విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందించడం కంటే, రాజకీయ ప్రత్యర్థులను జైల్లో పెట్టడం సులభమని కేంద్రంలోని నరేంద్ర మోదీ ప్రభుత్వానికి చురకలంటించారు ఢిల్లీ మాజీ ఉప ముఖ్యమంత్రి మనీశ్ సిసోడియా. ప్రస్తుతం జైల్లో ఉన్న ఆయన ‘విద్యా రాజకీయాలు-జైలు’ పేరుతో మూడు పేజీల లేఖ రాశారు. ప్రస్తుతం జైలు రాజకీయాలదే పైచేయిగా కనిపిస్తున్నప్పటికీ, చివరికి విద్యా రాజకీయాలే విజయం సాధిస్తాయని ఆయన విశ్వాసం వ్యక్తం చేశారు. జైలుకు వెళ్లిన తర్వాత తొలిసారిగా సిసోడియా ఈ లేఖ ద్వారా తన అభిప్రాయాలను బయటి ప్రపంచంతో పంచుకున్నారు. లేఖ పూర్తి పాఠం..
‘ఇప్పటి వరకూ దేశాన్ని, రాష్ట్రాలను పాలించిన నేతలు దేశంలోని బాలల కోసం మంచి పాఠశాలలను, కళాశాలలను ఎందుకు ఏర్పాటు చేయలేదనే ప్రశ్న నేను ఢిల్లీ విద్యామంత్రిగా పని చేస్తున్నప్పుడు అనేక మార్లు ఎదురైంది. మన దేశ రాజకీయవ్యవస్థ విద్యారంగం మీద ఒక్కసారైనా మనస్పూర్తిగా దృష్టి పెట్టి ఉంటే, అభివృద్ధి చెందిన దేశాలలో లాగా భారత్లో కూడా ప్రతి చిన్నారికి అత్యుత్తమ పాఠశాలలు అందుబాటులో ఉండేవి. కానీ, రాజకీయాలు ఎల్లప్పుడూ విద్యను చిట్టచివరి రంగంగానే ఎందుకు పరిగణించాయి? గత కొన్ని రోజులుగా జైల్లో ఉన్న నాకు ఈ ప్రశ్నలకు సమాధానాలు దొరుకుతున్నాయి. (ప్రత్యర్థులను) జైలుకు పంపి రాజకీయాల్లో విజయం సాధిస్తున్నప్పుడు ఎవరికైనా విద్యారంగాన్ని పునాదిగా చేసుకొని రాజకీయాలు చేద్దామని ఎందుకు అనిపిస్తుంది. అత్యుత్తమ స్కూళ్లను, కాలేజీలను ఏర్పాటు చేసి, వాటిని నిర్వహించటం కంటే అధికార వ్యవస్థను ఎదిరిస్తూ మాట్లాడేవారిని జైలుకు పంపించటం ద్వారా, జైలుకు పంపుతామని బెదిరించటం ద్వారా నోరు మూయించటం సులువు. ఉత్తరప్రదేశ్లోని బీజేపీ నాయకులు ఒక గాయని పాడిన జానపద గీతంపై అభ్యంతరం వ్యక్తం చేస్తూ, ఆమెకు పోలీసు నోటీసులు పంపించి బెదిరించారు. ప్రధాని మోదీ పేరు తప్పుగా పలికినందుకు కాంగ్రెస్ అధికార ప్రతినిధి ఒకరిని భయంకరమైన నేరస్థుడిలాగా పరిగణిస్తూ రెండు రాష్ట్రాల పోలీసులు నాటకీయంగా అదుపులోకి తీసుకున్నారు.
అరవింద్ కేజ్రీవాల్జీ చేసిన నేరం చాలా పెద్దది. మోదీజీ రాజకీయాలకు వ్యతిరేకంగా ఆయన ఒక ప్రత్యామ్నాయ రాజకీయాల నమూనాను సృష్టించారు. ఇది ఎంత పెద్ద నేరం! దీని వల్లనే ఈ రోజు కేజ్రీవాల్ ప్రభుత్వంలోని ఇద్దరు మంత్రులు జైలులో ఉన్నారు. జైలు రాజకీయాలు అధికారంలో కూర్చున్న నాయకుడిని పెద్దగా, శక్తిమంతంగా చేస్తున్నాయి. కానీ, విద్యా రాజకీయాలు నాయకుడిని కాకుండా దేశాన్ని శక్తిమంతం చేస్తాయి. విద్య ద్వారా అత్యంత బలహీన కుటుంబానికి చెందిన ఒక పిల్లవాడు సైతం బలమైన పౌరుడిగా ఎదిగినప్పుడు దేశం దానంతట అదే బలోపేతమవుతుంది.
దేశ స్వాతంత్య్ర అమృతోత్సవాలు జరుపుకొంటున్న తరుణంలో జైలు రాజకీయాలు, విద్యా రాజకీయాలు పరస్పరం పోటీ పడటం ఒక మంచి పరిణామం. తమను తాము శక్తిమంతం చేసుకోవటానికి రాజకీయాలు చేస్తున్నదెవరు? దేశాన్ని శక్తిమంతం చేయటానికి రాజకీయాలు చేస్తున్నదెవరు? ఈ రెండు రకాల నేతలను దేశ ప్రజానీకం స్పష్టంగా గమనిస్తున్నది. విద్యా రాజకీయాలు చేయటం అంత సులువైన పని కాదు. కనీసం రాజకీయాల్లో విజయానికి అది దగ్గరి దారి కాదని చెప్పవచ్చు. ఎంతోమంది పిల్లలు, తల్లిదండ్రులు, ఉపాధ్యాయులలో స్ఫూర్తిని నింపటం సుదీర్ఘమైన పని. జైలు రాజకీయాలు అలా కాదు. దర్యాప్తు సంస్థలకు చెందిన నలుగురు అధికారులపై ఒత్తిడి తెస్తే చాలు విజయం సొంతమవుతుంది. విద్యా రాజకీయాల్లో అది కుదరదు. దర్యాప్తు సంస్థలపై ఒత్తిడి తెచ్చి నేడు ఎవరినైనా జైలుకు పంపించే పరిస్థితులున్నాయి. కానీ, విద్యా రాజకీయాల్లో కనీసం ఒక్క టీచర్పైన కూడా పని చేయమని ఒత్తిడి చేయలేము. బెదిరించలేము. ఉపాధ్యాయులు తమకు లభించే గౌరవం కోసం, ప్రేమ కోసం పని చేస్తారు. వారిని మీ ప్రవర్తన ద్వారా, విలువల ద్వారా మాత్రమే బాగా పని చేసేలా ప్రేరేపించటం సాధ్యమవుతుంది. దర్యాప్తు సంస్థలలాగా ఒత్తిడిలో వారు పని చేయలేరు. అందుకనే మన రాజకీయ నాయకులు విద్యా రాజకీయాల కంటే జైలు రాజకీయాలను సులభమైనవిగా, ఫలితాలను ఇచ్చేవిగా పరిగణిస్తారు.
జైలు రాజకీయాలతో సులభంగా దక్కుతున్న విజయం వల్ల రాజకీయాల్లో విద్యకు స్థానం లేకుండా పోయింది. అయితే ఒక మంచి సంకేతం ఏమంటే విద్యా రాజకీయాలు ఇప్పుడిప్పుడే దేశ ఓటర్ల అభిమానాన్ని చూరగొంటున్నాయి. ఢిల్లీ విద్యావిధానంతో ప్రభావితమైన పంజాబ్ ఓటర్లు మంచి విద్యను, మంచి ప్రభుత్వ పాఠశాలలను అందిస్తామన్న ఆప్కు పట్టం గట్టారు.
స్వాతంత్య్ర అమృతోత్సవాలు జరుపుకొంటున్న వేళ జైలు రాజకీయాలు, విద్యా రాజకీయాలు పోటీ పడటం ఒక మంచి పరిణామం. తమను తాము శక్తిమంతం చేసుకోవటానికి రాజకీయాలు చేస్తున్నదెవరు? దేశాన్ని శక్తిమంతం చేయటానికి రాజకీయాలు చేస్తున్నదెవరు? ప్రజలు గమనిస్తున్నారు.
బీజేపీ యేతర, కాంగ్రెసేతర రాష్ట్ర ప్రభుత్వాలు రాజకీయాలకతీతంగా ఎదిగి, ఒకరి మంచిని మరొకరు నేర్చుకుంటున్నారు. బీజేపీ పాలనలో ఉన్న రాష్ర్టాల్లో పాఠశాలలు జంక్గార్డెన్లా (తుక్కు దుకాణాల్లా) ఉండవచ్చు, కానీ ఆయా రాష్ర్టాల ముఖ్యమంత్రులు కూడా విద్యారంగం గురించి టీవీలలో ఐదు నిమిషాల ప్రకటనలు ఇవ్వక తప్పటం లేదు. విద్యా రాజకీయాలు ఉన్నత స్థానానికి చేరుకున్న తర్వాత, జైలు రాజకీయాలు క్రమేణా కనుమరుగవటమే కాదు, ఏకంగా జైళ్లనే మూసివేసే పరిస్థితులు వస్తాయని వారికి కూడా తెలుసు.
నేడు, జైలు రాజకీయాలు విజయం సాధిస్తుండవచ్చు.. కానీ, పాఠశాల రాజకీయాలు, విద్యా రాజకీయాల్లోనే భారతదేశ భవిష్యత్తు ఉన్నదనేది వాస్తవం. దేశంలో ఉన్న జైళ్ల వల్ల భారత్ ఎన్నటికీ ప్రపంచ అగ్రగామి దేశంగా అవతరించదు. అది ఎన్నటికైనా దేశంలోని విద్యావ్యవస్థ సృష్టించే శక్తిసామర్థ్యాల వల్లనే సాధ్యపడుతుంది. జైలు రాజకీయాలు ఇప్పుడు శక్తిమంతంగా అనిపిస్తుండవచ్చు కానీ, భవిష్యత్తు అంతా విద్యా రాజకీయాలదే.’
– మనీశ్ సిసోడియా (ఢిల్లీ మాజీ ఉప ముఖ్యమంత్రి)