కుటుంబాన్ని సమర్థంగా నడిపించే శక్తి ఒక్క మహిళకే ఉన్నది. ఆ సామర్థ్యాన్ని వంటింటికే పరిమితం చేయకూడదు. ఈ నాయకత్వ లక్షణాలు సమాజ ఉన్నతికి దోహదపడాలి. ఈ లక్ష్యంతోనే రాష్ట్ర ప్రభుత్వం, ముఖ్యమంత్రి కేసీఆర్ మహిళలకు పెద్దపీట వేస్తున్నారు. అందుకే ఎప్పుడూ లేనంత ధైర్యం తెలంగాణ ఆడబిడ్డల్లో ఇప్పుడు కనిపిస్తున్నది. ఎన్నడూ చూడని ఆత్మవిశ్వాసం ఇప్పుడు వెల్లివిరుస్తున్నది. ఆడపిల్ల పుడితే చాలు మహా అదృష్టంగా భావించే స్థితి తెలంగాణలో వ్యక్తమవుతున్నది. మారిన మహిళల బతుకు చిత్రానికి తెలంగాణ మహిళే నిలువెత్తు నిదర్శనం. మార్చిన 8 ‘ప్రపంచ మహిళా దినోత్సవం’. ఈ ఉత్సవాన్ని రాష్ట్ర ప్రభుత్వం మూడు రోజులు నిర్వహిస్తున్నది. దీనిద్వారా మహిళల పట్ల ముఖ్యమంత్రి కేసీఆర్కు ఉన్న ప్రేమను, గౌరవాన్ని తెలియజేస్తున్నదనటంలో సందేహం లేదు.
‘కడుపులో పడ్డ పసిగుడ్డు నుంచి.. పండంటి బిడ్డ’గా భూమి మీదకు వచ్చేదాన్క తల్లీబిడ్డలను కంటికి రెప్పలా కాపాడుతానని ఇచ్చిన మాటను నిలబెట్టుకున్నారు ముఖ్యమంత్రి కేసీఆర్. దేశంలో ఏ రాష్ట్రంలో లేనివిధంగా రాష్ట్రంలోని ప్రభుత్వ దవాఖానల్లో ప్రసవాల సంఖ్య పెరిగింది. శిశు, ప్రసూతి మరణాలు తగ్గాయి. ప్రభుత్వ సంకల్పం, నిరంతర పర్యవేక్షణ ఫలితమే తల్లీ బిడ్డలు ఆరోగ్యంతో పుట్టింటికి చేరుకుంటున్నారు.
పుట్టిన బిడ్డకు ధనిక, పేద అనే తేడా ఉండకూడదనే సమున్నత ఆశయం ప్రభుత్వానిది. సంపన్నుల ఇళ్లల్లో పుట్టిన పిల్లలకు అందే సౌకర్యాలు ప్రతి గుడిసెలోనూ అందించాలన్న ఆలోచనకు వాస్తవరూపమే కేసీఆర్ కిట్. ఈ కిట్ అందుకున్న ప్రతి తల్లి తండ్రి కళ్లల్లో వెలకట్టలేని ఆనందం కనిపిస్తున్నది. దీనికితోడు మగబిడ్డ పుడితే రూ.12 వేలు, ఆడబిడ్డ పుడితే రూ.13 వేల నగదును అదనంగా ప్రభుత్వం అందిస్తున్నది. దీంతో ఆయా కుటుంబాల్లో ఆనం దం రెట్టింపవుతున్నది. ప్రభుత్వం ఇప్పటివరకు 10,83,447 కేసీఆర్ కిట్లను లబ్ధిదారులకు అందజేసింది. ఇది దేశంలోనే సరికొత్త అధ్యాయం.
బుడిబుడి అడుగులు వేసుకుంటూ బడికెళ్లే ఆడపిల్లలకు సంపూర్ణ పౌష్టికాహారం అందించాలనే లక్ష్యాన్ని ప్రభుత్వం నిర్దేశించుకున్నది. ఈ లక్ష్యం కూడా సత్ఫలితాలనిస్తున్నది. రాష్ట్రంలో ప్రతి ఆడబిడ్డ భవిష్యత్తులో ఉన్నత శిఖరాలు అధిరోహించాలని కార్పొరేట్ స్కూళ్లను తలదన్నేవిధంగా ప్రభుత్వం గురుకులాలను ఏర్పాటుచేసింది. ఇవి నిలువెత్తు చైతన్యదీపికలుగా విరాజిల్లుతున్నాయి. రాష్ట్ర ప్రభుత్వ పాఠశాలల్లో మొత్తం 10,95,529 మంది విద్యార్థినులు చదువుతున్నారు. తెలంగాణ స్టేట్ రెసిడెన్షియల్ స్కూళ్లలో 11,133 మంది విద్యార్థినులు అభ్యసిస్తున్నారు. వీటికి తోడు 475 కస్తూర్భాగాంధీ బాలికా విద్యాలయాల్లో 1,10,9 67 మంది విద్యార్థినులు ఉండగా వారి భవిష్యత్తు కు బలమైన పునాది వేయడమే లక్ష్యంగా ప్రభు త్వం కీలక నిర్ణయాలు తీసుకున్నది. ఉన్నత విద్యలో కూడా ఉత్తమ అవకాశాలు కల్పించాలన్న ఆలోచనతో ఏర్పాటుచేసిన 30 రెసిడెన్షియల్ డిగ్రీ కళాశాలలు మహిళా కళాశాలలే కావడం మహిళల విద్యాభివృద్ధికి ముఖ్యమంత్రి కేసీఆర్ ఇస్తున్న ప్రాధాన్యానికి అద్దం పడుతున్నది.
ఆడబిడ్డలకు రక్షణగా ‘షీ’ టీమ్స్.. ‘హాక్ ఐ’ వంటి యాప్స్.. దేశంలోనే విప్లవాత్మకం. ‘మీ భద్రత మా బాధ్యత’ అన్న నినాదాన్ని నిజం చేసిన నేలగా తెలంగాణ దేశంలోనే తన ప్రత్యేకతను చాటుకున్నది. ఉన్నత చదువుల కోసం ఇస్తున్న ఉపకార వేతనాలు ఆడపిల్లల ఉజ్వల భవిష్యత్తుకు పునాదిరాళ్లు.
ఒంటరి మహిళలకు ‘ఆసరా’గా నిలుస్తున్న ఏకైక ప్రభుత్వం టీఆర్ఎస్. దేశంలోనే తొలిసారిగా 1,32,504 మంది ఒంటరి మహిళలకు పింఛన్లు అందిస్తున్న ఏకైక ప్రభుత్వంగా ప్రత్యేక గుర్తింపు సాధించింది తెలంగాణ ప్రభుత్వం. అంతే కాదు.. 4,19,765 మంది బీడీ కార్మికులు కూడా ఆసరా పథకం ద్వారా లబ్ధి పొందుతున్నారు. ప్రభుత్వం నెలా నెలా ఇస్తున్న పింఛన్ను అందుకుంటున్న వృద్ధులు, వితంతువులు, వికలాంగులు మా పెద్దకొడుకు కేసీఆరే అని సగర్వంగా ప్రకటిస్తున్నారు. తెలంగాణలో ఆడబిడ్డలు మంచినీటి కోసం దశాబ్దాల పాటు పడ్డ కష్టాలు వర్ణనాతీతం. ఆ కష్టాలకు శాశ్వత పరిష్కారం చూపారు ముఖ్యమంత్రి కేసీఆర్. తడారిన గొంతులను గోదావరి, కృష్ణాజలాలతో అభిషేకించే మహాయజ్ఞమే ‘మిషన్ భగీరథ’. ఇది పల్లెలకే కాదు, మారుమూల గిరిజన తండాలకు చేరింది. ఈ మంచినీళ్ల విప్లవం దేశంలోనే ప్రతిష్టాత్మకం.
తెలంగాణ మహిళాలోకం స్వశక్తితో ఎదగాలి, సాధికారత సాధించాలన్న లక్ష్యంతో ప్రభుత్వం అమలుచేసిన కార్యక్రమమే వడ్డీ లేని రుణాలు. రాష్ట్రంలోని 3,77,531 స్వయం సహాయక సంఘాల్లోని 40,58,458 మంది సభ్యులకు ఏకంగా రూ.4,110 కోట్లను వడ్డీ లేని రుణాల కింద ప్రభుత్వం అందిస్తున్నది. ఈ చేయూతను అందుకొని, ఆర్థికంగా ఎదుగుతున్న తెలంగాణ ఆడబిడ్డలందరూ సమాజానికి స్ఫూర్తిప్రదాతలు. అంగన్వాడీలు, ఆశావర్కర్లు, పారిశుధ్య కార్మికుల శ్రమకు తగ్గ ఫలితం ఇవ్వాలన్న ఆలోచనతో వారి వేతనాలను పెంచింది రాష్ట్ర ప్రభుత్వం. స్థానిక సంస్థల్లో మహిళలకు ఇచ్చిన 50 శాతం రిజర్వేషన్లు సీఎం కేసీఆర్ దార్శనికతకు నిదర్శనం.
ఆర్థికంగా, రాజకీయంగానే కాదు.. పారిశ్రామిక రంగంలోనూ.. మహిళలు సత్తా చాటాలన్నది ముఖ్యమంత్రి కేసీఆర్ ఆశయం. అందుకే.. ఏ రాష్ట్రంలో లేనివిధంగా ప్రత్యేకంగా మహిళల కోసం 4 పారిశ్రామిక పార్కులు ఏర్పాటు చేశారు. ఈ పార్కులు దేశానికే రోల్ మోడల్. ఇందులో 20,150 యూనిట్ల ఏర్పాటుకుగాను రూ.1,377 కోట్ల రాయితీలు ప్రకటించడం మహిళాశక్తిపై ప్రభుత్వానికున్న అపార నమ్మకాన్ని తెలియజేస్తున్నది. ఇండస్ట్రియల్ పార్కుల్లో మహిళలకు 10 శాతం భూమిని కేటాయించాలన్న నిబంధన ప్రత్యేకమైనది. కొత్త ఆలోచనలతో ముందుకొచ్చే ఔత్సాహిక మహిళా పారిశ్రామికవేత్తలను ప్రోత్సహించేందుకు ‘వీ హబ్’ మొదలుపెట్టింది ప్రభుత్వం. దేశంలో అత్యధిక మహిళా పారిశ్రామికవేత్తలున్న రాష్ట్రమేది..? అని ఎవరడిగినా.. ‘తెలంగాణ’ అని సగర్వంగా జవాబు చెప్పే రోజు దగ్గర్లోనే ఉంది!
ఇచ్చిన మాటను నిలబెట్టుకుంటూ.. మడమ తిప్పని మహా నాయకుడిగా ముఖ్యమంత్రి కేసీఆర్కు పేరున్నది. మహిళా దినోత్సవం సందర్భంగా రాష్ట్రంలోని మహిళా లోకం తరఫున ఆ మహా నాయకునికి చేతులెత్తి సలాం చేస్తున్న. ప్రతిఒక్కరిని తోబుట్టువుగా భావిస్తూ కంటికిరెప్పలా కాపాడుతున్న ముఖ్యమంత్రి నిండు నూరేళ్లు చల్లగా ఉండాలి. ఇంత గొప్ప విజన్ ఒక్క రాష్ర్టానికే పరిమితం కాకూడదు. దేశవ్యాప్తంగా మహిళలను సాధికారత దిశగా నడిపించేందుకు ఈ నాయకత్వం ఉపయోగపడాలి. ఆ రోజు రావాలని యావత్ దేశ మహిళా లోకం మనస్ఫూర్తిగా కోరుకుంటున్నది.
(వ్యాసకర్త: రాష్ట్ర మహిళా శిశు సంక్షేమ శాఖామాత్యులు)
-సత్యవతి రాథోడ్