ఒక తల్లి కోతి తన బిడ్డను చంకనేసుకొని అడవిమార్గం గుండా పోతున్నది. మార్గమధ్యలో వాటికి ఒక కాలువ అడ్డం వచ్చింది. ఆ కాల్వను దాటేందుకు తల్లి కోతి పిల్ల కోతిని చంకనెత్తుకొని నీటిలోకి దిగింది. పోగా.. పోగా నీళ్లు చంక దగ్గరికి వచ్చాయి. అప్పుడు తల్లి కోతి తన పిల్లను నెత్తిన కూర్చోబెట్టుకొని కాలువ దాటేందుకు ప్రయత్నిస్తున్నది. మధ్యలోకి చేరగానే కోతులు మునిగేంతవరకు నీటి ఊట వచ్చింది. ఇక చేసేదేం లేక తాను బతికి బయటపడాలనుకున్న పెద్ద కోతి తన నెత్తిన ఉన్న పిల్ల కోతిని నీటిలో పడేసింది. దాని మీద నిలబడి ప్రాణాపాయం నుంచి తప్పించుకున్నది. నీటి ఊట తగ్గగానే బతుకు జీవుడా అంటూ పెద్ద కోతి ప్రాణాలతో బయటపడ్డది. ఇటీవల కాంగ్రెస్లో చేరిన కడియం శ్రీహరి ఉదంతం చూస్తుంటే చిన్నప్పుడు చదివిన ఈ పంచతంత్ర కథ గుర్తుకువచ్చింది. కడియం శ్రీహరి గతంలోకి ఒక్కసారి తొంగి చూస్తే ఈ కథ తనదేనని అనుకోకతప్పదు.
తెలంగాణ రాష్ట్ర సాధన కోసం కల్వకుంట్ల చంద్రశేఖర్రావు నేతృత్వంలో ఉద్యమం ఉధృతంగా జరుగుతున్న రోజులవి. కేసీఆర్ ఎంచుకున్న ప్రధాన పంథా ఉప ఎన్నికలు. అందులో భాగంగానే అధికార పార్టీని కాదనుకొని గులాబీ జెండా ఎత్తుకున్నడు తాటికొండ రాజయ్య. నాడు అధికారంలో ఉన్న కాంగ్రెస్నే కాదు, ఆ పార్టీ నుంచి సంక్రమించిన శాసనసభ్యత్వాన్ని కూడా తృణప్రాయంగా వదులుకున్నారు. తత్ఫలితంగా వరంగల్ జిల్లా స్టేషన్ ఘణపూర్ నియోజకవర్గానికి ఉప ఎన్నిక వచ్చింది. గులాబీ పార్టీ అభ్యర్థిగా తాటికొండ రాజయ్య, టీడీపీ నుంచి కడియం శ్రీహరి, కాంగ్రెస్ తరపున ప్రతాప్ బరిలో నిలిచారు. ఆ ఎన్నికల్లో గులాబీ పార్టీ తరపున ప్రచార బాధ్యతలను నిర్వహిస్తున్న టి.హరీశ్రావును దృష్టిలో పెట్టుకుని ‘ఎవడో.. సిద్దిపేట నుంచి వచ్చిండట, వాడు నన్ను ఓడిస్తాడట, వాడు నా కాలు గోటి వేలితో సమానం’ అంటూ కడియం శ్రీహరి పేట్రేగిపోయారు. అంతే ప్రజలు ఆ ఎన్నికల్లో కడియం శ్రీహరిని మట్టికరిపించారు.
సీన్ కట్ చేస్తే… కేసీఆర్ ఉద్యమంతో కేంద్రం దిగివచ్చింది. 2014 జూన్ 2 నాటికి తెలంగాణ ఏర్పడటంతో కొత్తగా ఏర్పడ్డ తెలంగాణలో అటు లోక్సభకు, ఇటు శాసనసభకు ఒకేసారి ఎన్నికలు జరిగాయి. అప్పటికే టీడీపీ అంతరించిపోతున్న సంకేతాలు స్పష్టంగా అర్థమవుతున్నాయి. అంతే.. కడియం శ్రీహరికి తత్వం బోధపడినట్టున్నది. గులాబీ గూటికి చేరారు. 2014 లోక్సభ ఎన్నికల్లో గులాబీ పార్టీ తరపున వరంగల్ లోక్సభకు పోటీ చేసిన కడియం, స్టేషన్ ఘణపూర్ నుంచి పోటీచేసిన తాటికొండ రాజయ్య ఇద్దరూ విజయం సాధించారు. ఆ తర్వాత కొత్తగా ఏర్పడిన తొలి మంత్రివర్గంలో తెలంగాణ తొలి ఉప ముఖ్యమంత్రిగా తాటికొండ రాజయ్య బాధ్యతలు స్వీకరించారు. ఇంతవరకు బాగానే ఉంది.
కానీ, ప్రత్యర్థి తాటికొండ రాజయ్య ఉప ముఖ్యమంత్రి కావడాన్ని కడియం శ్రీహరి జీర్ణించుకోలేకపోయారు. ఆ పదవిపై కన్నేసిన కడియం శ్రీహరి.. తాటికొండ రాజయ్యపై అధిష్ఠానానికి తప్పుడు సమాచారం అందించారు. మొత్తమ్మీద తాటికొండ రాజయ్య పదవికి ఎసరు పెట్టడంలో శ్రీహరి విజయం సాధించారు. కానీ, శ్రీహరి నిజస్వరూపం కాంగ్రెస్లో చేరేదాకా బయటపడలేదు. కించిత్ అనుమానం రాకుండా జాగ్రత్త పడటంలో తన రాజకీయ అనుభవాన్ని ఆసాంతం వాడేసుకున్నారు కడియం శ్రీహరి. ఆ తర్వాత ఆయనే ఉప ముఖ్యమంత్రి అయ్యారు. అధిష్ఠానానికి తాటికొండ రాజయ్య, పసునూరి దయాకర్, ఆరూరి రమేశ్లకు మధ్యన గ్యాప్ పెంచడంలో సక్సెసయ్యారు.
రానున్న పార్లమెంట్ ఎన్నికల్లో పోటీదారులను పక్కకుతప్పించి తన వారసురాలంటూ బిడ్డ కడియం కావ్యకు బీఆర్ఎస్ నుంచి వరంగల్ లోక్సభ సీటు ఇప్పించుకోవడం అందరికీ తెలిసిందే. ఈ ఎపిసోడ్లో కూడా పార్టీకి, అధిష్ఠానానికి మాత్రమే కాదు, లోకల్ క్యాడర్కు లీడర్కు కూడా తెలియనంత గోప్యత పాటిస్తూనే పోయి కాంగ్రెస్ కండువాను కప్పుకొన్నారు కడియం శ్రీహరి. కడియం కథ చూస్తుంటే పైన ఉన్న చిన్నయ్య సూరి పంచతంత్ర కథ గుర్తుకురాకుంటే మరేం గుర్తుకువస్తుంది. ఈ కథలో తల్లి కోతి కడియం అయితే పిల్లలు తాటికొండ రాజయ్య, పసునూరి దయాకర్, ఆరూరి రమేశ్లు.
‘మనుమరాలు వయస్సులో ఉన్న అమ్మాయి మీద ఓడిపోయిన నువ్వా నాకు నీతులు చెప్పేది’ అంటూ ఎర్రబెల్లి దయాకర్ రావు మీద విరుచుకుపడిన కడియం శ్రీహరి ఈ విషయాన్ని గుర్తుంచుకోవాలి. పీసీసీ అధ్యక్షుడిగా, సుదీర్ఘకాలం మంత్రిగా, ముఖ్యమంత్రిగా పనిచేసి, జీవిత చరమాంకంలో గవర్నర్గా విధులు నిర్వహించిన దివంగత కొణిజేటి రోశయ్య కూడా 1994లో ఓడిపోయారు. ఆయన ఓడిపోయింది కూడా మనుమరాలు వయస్సున్న గోగినేని ఉమ మీద అన్న విషయం మరిచిపోకూడదు. తమకున్న రాజకీయ అనుభవంతో ముందుకుతీసుకుపోతారని కలలుగన్న సమాజాన్ని నట్టేట ముంచిన మీకు కాలమే తగినరీతిలో గుణపాఠం చెప్తుంది.
– రమేష్బాబు కాంచనపల్లి