మంచి పుస్తకం ఓ మంచి ప్రాణ స్నేహితుడితో సమానం, వజ్రాల కన్నా పుస్తకాల విలువే ఎక్కువని బాపూజీ అంటారు. మాతృభాషను రక్షించుకోవడానికి- పిల్లలకు పుస్తకాలను దగ్గర చేయడం ఓ మంచి మార్గం. తల్లిదండ్రులు తమ పిల్లలకు ఇవ్వగలిగిన అమూల్యమైన ఆస్తి మంచి పుస్తకాలే.
చదువు మెదడుకు పదును పెడుతుంది. పుస్తక పఠనానికి కొంత సమయం కేటాయించడం వలన మానసిక ఒత్తిడి తగ్గుతుంది, కథల పుస్తకాలు పిల్లల్లో ఏకాగ్రత, సృజనాత్మకతను పెంపొందిస్తాయి. చూడటం కన్న చదవడం వల్ల మంచి రసానుభూతిని పొందుతారు. పెద్దలు నిత్యం కొంత సమయం పుస్తక పఠనానికి కేటాయిస్తూ పిల్లలకు అలవాటుగా మార్చాల్సిన అవసరం ఎంతో ఉంది. మహానుభావుల విజయగాథలు, ఆత్మకథలు, విద్యార్థుల వ్యక్తిత్వ వికాసానికి దోహదపడుతాయి. పుస్తక పఠనంతో విజ్ఞానాన్ని సంపాదించి ఎందరో ఉన్నత శిఖరాలకు చేరుకున్నారు. పిల్లల్లో పఠనాసక్తిని కలిగించడం, పిల్లలతోపాటు పెద్దల్ని కూడా బాలసాహిత్యం వైపు ఆకర్షించడం అంతర్జాతీయ బాలల పుస్తక దినోత్సవ ముఖ్య ఉద్దేశం. 1967 నుంచి ఏటా ఏప్రిల్ 2న అంతర్జాతీయ బాలల పుస్తక దినోత్సవాన్ని జరుపుతున్నారు. డెన్మార్క్కు చెందిన ప్రఖ్యాత బాల సాహిత్య రచయిత హాన్స్ క్రిస్టియన్ ఆండర్సన్ పుట్టినరోజు ఇది.
తెలుగులో తొలిసారిగా జనవినోదిని పత్రిక (1875-85) బాలల కోసం ప్రత్యేక రచనలను ప్రారంభించింది. 1947లో నాగిరెడ్డి- చందమామను ప్రారంభించారు. బాలసాహిత్యానికి చందమామ చేసిన సేవ వెలకట్టలేనిది. చందమామ తరువాత బాలమిత్ర, బొమ్మరిల్లు, బుజ్జాయి వంటి పత్రికలు పిల్లలను అలరించాయి. తెలుగు రచయితల్లో చాలామంది సుప్రసిద్ధులు బాలసాహిత్యానికి ఎనలేని సేవలందించారు. న్యాయపతి రాఘవరావు, ఏడిద కామేశ్వరరావు, తురగా జానకిరాణి, రావూరి భరద్వాజ, ఇల్లిందల సరస్వతీదేవి వంటి వారు బాలల కోసం ప్రత్యేకమైన రచనలు విరివిగా చేశారు.
పుస్తకాలు చదవడంతో సమాజంపై అవగాహన పెరుగుతుంది. మొదట పిల్లలకు చిన్న చిన్న కథలు వినిపిస్తుండాలి. చిత్రాలతో కూడిన ఆసక్తికర పుస్తకాలను చదివించాలి. దాంతో వారు తెలియకుండానే పుస్తకాల పట్ల ఆకర్షితులవుతారు. చిన్నారుల ఇష్టానికి తగినట్లుగా పుస్తకాలు ఎంపిక చేసి చదివేలా ప్రోత్సహించాలి. సాహిత్య అకాడమీలు, సాక్షర భారత్, సర్వశిక్ష అభియాన్ వంటివి కూడా పిల్లలకు, విద్యార్థులకు అవసరమైన అనేక పుస్తకాలు ప్రచురించాయి.
పుస్తకరూపం మారవచ్చు కాని, పుస్తకానికి ఆదరణ మాత్రం తగ్గలేదు. తరతరాలుగా జ్ఞానాన్ని వారసత్వంగా అందిస్తున్నది పుస్తకం. పుస్తకం ప్రపంచాన్ని పరిచయం చేస్తుంది. ప్రస్తుతం చిన్నారులు పుస్తకాలను పట్టుకొని చదువడం మరిచి సామాజిక మాధ్యమాలకు అంకితమవుతున్నారు. ఇంటర్నెట్లో చదివే పిల్లల్లో సహజ ఎదుగుదల మందగిస్తుంది. పుస్తక పఠనాన్ని తల్లిదండ్రులు, పెద్దలు బాధ్యతగా స్వీకరించి పిల్లలతో చిన్నప్పటి నుండే చదివించాలి. పుస్తకాలపై పిల్లలకు అభిరుచిని పెంచుదాం. వారి మానసిక వికాసానికి తోడ్పడుదాం.