బ్రిటీష్ పాలన నుంచి దేశం స్వాతంత్య్రాన్ని సాధించేనాటికి అప్పటి జాతీయ నాయకత్వం ముందు.. పేదరికం, నిరుద్యోగం, ఆకలి, నిరక్షరాస్యత వంటి అనేకానేక సమస్యలు పెను సవాల్గా నిలిచాయి. అయినప్పటికీ, వీటిపై పోరాడి విముక్తి సాధించటం అనే బృహత్తర లక్ష్యాన్ని వారు ఏర్పర్చుకున్నారు. దీంట్లో భాగంగా స్వతంత్ర భారతదేశాన్ని ప్రణాళికాబద్ధంగా అభివృద్ధి చేయటానికి, ఒక్కోరంగాన్ని తీర్చిదిద్దుకోవటానికి వీలుగా 1950లో ప్రణాళికాసంఘాన్ని ఏర్పాటు చేశారు.
ప్రణాళికాసంఘం పంచవర్ష ప్రణాళికలను రూపొందించింది. దేశ జనాభాలో అత్యధికమందికి ఉపాధినిస్తున్న వ్యవసాయ రంగాన్ని సంస్కరించటం మొట్టమొదటి ప్రణాళిక లక్ష్యమైంది. ఆ తర్వాత క్రమంలో ప్రభుత్వరంగ సంస్థలను ఏర్పాటు చేయటం, వాటిని బలోపేతం చేయటం, దేశంలో మౌలిక సదుపాయాల పెంపు వంటి లక్ష్యాలతో రూపొందిన 12 పంచవర్ష ప్రణాళికలు భారతదేశాన్ని నిలబెట్టాయి. కానీ, మోదీ ప్రధాని అయిన వెంటనే నెహ్రూ వారసత్వాన్ని తుంచివేసే ఉద్దేశ్యంతో ప్రణాళికాసంఘాన్ని రద్దు చేసి నీతి ఆయోగ్ పేరుతో ఒక వ్యవస్థను ఏర్పాటు చేశారు. ప్రజలు, దేశాభివృద్ధి, కేంద్ర-రాష్ర్టాల సహకారం వంటి మౌలిక అంశాలను వదిలేసి ప్రైవేటు కంపెనీలకు, వాటి అధికారులకు రాచబాట పరిచే వేదికగా ఇది మారిపోయింది.
ప్రధాని మోదీ అధికారానికి వచ్చిన తర్వాత ప్రణాళికా సంఘాన్ని (ప్లానింగ్ కమిషన్) రద్దుచేసి నీతి ఆయోగ్ అంటూ ఒక కొత్త కమిషన్ను ఏర్పాటుచేశారు. ప్రణాళికా సంఘం స్థానంలో వచ్చినట్టే కానీ, దానికి దీనికి ఏ పొంతనా లేదు. నీతి ఆయోగ్కు కావలసిన సిబ్బందిని పాత ప్రణాళికాసంఘం నుంచి తీసుకున్నారు. అదే భవనం నుంచి కార్యకలాపాలు సాగిస్తున్నది. కానీ ఈ కారణాల రీత్యా రెండింటిని పోల్చలేం. భారత పరివర్తన కోసం జాతీయ సంస్థ (నేషనల్ ఇనిస్టిట్యూషన్ ఫర్ ట్రాన్స్ఫామింగ్ ఇండియా-ఎన్ఐటీఐ కమిషన్) పేరుతో నీతి ఆయోగ్ను మోదీ ప్రభుత్వం 2015లో ఏర్పాటు చేసింది. కేంద్ర మంత్రిత్వ శాఖలకు నిధులు కేటాయించడానికి కానీ, రాష్ర్టాల కోసం పథకాలు రూపకల్పన చేయడానికి కానీ దీనికి ఎటువంటి అధికారాల్లేవు. ఏ మాత్రం నిధులు లేని ఈ కమిషన్ వల్ల ఉపయోగం లేదని రాష్ట్ర ప్రభుత్వాలు అంటున్నాయి.
కేంద్ర సర్కారు ఇటీవల నీతి ఆయోగ్లోని పెద్ద తలకాయలను మార్చడంతో ఈ కమిషన్ ప్రయోజనంపై మరోసారి చర్చ మొదలైంది. నీతి ఆయోగ్ ఉపాధ్యక్ష పదవికి రాజీవ్కుమార్ స్థానంలో విధాన ఆర్థికవేత్త సుమన్ బెరీని నియమించింది. సీఈఓగా అమితాబ్ కాంత్ స్థానంలో మాజీ ఐఏఎస్ అధికారి, సానిటేషన్ స్పెషలిస్ట్ పరమేశ్వరన్ అయ్యర్ను తెచ్చిపెట్టింది. నీతి ఆయోగ్ ఉపాధ్యక్షుడికి క్యాబినెట్ మంత్రి హోదా ఉంటుంది. సీఈవో మాత్రం కార్యదర్శి హోదా అధికారి. బీమా, విద్య, వ్యవసాయం, నీరు, భూవనరులు, పరిశ్రమలు, మౌలిక సదుపాయాలు, గ్రామీణాభివృద్ధి, పబ్లిక్ ప్రైవేటు భాగస్వామ్యం మొదలైన 27 విభాగాల అధిపతులు సీఈవోకు నివేదించవలసి ఉంటుంది. ఇందులో ముగ్గురు పూర్తిస్థాయి సభ్యులు ఉంటారు. ముఖ్యమంత్రులతో కూడిన గవర్నింగ్ కౌన్సెల్ ఉంటుంది. 2021-22 వార్షిక నివేదిక ప్రకారం ఈ కమిషన్ను నాలుగు విభాగాలుగా విభజించవచ్చు. ఒకటి- విధాన, కార్యక్రమ విభాగం. రెండు- సహకార సమాఖ్య. మూడు- పర్యవేక్షణ, విశ్లేషణ, నాలుగు- మేధో బృందం. ఇక దీని పరిధి విస్తృతమైనది కనుక ఏ ప్రభుత్వ శాఖలోనైనా జోక్యం చేసుకోవచ్చు. అయితే విధానాలను ప్రధాని కార్యాలయమే నిర్దేశిస్తుంది. సీఈవో రాష్ర్టాలతో సమన్వయ బాధ్యతలు నిర్వహిస్తారు. మేధో బృందం కొత్త ఆలోచనలను ముందుకు తెస్తుంది. ఆయా రంగాలకు చెందిన యువ వృత్తి నిపుణులను (యంగ్ ప్రొఫెనల్స్ లేదా వైపీ) ఇందులో తాత్కాలిక ప్రాతిపదికన నియమించుకుంటారు. నీతి ఆయోగ్లో చేరే ప్రైవేట్రంగ అధికారులు తమ వేతనాలను వదులుకోవలసి వస్తుంది. అయినా వీరు ఈ మేధోబృందంలో చేరడానికి రెండు కారణాలున్నాయి. ఒకటి- ప్రభుత్వ పథకాలను రూపుదిద్దడంలో వీరికి భాగస్వామ్యం ఉంటుంది. రెండు- కేంద్ర మంత్రిత్వ శాఖలు, రాష్ర్టాలతో పనిచేయడం వల్ల వారికి ఆ తర్వాత ఉన్నత అవకాశాలుంటాయి. దీనివల్ల సర్కారీ విధానాలను ప్రైవేటు కంపెనీల నుంచి వచ్చిన వారు నిర్దేశిస్తున్నారనే అభిప్రాయం ఉన్నది.
నీతి ఆయోగ్ కొందరు మేధావుల బృందంగా విలసిల్లుతున్నది! అయితే ప్రభుత్వ ఆస్తుల తనఖా, హైడ్రోజన్ ఇంధనం మొదలైన రంగాల్లో తలదూర్చి తన ప్రాధాన్యాన్ని చాటుకుంటున్నది. అయినా నీతిఅయోగ్ ప్రయోజనం ఏమిటనే ప్రశ్న మిగిలే ఉన్నది. సొంత నిధులు లేకుండా ఈ కమిషన్ కేంద్ర రాష్ర్టాల మధ్య వారధి కాగలదా అనేది ఒక సందేహం. రాష్ర్టాలపై ప్రభావం చూపడానికి కేంద్రం దీనికి నిధులు కేటాయిస్తుందా అనేది మరో ఆసక్తిదాయక ప్రశ్న. విద్యుత్ వాహనాలు, భారీ పరిశ్రమలు, ప్రభుత్వ ఆస్తుల తనఖా వంటి అనేక అంశాల్లో ప్రమేయం ఉంటుంది కానీ, ఏదీ దీని పరిధిలోకి రాదు. ఇటువంటి అస్పష్టమైన విధులు ఈ సంస్థకు ఉన్నాయి.
నీతి ఆయోగ్కు కొంత మేర నిధులు కల్పించాలని పలువురు ఆర్థికవేత్తలు, మాజీ విధానకర్తలు అభిప్రాయపడుతున్నారు. ‘నీతి ఆయోగ్-2 కు జీడీపీలో 1.5 లేదా 2 శాతం మేర నిధులు అవసరమని నా ప్రాథమిక అధ్యయనం వల్ల తెలుస్తున్నది. దీనివల్ల అభివృద్ధి అసమానతలను ఎదుర్కొనవచ్చు’ అని ఫైనాన్స్ కమిషన్ మాజీ చైర్మ న్ విజయ్ ఖేల్కర్ 2019లో రాసిన ఒక అధ్యయన పత్రంలో పేర్కొన్నారు. నీతి ఆయోగ్ భవిష్యత్ పరిస్థితులను అంచనా వేసి, ప్రభుత్వం తీసుకోవలసిన చర్యలను సూచిస్తుందనే అభిప్రాయం ఉన్నది. అభివృద్ధికి నోచుకోని 112 జిల్లాల మధ్య పోటీ నీతి ఆయోగ్ పెట్టింది. ఆశావహ జిల్లాల కార్యక్రమం అనే ఈ పథకం ద్వారా ఉత్తమమైన వాటికి బహుమతిగా కొంత పైకం ఇస్తుంది.
నీతి ఆయోగ్ నేరుగా కొద్దిపాటి నిధులు ఇచ్చే ఏకైక పథకం ఇదే. ఈ పథకంలో చేరడానికి పశ్చిమబెంగాల్ రాష్ట్రం నిరాకరించింది. నీతి ఆయోగ్ లోపల జరిగే తంతు తెలిసిన ఒక అధికారి తెలిపిన వివరాల ప్రకారం- ప్రతిపక్షాలు పాలిస్తున్న ఒడిశా, ఏపీ రాష్ర్టాలు నీతి ఆయోగ్తో కలిసికట్టుగా నడుస్తున్నాయి. కర్ణాటకలో బీజేపీ ప్రభుత్వమే ఉన్నప్పటికీ, ఇటీవలి వరకైతే దూరంగానే ఉన్నది. ఆర్యోగం, విద్య మొదలైన ప్రాతిపదికల ప్రకారం నీతి ఆయోగ్ ఆయా రాష్ర్టాలకు ర్యాంకులు ఇస్తుంది. ఈ ర్యాంకులను బహిరంగంగా ప్రకటించడం వల్ల రాష్ర్టాలు వీటిని పట్టించుకోక తప్పదు. ‘ఒక దశ వరకు ర్యాంకులు ఇవ్వడం సబబే అనిపిస్తుంది. కానీ పలు రాష్ర్టాలకు ఈ విధంగా ర్యాంకులు ప్రకటించడం పరువు తీసేదిగా కనిపిస్తున్నది’ అని ప్రణాళికా సంఘంలో కొంతకాలం పనిచేసిన మాజీ చీఫ్ స్టాటిష్టీషియన్ ప్రణబ్సేన్ అభిప్రాయపడ్డారు. రాష్ర్టాలను కేంద్ర మంత్రిత్వశాఖలలో అనుసంధానం చేసేదిగా నీతి ఆయోగ్ ఉండాలని ఆయన సూచించారు.
– శంతను నందన్ శర్మ (‘ఎకనామిక్ టైమ్స్’సౌజన్యంతో.. )