బీజేపీ నాయకులు భావిస్తున్నట్టుగా తెలంగాణలో బీజేపీ నిజంగానే బలపడుతున్నదా? మహబూబ్నగర్-రంగారెడ్డి-హైదరాబాద్ ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఆ పార్టీ బలపరిచిన ఏవీఎన్రెడ్డి విజయం సాధించిన నేపథ్యంలో ఇలాంటి చర్చ జరగడం సహజం. నిజానికి ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల ఫలితాలను సాధారణ ఎన్నికలతో పోల్చుకోవడం అత్యుత్సాహమే అవుతుంది. ఎమ్మెల్సీ ఎన్నికలను, సాధారణ ఎన్నికలను ప్రభావితం చేసే అంశాలు వేరువేరుగా ఉంటాయి.
మూడు ఉమ్మడి జిల్లాల్లో కలిపి ఓటింగ్లో పాల్గొన్న ఉపాధ్యాయ ఓటర్ల సంఖ్య సుమారు 26 వేలు. ఇందులో ప్రథమ ప్రాధాన్యంలో ఏవీఎన్రెడ్డి సాధించిన ఓట్లు దాదాపు 7,550. ఈ చిన్న పాకెట్ను ఆధారంగా చేసుకొని జరగబోయే అసెంబ్లీ ఎన్నికల ఫలితాలను ఊహించుకోవడం అర్థరహితం. గతంలో ఉపాధ్యాయ, పట్టభద్రుల నియోజకవర్గాల్లో బీజేపీ, వామపక్షాలు ఇదే తరహా ఫలితాలను సాధించినప్ప టికీ ఆ తరువాత జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ప్రభావం చూపకపోవడం గమనార్హం. తెలంగాణలో బీజేపీకి ఇలాంటి మెరుపులు గతంలోనూ ఉన్నాయన్న విషయాన్ని విస్మరించరాదు.1998లో 2, 1999లో 4 లోక్సభ స్థానాలు (సికింద్రాబాద్, మెదక్, మహబూబ్నగర్, కరీంనగర్) గెలుచు కోవడంతో తెలుగుతటాకంలో కమల వికాసం అంటూ అప్పట్లో రాజకీయ పరిశీలకులు వ్యాఖ్యానించారు.
అప్పట్లో తెలంగాణలో బీజేపీ దాదాపు 20శాతం పైగా ఓట్లు సాధించింది. ఆ తరువాత కేసీఆర్ తెలంగాణ ఉద్యమసారథిగా అవతరించడం, వైఎస్ పాదయాత్ర, కాకినాడ తీర్మానాన్ని అటకెక్కించడం తదితర పరిణామాల నేపథ్యంలో బీజేపీ గ్రాఫ్ పడిపోయింది. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తరువాత జరిగిన రెండు అసెంబ్లీ ఎన్నికల్లోనూ ఆ పార్టీ వందకు పైగా స్థానాల్లో డిపాజిట్లు కోల్పోయింది. 2019లో అనూహ్యంగా 4 ఎంపీ స్థానాలను గెలుచుకున్నప్పటికీ ఆ పార్టీ సాధించిన ఓట్ల శాతం 19.45 మాత్రమే.
వాజపేయి-అద్వానీ ద్వయం హయాంలో సాధించిన మార్క్ను మోదీ-అమిత్షా ద్వయం అధిగమించ లేకపోవడం గమనార్హం. ఇప్పటికీ ఆ పార్టీకి అన్ని నియోజకవర్గాల్లో గట్టి పోటీ ఇవ్వగలిగే నాయకులు లేరు. ప్రస్తుత పరిస్థితుల్లో పది పదిహేను నియోజకవర్గాలకు మించి డిపాజిట్లు దక్కడం కూడా కష్టమే. అయినా, తెలంగాణలో అధికారంలోకి రావడం ఖాయమన్నట్టుగా బీజేపీ నాయకులు లెక్కలేసుకుంటున్నారు. బీజేపీ స్వభావమే అంత! జీరోలుగా ఉన్న చోట కూడా కాబోయే హీరోలమని భ్రమింపజేయడం, ప్రత్యర్థులతో మైండ్గేమ్ ఆడటం ఆ పార్టీ అనుసరిస్తున్న వ్యూహం. అది కొన్ని రాష్ర్టాల్లో, కలిసొచ్చింది. అన్ని చోట్లా అది పనిచేయకపోవచ్చు.
నాలుగైదేండ్ల క్రితం వరకు తెలంగాణపై బీజేపీకి పెద్దగా ఆశలు లేవు. 2019లో 4 ఎంపీ స్థానాలు గెలుచుకోవడం, దుబ్బాక, హుజూరాబాద్ ఉపఎన్నికలు, జీహెచ్ఎంసీలో సాధిం చిన ఫలితాలను చూసి తెలంగాణలోనూ తమకు ఛాన్స్ ఉన్నదని ఆ పార్టీ నేతలు కలలు కనడం మొదలుపెట్టారు.ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల ఫలితమే రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లోనూ ప్రతిఫలిస్తుందని జబ్బలు చరుచుకుంటున్నారు. ఆయా స్థానాల్లో విజయానికి దారితీసిన కారణాలను సరిగా విశ్లేషించుకోకపోవడమే ఇందుకు కారణం. ఇతర పార్టీలకు చెందిన బలమైన నేతలను గోడ దూకిస్తే తమదే రాజ్యమని లెక్కలేసుకుంటున్నారు.
ఒకప్పుడు బీజేపీ అంటే సైద్ధాంతిక నిబద్ధత! క్రమశిక్షణ! సచ్ఛీలత! ఏబీవీపీ, ఆరెస్సెస్ లాంటి సంస్థల్లో పనిచేసినవారు ఆ పార్టీలో అంచె లంచెలుగా నాయకత్వ స్థానాలకు ఎదిగేవారు. కానీ ఇప్పుడు ఆ పార్టీ రిక్రూట్మెంట్ విధానం మారింది. భారీ కాంట్రాక్టులు, ఆర్థిక ప్యాకేజీలు, పదవులు ఆశజూపడం, వాటికీ లొంగకపోతే సీబీఐ, ఈడీ సంస్థల ద్వారా కేసులు బనాయిస్తామని బెదిరించడం, ప్రాంతీయ పార్టీల్లో చీలికలు సృష్టించడం ఇలా అనేక రూపాల్లో ఇతర పార్టీల నేతలను ఆకర్షిస్తున్నది. తెలంగాణలోనూ ఇలాంటి వ్యూహాలనే అనుసరిస్తున్నది.
ఇతర పార్టీల ఎమ్మెల్యేలను బీజేపీలో చేర్చుకుని, వారితో రాజీనామాలు చేయించి, ఉప ఎన్నికలు తీసుకుని రావడం ద్వారా తెలంగాణలోనూ పాజిటివ్ వేవ్ సృష్టించుకోవచ్చునని అధిష్ఠానం భావించింది. ఈ వ్యూహాన్ని నమ్మి, కాంగ్రెస్ నుంచి బీజేపీలోకి దూకిన కోమటిరెడ్డి రాజగోపాల్రెడ్డి పదవీ భ్రష్ఠుడయ్యారు. మునుగోడు ఉప ఎన్నికలో రాజగోపాల్రెడ్డి ఓటమి, బీఆర్ఎస్ గెలుపుతో బీజేపీ వ్యూహం తేలిపోయింది.
పదవి, పరువు, డబ్బు పోగొట్టుకోగా శని చుట్టుకుంది అన్నట్టుగా తయారైంది రాజగోపాల్రెడ్డి పరిస్థితి. దీంతో ఇప్పటికిప్పుడు బీజేపీలో చేరేందుకు ఇతర పార్టీల నేతలెవరూ సాహసించడం లేదు. దీనికితోడు ఇప్పటికే గోడ దూకిన ఇతర పార్టీల నేతలు బీజేపీలో సంతృప్తిగా లేరన్న టాక్ వినిపిస్తున్నది. బీజేపీలో ఉండలేక.. బయటకు రాలేక ఉక్కపోతకు గురవుతున్న పరిస్థితి. రాష్ట్ర బీజేపీలో కుమ్ములాటలు సరేసరి. ఆ పార్టీ గుర్తుపై గెలిచింది ముగ్గురు ఎమ్మెల్యేలు, నలుగురు ఎంపీలే అయినా ఒక్కొక్కరిది ఒక్కొక్క గ్రూప్! వచ్చే ఎన్నికల్లో ఎన్నిస్థానాలను నిలుపుకుంటారో తెలియదు కానీ.. పార్టీ అధ్యక్ష పదవిని, సీఎం అభ్యర్థిత్వాన్ని ఆశిస్తున్నవారి సంఖ్య తక్కువేమీ లేదు. కొత్తవారికీ, పాత వారికీ మనస్పర్థలు! సీనియర్లకు, జూనియర్లకు కీచులాటలు! బీజేపీ రాష్ట్ర నాయకత్వంపై సొంత పార్టీ నేతల నుంచే బహిరంగ విమర్శలు! వెంకయ్యనాయుడు, విద్యాసాగర్రావు, దత్తాత్రేయ లాంటి వారు పార్టీ రాష్ట్ర అధ్యక్షులుగా ఉన్నప్పుడు ఇలాంటి పరిస్థితి ఉండేది కాదు. ఎవరూ కట్టుతప్పి బహిరంగ విమర్శలకు దిగేవారు కాదు. ప్రస్తుత బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ వ్యవహార శైలి తీవ్ర విమర్శలకు గురవు తున్నది.
బ్లాక్మెయిలింగ్లు, సెటిల్మెంట్లకు పాల్పడుతూ అక్రమంగా డబ్బు సంపాదిస్తున్నారనే విమ ర్శలు పార్టీ శ్రేణుల నుంచే బాహాటంగా వినిపిస్తున్నాయి. బండి సంజయ్ అక్రమాలను నిరూపించడానికి తాను సిద్ధంగా ఉన్నానంటూ బీజేపీ జాతీయ కార్యవర్గ మాజీ సభ్యుడు పేరాల శేఖర్రావు సోషల్ మీడి యా వేదికగా ఇటీవల సవాల్ చేశారు. పెట్టుబడిదారులు, కోట్లు ముట్టజెప్పిన వారికే బండి సంజయ్ పార్టీ పదవులు ఇస్తున్నారని, దళితులను అవమానిస్తున్నారని సీనియర్ నేత కన్నం అంజయ్య ఆరోపించారు. సీనియర్ల ఆత్మీయ సమ్మేళనం నిర్వహించి తాడో పేడో తేల్చుకుంటామని కూడా హెచ్చరించారు. ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత విషయంలో బండి సంజయ్ చేసిన వ్యాఖ్యలను బీజేపీ ఎంపీ ధర్మపురి అర్వింద్తోపాటు మరికొందరు నేతలు మీడియా ద్వారా ఆక్షేపించారు. బీజేపీలో ఇలాంటి సన్నివేశాలు గతంలో ఊహకందనివి. పార్టీ అగ్రనాయకుడు అమిత్షా స్వయంగా కూర్చోబెట్టి క్లాసులు పీకుతున్నా పరిస్థితి మరింత దిగజారుతున్నదే తప్ప మెరుగుపడటం లేదన్నది ఆ పార్టీ కార్యకర్తల ఆవేదన.
బండి సంజయ్ ప్రయోగిస్తున్న విద్వేష భావజాలం తెలంగాణ సమాజానికి సరిపడదని, అసలుకే ఎసరు తెస్తుందన్న వాదనలనూ కొట్టివేయలేం. దీనికితోడు ఎల్ఐసీ లాంటి ప్రభుత్వరంగ సంస్థలను దెబ్బతీసే విధానాలు అనుసరించడం, గుజరాతీ వ్యాపారి అదానీతో అనుబంధం, రాజకీయ ప్రత్యర్థుల మీదకు సీబీ ఐ, ఈడీ లాంటి సంస్థలను ప్రయోగించడం, వివిధ కేంద్ర ప్రభుత్వ ప్రాయోజిత కార్యక్రమాలకు బడ్జెట్ కేటాయింపులు తగ్గించడం, తెలంగాణ పట్ల వివక్ష ప్రదర్శించడం లాంటి అనేక పరిణామాలు, విమర్శలు ప్రధాని మోదీ గ్రాఫ్ను మసకబారుస్తున్నాయనే అభిప్రాయమూ ఉన్నది.
కందిబండ కృష్ణప్రసాద్: 9182777010