చైతన్యవంతమైన పాట పోరాటానికి ప్రతి రూపం. చెప్పాలనుకున్న విషయాన్ని సూటిగా ప్రజల గుండెల్లోకి తీసుకెళ్లేది పాటే. నాటి తెలంగాణ సాయుధ పోరాటం మొదలుకొని నిన్నటి మలి దశతెలంగాణ ఉద్యమం వరకు పాటే పోరు కెరటం అయినది. అలాంటి పాటల ప్రవాహానికి బలాన్ని, బలగాన్ని సమకూర్చిన ప్రజా గాయకుడు సుద్దాల హనుమంతు. బాంచెన్ దొర… నీ కాల్మొక్కుతా అన్న వారితో బందూకులను పట్టించిన ఘనత ఆయనది.
బ్రతికినంత కాలం ప్రజల బాణీలోనే పాటలందించి తన జీవితాన్ని తెలంగాణ ఉద్యమానికి, అభివృద్ధికి అంకితం చేసిన సుద్దాల హనుమంతు 1910 సంవత్సరంలో యాదాద్రి భువనగిరి జిల్లా మోత్కూరు మండలంలోని పాలడుగు గ్రామంలో లక్ష్మీ నరసమ్మ , బుచ్చి రాములు దంపతులకు జన్మించారు.14 ఏళ్ల వయసులోనే ఆయన పాటలు పాడటం మొదలు పెట్టారు. అవి తెలంగాణలోని ప్రతి గడపనూ పలకరించాయి. ప్రతి గుండెనూ తట్టి లేపాయి. యుక్త వయస్సులో హైదరాబాద్లో వ్యవసాయ శాఖలో చిన్న ఉద్యోగం చేసుకుంటూ నిజాం పాలన వ్యతిరేక ఉద్యమాల్లో చురుగ్గా పాల్గొనేవారు సుద్దాల హనుమంతు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా పనిచేస్తున్నాడని తెలియడంతో అధికారులు ఆయనను ప్రశ్నించారు. స్వేచ్ఛ లేకుండా ఆత్మాభిమానం చంపుకుని ఉద్యోగం చేయడం ఇష్టం లేని హనుమంతు ఉద్యోగానికి రాజీనామా చేసి సుద్దాలకు వచ్చారు. పాటలతో నిజాం రాక్షస పాలనపై రణభేరి మ్రోగించారు.
1944లో భువనగిరిలో జరిగిన 11వ ఆంధ్ర మహాసభకు హనుమంతు వలంటీరుగా పని చేశారు. ఆ సభలో నాయకుల ప్రసంగాలతో ఉత్తేజితుడై తన కలానికి, గళానికి పదును పెట్టారు. ఆంధ్ర మహాసభ ఇచ్చిన పిలుపునందుకుని ప్రతి గ్రామంలో ‘సంఘం’ పెట్టడానికి ప్రజలను చైతన్యవంతం చేశారు. నిజాం పాలనకు వ్యతిరేకంగా జరిగిన 1946-51 తెలంగాణ సాయుధ పోరాటంలో కమ్యూనిస్టు పార్టీ సాంస్కృతిక దళానికి నాయకత్వం వహించారు. వేలాది ప్రదర్శనలు ఇచ్చిన హనుమంతు ఆ రోజులలో తెలంగాణకు చైతన్య దీపంగా వెలిగారు. ఆయన పాటలు జనం నాలుకల మీద నాట్యం చేసేవి. ఆనాడు హనుమంతు రాసిన పాటలు పాడని గ్రామం లేదు. ప్రజల భాషలో, యాసలో, శైలిలో ప్రజాపయోగమైన ఎన్నో పాటలు రాసి, పాడి పలు ప్రదర్శనలు ఇచ్చారు హనుమంతు. ఆయన బుర్ర కథ చెబితే గడ్డి పోచ కూడా యుద్ధానికి సిద్ధమవుతుందని, ఫిరంగిలా పేలుతుందని ఆనాటి ప్రజలు భావించేవారు!
అణచివేతను మౌనంగా భరిస్తున్న పీడిత వర్గాలను పోరాటం వైపు నడిపించిన పాటల సేనాని సుద్దాల హనుమంతు. హరికథ, బుర్రకథ, యక్ష గానాలతో నిజాం నిరంకుశ పాలకుల కోట గోడలను కూల్చివేసిన జనగీతం ఆయన. సరళమైన పదాలతో అందరికీ అర్థమయ్యే విధంగా పాటలు పాడుతూ దొరల ఆగడాలను పల్లె సుద్దుల రూపంలో చెప్పి ప్రజలను చైతన్య పరిచిన పోరాట యోధుడు ఆయన. నాటి తరానికి ‘పల్లెటూరి పిల్లగాడ… పసులగాచే మొనగాడా’ పాట వినపడగానే హనుమంతు నిలువెత్తు విగ్రహం ఎదుట నిలిచేది. అప్పటికప్పుడు ఉద్యమ అవసరాల నిమిత్తం ఆశువుగా పాడడం ప్రజా కవి హనుమంతు ప్రత్యేకత. వెట్టి చాకిరీ విధానమో రైతన్నఎంత జెప్పిన తీరదో కూలన్న అంటూ దుర్మార్గమైన వ్యవస్థను సుద్దాల హనుమంతు తన పాటల్లో వర్ణించారు.
వెట్టి చాకిరీతో నలిగిపోతున్న తెలంగాణ బాల్యాన్ని హనుమంతు ప్రపంచానికి పరిచయం చేశారు. సంఘం వచ్చిందిరో రైతన్న… మనకు బలం తెచ్చిందిరో కూలన్న… అంటూ హనుమంతు పాడుతూ ఉంటే నిర్భంధంలో ఉన్న ప్రజలకు ఎక్కడ లేని ధైర్యం వచ్చేది. ఏయే దొర కబంధ హస్తాల్లో ఎన్ని వేల ఎకరాల భూములు ఉన్నాయో వివరాలు సేకరించి, దొరల భూ అక్రమాలను పల్లె సుద్దుల రూపంలో పాడుతూ ప్రజలను చైతన్య పరిచేవారు హనుమంతు.
రాజంపేట మండలం రేణిగుంటలో కమ్యూనిస్టు గ్రామసభలో మా భూమి నాటకం గొల్ల సుద్దుల ప్రదర్శనలు చేస్తున్న సమయంలో నిజాం మూకలు వస్తున్నాయని బాల కళాకారులు సమాచారం ఇచ్చారు. ఆ సమయంలో హనుమంతు ఒక ముసలావిడ చేతి కర్ర తీసుకుని ‘వేయ్ వేయ్ దెబ్బకు దెబ్బ’ అంటూ పారిపోతున్న ప్రజల్లో మనో ధైర్యం నింపారు. నిజాం సైన్యాన్ని ప్రజలే తరిమికొట్టేలా చైతన్యం తెచ్చారు. ఈ ఘటన తెలంగాణ సాయుధ పోరాటంలో కీలక ఘట్టం. పాటకు నిలయమై, పోరాటానికి నిలువెత్తు రూపమై తెలంగాణ సాయుధ పోరాటంలో చెరగని ముద్ర వేసిన సుద్దాల హనుమంతు క్యాన్సర్ వ్యాధితో 1982 అక్టోబర్ 10న తన జీవన ప్రస్థానాన్ని ముగించారు. ఆయన స్ఫూర్తిని భావి తరాలకు అందించాల్సిన బాధ్యత మనందరిపై ఉంది.
అంకం నరేష్: 63016 50324