ప్రభుత్వాలు మారినప్పుడు కొన్ని పనులు ఆగిపోతాయి. మరికొన్ని యథావిధిగా సాగిపోతాయి. ఎవరు దేనికి అసలుసిసలు కర్తలు అనే విషయంలో కొంత గందరగోళం ఏర్పడటం సహజమే. ముఖ్యంగా వివాదం ఏర్పడినప్పుడు బాధ్యత అవతలివారి మీదకు తోసేయడమూ జరుగుతుంది. దామగుండం నేవీ రాడార్ కేంద్రానికి భూకేటాయింపు పరిస్థితి ఇందుకు ఓ ఉదాహరణ. వెరీ లో ఫ్రీక్వెన్సీ (వీఎల్ఎఫ్) కమ్యూనికేషన్స్కు అవసరమయ్యే స్థలం కేటాయించాలంటూ 2010లో నౌకాదళం రాష్ట్ర ప్రభుత్వానికి లేఖ రాసింది. 2014లో కేంద్ర ప్రభుత్వం ఆమోదం తెలిపింది. వికారాబాద్ ప్రాంతంలోని దామగుండం అడవుల్లో ఈ రాడార్ కేంద్రం నిర్మాణానికి అవసరమైన 1,174 హెక్టార్ల భూమి బదిలీకి సంబంధించి మొన్న జనవరి 24న ఒప్పందం కుదిరింది. ఈ మూడూ రాష్ట్రంలో, కేంద్రంలో కాంగ్రెస్ ప్రభుత్వాలు ఉండగానే జరిగాయన్నది విస్పష్టం. ‘సీఎం రేవంత్రెడ్డి చొరవతో’ ఈ ఒప్పందం కుదిరిందని సమాచార శాఖ విడుదల చేసిన అధికారిక ప్రకటనలో రాష్ట్ర ప్రభుత్వం తెలిపింది. అన్నిరకాల అనుమతులు లభించేలా ఆయన ‘చర్యలు’ తీసుకున్నారని అందులో ప్రశంసించారు కూడా. అయితే ఇది అంత ఆషామాషీ వ్యవహారం ఏమీ కాదు.
దామగుండం అడవులకు ఈ కేంద్రం వల్ల ముప్పు ఏర్పడుతుందని, మూసీ, ఈసీ నదుల పర్యావరణం ప్రమాదంలో పడుతుందని స్థానికులు, పర్యావరణవాదులు మొదటి నుంచీ అభ్యంతరం చెప్తున్నారు. ఇందుకు సంబంధించి అనేక విజ్ఞాపనలు అందాయి. కోర్టుల్లో కేసులూ దాఖలయ్యాయి. ఇలా రకరకాలుగా ప్రజల నుంచి, ఉద్యమకారుల నుంచి వ్యతిరేకత వ్యక్తమైన కారణంగానే కేసీఆర్ ప్రభుత్వం ముందుకు వెళ్లలేదు. గత ప్రభుత్వ నిర్ణయాలపై సమీక్షలంటూ హడావుడి చేసే కాంగ్రెస్ ప్రభుత్వం ఎందువల్లనో దీని జోలికి వెళ్లలేదు. కానీ, ఆగమేఘాల మీద నేవీ అధికారులను పిలిపించుకుని ఒప్పందం కానిచ్చేసింది. గత ప్రభుత్వం నిర్లక్ష్యం కారణంగా భూముల కేటాయింపు ముందుకు సాగలేదని సీఎంవో గ్రూప్ సామాజిక మాధ్యమాల్లోని అధికారిక సైట్లలో చాటింపు వేసింది. మరోవైపు ప్రభుత్వ వర్గాలు భూకేటాయింపు తమ గొప్పేనని జబ్బలు చరుచుకోవడం గమనార్హం. దీని సారాంశం ఏమిటి? కేసీఆర్ ప్రభుత్వం ప్రజల సంక్షేమం కోసమే దీనిపై ఆసక్తి చూపలేదనేగా ఇది తెలియజేస్తున్నది? రాడార్ కేంద్రంపై ప్రభుత్వం ఉరుకులాటను స్థానికులు ప్రశ్నిస్తున్నారు. ఓవైపు మూసీ సుందరీకరణ చేపడతామని అంటున్న ప్రభుత్వం ఆ నది క్యాచ్మెంట్ ప్రాంతంలో కమ్యూనికేషన్స్ వ్యవస్థ ఏర్పాటును అనుమతించవద్దని పర్యావరణవాదులు అంటున్నారు. ఈ నేపథ్యంలో ప్రభుత్వం చూపిన అతితొందర సహజంగానే వివాదాల్లో చిక్కుకుంది.
బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్ స్వయంగా వెళ్లి స్థానికులతో మాట్లాడటం కాంగ్రెస్ ప్రభుత్వానికి మింగుడుపడటం లేదు. తాజా పరిణామాలతో ఆత్మసమర్థనలో పడిన రాష్ట్ర అటవీ మంత్రి కొండా సురేఖ బీఆర్ఎస్ ప్రభుత్వమే భూమి కేటాయించిందని ఓ అబద్ధాన్ని వండివార్చారు. పైన తెలిపిన విషయాలు ఇందులో ఇసుమంత కూడా వాస్తవం లేదని స్పష్టం చేస్తున్నాయి. అక్కడ సీఎం తన గొప్ప అంటుంటే మంత్రి మాత్రం ఇది బీఆర్ఎస్ వల్లనే జరిగిందని తప్పించుకోజూస్తున్నారు. కాంగ్రెస్ మార్కు రెండు నాల్కల ధోరణి, స్థానిక అంశాలు, ఆకాంక్షల పట్ల అలక్ష్య ధోరణి ఇందులో తేటతెల్లమైపోతున్నది. దామగుండం అటవీ పరిరక్షణ సమితి వేసిన కేసులో రాష్ట్ర హైకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. ఆ ప్రాంతంలోని సున్నితమైన పర్యావరణాన్ని కాపాడాల్సిన ఆవశ్యకతను నొక్కిచెప్పింది. దేశ రక్షణ అవసరమేనని, అదే సమయంలో పర్యావరణ రక్షణ కూడా ముఖ్యమేననే విషయాన్ని గుర్తుంచుకోవాలి.