అమెరికాలోని ఒక స్టార్టప్ కంపెనీ అది. పేరు ‘హిండెన్బర్గ్’. కంపెనీల ఆర్థిక కార్యకలాపాలపై పరిశోధనలు చేస్తూ ఉంటుంది. ప్రారంభించి ఐదేండ్లే అయింది. తొమ్మిది మందే ఉద్యోగులు. అయితేనేమి.. కార్పొరేట్ ప్రపంచాన్నే విస్మయపర్చేలా గడిచిన ఐదేండ్లలో ఏకంగా 16 కంపెనీల్లో ఆర్థిక అవకతవకలను వెలుగులోకి తీసుకొచ్చింది. ఈ సంస్థ ఇచ్చిన నివేదికల ప్రభావం ఎంతలా ఉన్నదంటే.. అమెరికాలోని సెక్యూరిటీస్ అండ్ ఎక్స్చేంజ్ కమిషన్ (ఎస్ఈసీ) స్వయంగా రంగంలోకి దిగి ఆయా కంపెనీలపై దర్యాప్తు జరుపాల్సి వచ్చింది.
ఫోరెన్సిక్ ఫైనాన్షియల్ రీసెర్చ్ సంస్థ ‘హిండెన్బర్గ్’ ఆరోపణల నేపథ్యంలో అదానీ గ్రూప్ కంపెనీ షేర్లు తీవ్ర నష్టాల్లో కొనసాగుతున్నాయి. ఇప్పటివరకూ ఆయా కంపెనీల మొత్తం మార్కెట్ క్యాపిటలైజేషన్ 90 బిలియన్ డాలర్లకు పైగా ఆవిరైంది. ఫోర్బ్స్ ప్రపంచ కుబేరుల జాబితాలో మొన్నటివరకూ మూడో స్థానంలో ఉన్న గౌతమ్ అదానీ 15వ స్థానానికి దిగజారారు. అదానీ గ్రూప్ను వణికిస్తున్నట్లుగానే.. ‘హిండెన్బర్గ్’ టార్గెట్ చేసిన ఏ కంపెనీ కూడా ఇప్పటివరకూ కోలుకోలేదు. అసలు ఏమిటీ సంస్థ? దాని విశ్వసనీయత ఏపాటిది??
ఏమిటీ ‘హిండెన్బర్గ్’ సంస్థ?
అమెరికాలోని న్యూయార్క్ కేంద్రంగా ఈ సంస్థ పనిచేస్తున్నది. ప్రపంచవ్యాప్తంగా కంపెనీల్లో జరిగే అవకతవకలు, మోసాలను గుర్తించడం, పెట్టుబడులు, రుణాలు, డెరివేటీవ్లను విశ్లేషించడం దీని పని. ఆర్థికరంగంలో ఉద్దేశపూర్వకంగా సృష్టించే కృత్రిమ విపత్తులను గుర్తించడమే తమ పని అని కంపెనీ వెబ్సైట్లో స్వయంగా వెల్లడించింది.
ఏర్పాటు చేసిందెవరు? అనుభవమేంటి?
‘హిండెన్బర్గ్’ కంపెనీని 2017లో నాథన్ అండర్సన్ (38) ఏర్పాటు చేశారు. అమెరికాలోని కనెక్టికట్ యూనివర్సిటీలో ఇంటర్నేషనల్ బిజినెస్ మేనేజ్మెంట్ డిగ్రీ పూర్తి చేశారు. ఆ తర్వాత కొన్నేళ్లు ఇజ్రాయెల్లోని జెరూసలెంలో అంబులెన్స్ డ్రైవర్గా పనిచేశాడు. తిరిగి అమెరికాకు వచ్చాక ఫ్యాక్ట్ సెట్ అనే సాఫ్ట్వేర్ కంపెనీలో చేరాడు. కంపెనీల్లో జరిగే ఆర్థిక అవకతవకలను గుర్తించటంలో అండర్సన్కు మంచి పట్టు ఉన్నది. కార్పొరేట్ ప్రపంచంలో అతిపెద్ద కుంభకోణంగా చెప్పుకొనే బెర్నీ మడాఫ్ మోసపూరిత లావాదేవీల గుట్టును విప్పిన వారిలో ఒకరైన హరీ మార్కోపోలోస్తో కలిసి అండర్సన్ ‘ప్లాటినం పార్ట్నర్స్’ అనే సంస్థపై దర్యాప్తు కోసం కలిసి పనిచేశారు. ఇదే సమయంలో షార్ట్ సెల్లింగ్, పెట్టుబడులు, రుణాలు, డెరివేటీవ్లను విశ్లేషించడం, ఆర్థిక మోసాల గురించి లోతుగా అధ్యయనం చేశాడు. ఆ తర్వాతే హిండెన్బర్గ్ కంపెనీని ఏర్పాటు చేశాడు.
హిండెన్బర్గ్ నెట్వర్క్ ఏమిటి?
హిండెన్బర్గ్ సంస్థలో వాస్తవంగా పనిచేసేది తొమ్మింది మంది ఉద్యోగులే. అయినప్పటికీ, 60కి పైగా దేశాల్లోని మాజీ టాప్ బ్యూరోక్రాట్లు, కార్పొరేట్ కంపెనీ ఉద్యోగులు, ఆర్థిక సంస్థలతో ‘హిండెన్బర్గ్ రీసెర్చ్’కు మంచి సంబంధాలు ఉన్నాయి. వికీలీక్స్, ఐసీఐజే నేతృత్వంలో బయటపడ్డ పాండోరా పేపర్స్, పెగాసస్, పనామా పేపర్స్ ఉదంతాల్లో కీలకపాత్ర పోషించిన టీమ్.. హిండెన్బర్గ్కు అనుబంధ సేవలు అందిస్తాయని వార్తలు వచ్చాయి.
హిండెన్బర్గ్ విశ్వసనీయత ఏమిటి?
హిండెన్బర్గ్ ఏదైనా కంపెనీని లక్ష్యంగా చేసుకొంటే తొలుత ఆరు నుంచి రెండేండ్లకు పైగా ఆ కంపెనీకి సంబంధించిన పబ్లిక్ రికార్డులు, అంతర్గత కార్పొరేట్ పత్రాలను పరిశీలించి, కంపెనీ ప్రస్తుత, మాజీ ఉద్యోగుల ద్వారా సమాచారం సేకరిస్తుంది. ఆ తర్వాత హిండెన్బర్గ్తో కలిసి పనిచేసే బయటి బృందానికి వాటిని చేరవేస్తుంది. తర్వాత ఆ బృందం సదరు కంపెనీ షేర్లలో షార్ట్ పొజిషన్లు తీసుకొంటాయి. ఇలా.. అక్రమాలకు పాల్పడుతున్నట్టు అనుమానం ఉన్న కంపెనీలో పరోక్షంగా షేర్లను కొనుగోలు చేసి.. అసలు వాస్తవాలను రాబట్టడం హిండెన్బర్గ్ విధానం. ఇలా 2017 నుంచి ఇప్పటివరకూ 16 కంపెనీలను లక్ష్యంగా చేసుకొని ఆయా కంపెనీలు అవకతవకలకు పాల్పడ్డట్టు హిండెన్బర్గ్ ఆరోపించింది. ఇందులో 99 శాతం కేసుల్లో (అదానీ గ్రూప్పై అంశం కాకుండా) ఆరోపణలు నిజమని రుజువైంది.
దివాళా అంచుకు చేరాల్సిందే..
2020లో అమెరికాలోని నికోలా మోటర్ కంపెనీపై హిండెన్బర్గ్ ఇచ్చిన నివేదిక సంచలనంగా మారింది. నికోలా మోటర్ కంపెనీ పేర్కొన్నట్టు ఎలక్ట్రిక్ ట్రక్కుల వేగానికి సంబంధించి కొన్ని అనుమానాలు ఉన్నాయని, నిజాలు దాస్తూ.. ఇన్వెస్టర్లను, కస్టమర్లను సదరు కంపెనీ మోసపుచ్చుతున్నదని ‘హిండెన్బర్గ్’ ఆరోపించింది. కంపెనీలో అవకతవకలు జరిగినట్టు అనంతరం జరిపిన దర్యాప్తులో బయటపడటంతో కంపెనీ స్టాక్ విలువ 56 శాతం మేర పతనమైంది.
‘హిండెన్బర్గ్’ ఆరోపణలు సంచలనంగా మారడంతో అమెరికా సెక్యూరిటీస్ అండ్ ఎక్స్చేంజ్ కమిషన్ (ఎస్ఈసీ) రంగంలోని దిగింది. తమ దర్యాప్తులోనూ కంపెనీలో మోసం జరిగినట్టు గుర్తించారు. దీంతో కంపెనీ ఎగ్జిక్యూటీవ్ చైర్మన్ పదవికి రాజీనామా చేశారు. కంపెనీ దివాళా తీసే స్థాయికి చేరింది. దీంతో సబ్సిడరీస్తో కలిపి కంపెనీ పేరును నికోలా కార్పొరేషన్గా మార్చారు. లార్డ్స్టోన్ మోటార్స్ కార్ప్ (యూఎస్), కండి (చైనా), క్లోవర్ హెల్త్ (యూఎస్), టెక్నోగ్లాస్ (కొలంబియా), ఆన్లైన్ బెట్టింగ్ ఆపరేటర్ ‘డ్రాఫ్ట్కింగ్స్’, జియోథర్మల్ పవర్ప్లాంట్స్ ‘ఓర్మట్ టెక్నాలజీస్’, ఎలక్ట్రిక్ కార్ల కంపెనీ ‘మెల్లెన్ టెక్నాలజీస్’, చైనాకు చెందిన బ్లాక్చైన్, క్రిప్టోమైనింగ్ కంపెనీ ‘ఎస్వోఎస్’లో హిండెన్బర్గ్ అవకతవకలను హిండెన్బర్గ్ గుర్తించింది. అనంతర కాలంలో ఇవి దాదాపుగా నిజమేనని తేలింది.
‘హిండెన్బర్గ్’ పేరు వెనుక కథ ఏంటంటే?
‘హిండెన్బర్గ్’ అనేది జర్మనీకి చెందిన ప్రయాణికుల హైడ్రోజన్ ఎయిర్ షిప్ పేరు. 1937లో అమెరికాలోని న్యూజెర్సీలో ప్రమాదానికి గురైంది. 35 మంది మరణించారు. ఈ ప్రమాదానికి కారణం మానవ తప్పిదమే అని తర్వాత దర్యాప్తులో తేలింది. ఈ ఉదంతాన్ని ఉటంకిస్తూ.. హిండెన్బర్గ్ పేరును తమ సంస్థకు పెట్టడానికి గల కారణాన్ని అండర్సన్ వెబ్సైట్లో ఇలా వివరించారు. ‘హిండెన్బర్గ్ఎయిర్ షిప్ దుర్ఘటన పూర్తిగా మానవుడు సృష్టించిన విపత్తు. మండే స్వభావం ఉన్న హైడ్రోజన్ నింపిన బెలూన్లో 100 మందిని ఎక్కించారు. గతంలో ఇలాంటి ఎయిర్షిప్లకు ప్రమాదాలు జరిగినా.. నిర్వాహకులు పట్టించుకోలేదు. మేము కూడా మానవులు ఉద్దేశపూర్వకంగా సృష్టించిన విపత్తులు మార్కెట్లో తిరుగుతుంటే వాటిని అన్వేషిస్తాం. అవి బాధితులను ఆకర్షించడానికి ముందే వాటిని వెలుగులోకి తీసుకొస్తాం’ అని తెలిపారు.
‘హిండెన్బర్గ్’ ఆరోపణలు సంచలనంగా మారడంతో అమెరికా సెక్యూరిటీస్ అండ్ ఎక్స్చేంజ్ కమిషన్ (ఎస్ఈసీ) రంగంలోని దిగింది. తమ దర్యాప్తులోనూ నికోలా మోటర్ కంపెనీలో మోసం జరిగినట్టు గుర్తించారు. దీంతో కంపెనీ ఎగ్జిక్యూటివ్ చైర్మన్ రాజీనామా చేశారు. కంపెనీ దివాళా తీసే స్థాయికి చేరింది.
కడవేర్గు రాజశేఖర్: 83093 70601