో 100 మీటర్ల నుంచి 618 మీటర్లు పైకి ఎక్కించి 45 లక్షల ఎకరాలకు సాగు నీరందించే బృహత్తర పథకం ఇది. ఇది ప్రపంచంలోనే సాగునీటి ప్రాజెక్టుల్లో ఒక వినూత్న ఒరవడి.
కాళేశ్వరం ప్రాజెక్టులో అన్నిరకాల ఇంజినీరింగ్ ప్రక్రియల భాగస్వామ్యం ఉన్నది. బ్యారేజీలు, పంపు హౌజులు, రివర్స్ పంపింగ్, ఎత్తిపోతలు, సొరంగాలు, రిజర్వాయర్లు, వాలు కాల్వలు.. ఎక్కడ ఏది అవసరమైతే అది. గమ్యం.. గోదావరి నీటిని అంచెలంచెలుగా తెలంగాణ పీఠభూమి తలపైకెక్కించడం. మధ్యలో ఎక్కడ వీలైతే అక్కడ కొత్త ఆయకట్టు సృష్టించడం, లేదా అరకొర నీటి లభ్యతతో కునారిల్లుతున్న, చిన్న, మధ్య, మెగా నీటి ప్రాజెక్టుల కింద ఆయకట్టును స్థిరీకరించడం. ప్రపంచంలో ఎక్క డా ఇటువంటి వినూత్న ప్రయోగం జరగలేదు.
ప్రతి ప్రాజెక్టును ఆర్థిక, సాంకేతిక పరిశీలన మదింపు చేయాలి. ఈ మదింపులో ఆ ప్రాజెక్టులోని ఖర్చులు, లాభాలు ఆ ప్రాజెక్టు ప్రయోజనాలు పూర్తిగా అందుబాటులోకి వచ్చే మొదటి కొన్ని ఆర్థిక సంవత్సరాల కాలపరిమితిపై చేయవలసి ఉంటుంది. అందులో ఖర్చులు, లాభాలు కూడా కొన్ని ప్రత్యక్షంగా, కొన్ని పరోక్షంగా ఇమిడి ఉంటాయి. చాలావరకు ఇలాంటి ప్రాజెక్టుల్లో పరోక్ష లాభాలను విస్మరిస్తూ ఉంటారు. సాగునీటి ప్రాజెక్టుల్లో పరోక్ష లాభాలు సమాజంలోని ఇతర రంగాలపై, వాటి పంపిణీ ప్రభావం అత్యంత గణనీయంగా ఉంటాయి. వాటిని విస్మరించి మదింపు చేస్తే సరైన విశ్లేషణ కాదు.
కాళేశ్వరం లాంటి ప్రాజెక్టుతో వ్యవసాయ, వ్యవసాయ అనుబంధరంగాలు, ఆర్థిక, సామాజిక, పర్యావరణ అభివృద్ధి ప్రభావం కేవలం దాని కమాండ్ ప్రాంతానికే పరిమితం కాదు. సమాజంలోని వివిధ ఇతర రంగాలపై కూడా పడి రాష్ట్రం మొత్తానికి విస్తరించే అవకాశం ఉన్నది. ఇలాంటి ప్రాజెక్టు వల్ల ప్రాథమికంగా అధిక వ్యవసాయ ఉత్పత్తి, సాగు విస్తీర్ణం పెరగటం, ఒకటికి మించిన పంటలు వేయడం, భూగర్భ జలాలు పెరగడం లాంటి పలు ప్రయోజనాలుంటాయి. దీంతో ఇతోధికంగా గ్రామీణ ఉపాధి అవకాశాలు పెరుగుతాయి. వ్యవసాయంలో రాబడి.. వ్యవసాయేతర వ్యాపారానికి బాటలు వేస్తుంది. గ్రామీణ ప్రాం తాల తలసరి ఆదాయం పెరుగుదల, తాగునీటి లభ్యత, పౌష్ఠికాహారం మెరుగైన ఆరోగ్యంతో జీవన ప్రమాణాలు పెరుగుతాయి.
జలాశయాల వద్ద వాటర్ రిక్రియేషన్ వసతులు, హోటళ్లు, రిసార్ట్స్ లాంటివి పెరుగుతాయి. ఇవన్నీ కూడా అక్కడి ప్రజలకు అధిక తలసరి ఆదాయం ఇవ్వడమే కాకుండా, ప్రభుత్వ ఖజానాకు కూడా రెవెన్యూను పెంచి ఆర్థికాభివృద్ధికి తోడ్పడుతాయి. కాళేశ్వరం బహుళ ప్రయోజనాల వల్ల పెంచే రెవె న్యూ ద్వారా అనతికాలంలోనే దాని ఆపరేషన్ వ్యయాన్ని భరించే పరిస్థితులు ఏర్పడుతాయి.
తెలంగాణ మీదుగా పుష్కలంగా నీళ్లతో కిందికి పారుతున్న గోదావరి నది ఉన్నది. అందులో తెలంగాణకు 968 టీఎంసీల వాటా ఉంది. ఉమ్మ డి రాష్ట్రం పుణ్యమాని అందులో సగం కూడా వాడుకోలేదు. తెలంగాణలో 30 శాతం కంటే ఎక్కువ సాగునీటి వసతి లేదు. కష్టమైనా ఖర్చుతో కూడుకొన్నదైనా తన వాటా నీటిని గోదావరి నది నుంచి తెలంగాణ ఎగువకు ఎక్కించక తప్పదు. దానికి అంచెలంచెలుగా ఎత్తిపోతల ద్వారా తీసుకుపోవడం తప్ప వేరే మార్గం లేదు. అందుకే ఈ బృహత్తర కాళేశ్వరం ప్రాజెక్టు.
రాష్ట్రంలో ఇంకా మిగిలిపోయినవి కృష్ణానది మీద పాలమూరు ఎత్తిపోతల పథకం, ఇతర ప్రాజెక్టులు పూర్తిచేస్తే.. రాష్ర్టానికి సంపన్నమైన నీటి భద్రత కలుగుతుంది. ఏదేమైనా గోదావరిలో కానీ, కృష్ణానది లో కానీ మన వాటా నీళ్లను పూర్తిగా వినియోగించుకోవడానికి ప్రభుత్వం ప్రథమ ప్రాధాన్యం ఇవ్వటం హర్షణీయం. ఎంత ఖర్చుకైనా వెనుకడుగు వేయకుండా తెలంగాణ నీటి అవసరాలను తీర్చేటందుకు ప్రాజెక్టులను నిర్మిస్తున్న తెలంగాణ ప్రభు త్వం దార్శనికతను, ధృడ సంకల్పా న్ని అభినందించక తప్పదు.
ఈ ప్రాజెక్టు పెట్టుబడి ఖర్చు రూ.80 వేల కోట్లకు పైనే. విద్యుత్తు అవసరం 4,600 మెగావాట్లు. ప్రాజెక్టు పెట్టుబడి కాకుండా దాని నిర్వహణ ఖర్చు కూడా చాలా ఎక్కువగా ఉంటుంది. దానిమీద చాలా తర్జనభర్జనలు జరిగాయి. ప్రాజెక్టు ఆర్థికంగా, సాంకేతికంగా ఆచరణయోగ్యం కాదనే వాదనలు వినిపించాయి. అయితే సాంకేతికంగా ఆచరణయోగ్యమని ఇప్పటివరకు పూర్తయిన పనులే చెప్తున్నవి. ప్రాజెక్టుకు కావలసిన విద్యుదుత్పత్తి, దాని ఉపయోగంలో కూడా పెద్దగా సమస్యల్లేవు. ఇక మిగిలిందల్లా ఆర్థిక స్వావలంబన. కేంద్రం చేస్తామన్న సహాయం చేయకపోయినా, రెవెన్యూ రాబడి తగ్గినా రాష్ట్ర ప్రభుత్వం కృతనిశ్చయంతో ఈ మెగా ప్రాజెక్టును రికార్డు సమయంలో పూర్తిచేయటం చూస్తూనే ఉన్నాం.
– జె.ఆర్.జనుంపల్లి
83473 68944