బంగారం మీద భారతీయులకు ఉండే మోజు అంతా ఇంతా కాదు. ధగధగలాడే పసుపువన్నె లోహం మీద మోజుపడని భారతీయుడు, విశేషించి భారతీయ మహిళ ఉండదంటే అతిశయోక్తి కాదు. ప్రపంచ పసిడి వినిమయంలో చైనా తర్వాత భారత్ రెండోస్థానంలో ఉండటమే అందుకు నిదర్శనం. అయితే ఇప్పుడు కేంద్ర సర్కార్ తలపెట్టిన సుంకాల పెంపు మనదేశంలో పసిడి డిమాండ్కు అడ్డుకట్టలు వేస్తున్నది. బంగారంపై దిగుమతి సుంకాలను బుధవారం ఏకబిగిన రెండింతలకు పైగా పెంచడం కీలక పరిణామం. కొత్త రేట్ల ప్రకారం ప్రాథమిక కస్టమ్స్ సుంకం 5 నుంచి 10 శాతానికి, వ్యవసాయ మౌలిక రంగం, అభివృద్ధి సెస్ (ఏఐడీసీ) 1 నుంచి 5 శాతానికి పెరిగింది.
వెరసి మొత్తం సుంకం 6 శాతం నుంచి 10 శాతానికి పెరుగుతుందన్నమాట. ఇదేదో సాధారణ సుంకాల సవరణగా భావించడానికి వీల్లేదు. బంగారం డిమాండ్పై నీళ్లు చల్లడం, అంతంతమాత్రంగా ఉన్న విదేశీమారక నిల్వల్ని కాపాడుకోవడమే లక్ష్యంగా కేంద్రం ఈ సవరణలు తెచ్చిందనేది వాస్తవం. బంగారం కొనుగోలు వెనుక పెండ్లిళ్లు, పండుగలు వంటి సాంస్కృతిక అంశాలు, సురక్షితమైన మదుపు అనే ఆర్థిక కోణమూ ఉన్నాయి. ఇప్పుడు కేంద్రం ఈ రెండింటినీ లక్ష్యంగా చేసుకున్నది.
మొన్న హైదరాబాద్ సభలో ప్రధాని నరేంద్ర మోదీ బంగారం కొనుగోలు తగ్గించాలని దేశ ప్రజలకు సలహా ఇవ్వడం తెలిసిందే. తన ఏలుబడిలో దేశం వెలిగిపోతున్నదని టాం టాం వేసుకునే ప్రధాని పొదుపు మంత్రం పఠించడం విడ్డూరం.
ఇరాన్ యుద్ధాన్ని ఓ సాకుగా చూపుతున్నప్పటికీ అసలు సమస్య గత పన్నెండేండ్ల ఆర్థిక నిర్వహణ వైఫల్యాలతోననే విషయం తెలిసిందే. మన దేశంలో బంగారం వినిమయం ఎక్కువే అయినప్పటికీ డిమాండ్లో చాలావరకు దిగుమతుల ద్వారా నే సమకూరుతుంది. అదీ డాలర్ మారకంగా జరుగుతుండటమే కీలకం. మనదేశపు దిగుమతి వ్యయంలో బంగారం వాటా 10 శాతం వరకు ఉంటుంది. దేశంలోకి బంగారం రాక తగ్గితే, డాలర్ల పలాయనం ఆ మేరకు తగ్గిపోతుంది. ఒక అంచనా ప్రకారం దిగుమతి 30-40 శాతం తగ్గితే ఏడాదిలో 20-25 బిలియన్ డాలర్లు ఆదా అవుతాయి. ఈ పొదుపు మాటేమోగానీ సుంకం పెంపుతో బంగారం ధర ఇబ్బడిముబ్బడిగా పెరగడం ఖాయం. మరోవైపు బంగారం దొంగరవాణా పెచ్చరిల్లడం, వృత్తిదారులకు పని తగ్గిపోవడం ఖాయమని పరిశ్రమ వర్గాలు ఆందోళన చెందుతున్నాయి.
మోదీ బంగారంపై ఇచ్చిన పొదుపు సలహా పుణ్యమాని జ్యుయల్లరీ షేర్లు 20 శాతం పడిపోయాయి. దీనివల్ల పెట్టుబడిదారుల సంపద దాదాపు రూ.60 వేల కోట్లు ఆవిరైపోయాయి. ఇప్పుడు సుంకాల దెబ్బతో నగల పరిశ్రమ కుదేలయ్యే ప్రమాదం పొడసూపుతున్నది. బంగారు నగల తయారీపై ఆధారపడే లక్షలాది కుటుంబాల బతుకుదెరువును దేశ ప్రయోజనాల పేరిట బలిచేస్తుండటం విచారకరం.
అదేదో సినిమా డైలాగ్ తరహాలో ‘దేశం క్లిష్టపరిస్థితుల్లో’ ఉన్నమాట నిజమే కావచ్చు. అయితే ఈ పరిస్థితికి ప్రజల కన్నా ప్రభుత్వ బాధ్యతే ఎక్కువ. విదేశీ పెట్టుబడులు ఎగిరిపోకుండా కాపాడటంలో కేంద్రం వైఫల్యం తెలిసిందే. అట్టహాసంగా ప్రారంభించిన మేకిన్ ఇండియా వంటి పారిశ్రామిక ప్రోత్సాహక పథకాలు గుట్టుగా అటకెక్కడం వాటి అమలులో అసమర్థతను వేలెత్తి చూపుతున్నది. ఇందులో మూడో కోణం కూడా ఉన్నది. డాలర్ మారకంలో రూపాయి విలువ అథఃపాతాళానికి పడిపోయి 95.88కు చేరుకున్నది. ఈ పతనాన్ని ఆపేందుకు ‘బంగారు కలలకు’ కోత పెట్టాలని చూస్తున్నారన్న మాట.