ప్రధాని మోదీ పరిపాలనా కాలంలో సంపన్నులు భారీ సంఖ్యలో ఇతర దేశాలకు వలస పోవడం, తమ భారత పౌరసత్వాన్ని కూడా వదులుకోవడం తీవ్రంగా ఆలోచించవలసిన విషయం. విద్యార్థులు ఉన్నత చదువుల కోసం వెళ్ళడం, ఉద్యోగార్థులు ఎక్కువ వేతనాన్ని ఆశించి వలసపోవడం వేరు. దీనివల్ల మన దేశానికి దీర్ఘకాలికంగా మేధోపరమైన, ఆర్థికపరమైన లబ్ధి చేకూరుతుందనే వాదన ఒకటి ఉన్నది. విదేశాలలో భారత సంతతి వృద్ధిని చూసి గర్వపడే వారున్నారు. కానీ ‘హై నెట్వర్త్ ఇండివిజువల్స్’గా చెప్పుకునే సంపన్న శ్రేణి విదేశాలకు తరలిపోతుండటం గమనార్హం. విదేశాల ఆకర్షణ పెరిగిందా లేక దేశంలో ఆర్థికంగా ఉన్నత స్థాయిలో ఉన్న వర్గాలకు ఎదురవుతున్న అనుభవాలు వారిని తరలిపోయేలా చేస్తున్నాయా అనేది కేంద్రంలోని పాలకులు ఆత్మపరిశీలన చేసుకోవాలి.
2014 నుంచి గత ఏడాది వరకు మన దేశం నుంచి 23 వేల మంది కోటీశ్వరులు విదేశాలకు వలస వెళ్ళినట్టు గణాంకాలు తెలుపుతున్నాయి. ఒక్క 2019లోనే ఏడు వేల మంది దేశాన్ని వీడారు. 2015 నుంచి 2021 సెప్టెంబరు వరకు 8,81,254 మంది భారత పౌరసత్వాన్ని వదులుకున్నట్టు గత ఏడాది డిసెంబర్లో కేంద్ర మంత్రి ఒకరు లోక్సభలో వెల్లడించారు. వీరిలో పలువురు ఎన్నారైలు ఉ న్నారు. సంపన్న శ్రేణి దేశం నుంచి వెళ్లడానికి ప్రభుత్వ వేధింపులే ప్రధాన కారణమనే మాట బలంగా వినబడుతున్నది. ఆదాయపు పన్ను ఎగవేస్తున్నారనే సాకుతో ప్రభుత్వం దాడులు సాగించడం మోదీ హయాంలో మూడు రెట్లు పెరిగిందన్న విమర్శలున్నాయి. అధికార పీఠానికి దగ్గరగా ఉన్నవారికి బ్యాంకు రుణాలను యథేచ్ఛగా పంచిపెట్టడంతోపాటు, ప్రభుత్వ సంస్థలను కట్టపెట్టడం, రాయితీలు ఇవ్వడం సాగుతున్నది. మరోవైపు అనేక మంది పెట్టుబడిదారులు, వ్యాపారవేత్తలు భయంతో బతుకుతున్నారని ఆరోపణలు ఉన్నాయి. కర్ణాటకకు చెందిన ప్రముఖ ‘కాఫీ వ్యాపారి’ ప్రభుత్వ వేధింపులు తట్టుకోలేక ఆత్మహత్యకు పాల్పడటం ఇందుకు ఉదాహరణ. ప్రతిపక్షాలకు సన్నిహితంగా ఉండకుండా, అధికార పార్టీని ఎన్నికలలో ఆదుకునే విధంగా వ్యవహరించక తప్పని పరిస్థితి వ్యాపారవర్గాలకు ఏర్పడింది.
ప్రభుత్వ వేధింపులు, రాజకీయ పరిస్థితులు, సమాజంలో విద్వేష వాతావరణం మొదలైన కారణాలు ఏవైనా కావచ్చు కానీ, సంపన్నులు లేదా వ్యాపారవేత్తలు వెళ్ళిపోవడం వల్ల దేశం భారీ ఎత్తున పన్నుల రాబడిని కోల్పోతున్నది. 1990 దశకారంభంలో పీవీ ప్రధానిగా ఉన్నప్పుడు ఆర్థికరంగంలో సంస్కరణలు ప్రారంభమైనాయి. చైనాతో పాటు భారత్ ప్రబల ఆర్థిక శక్తిగా ఎదుగుతుందని ఆర్థికవేత్తలు అంచనాలు వేశారు. ఈ క్రమంలో విదేశీ పెట్టుబడులు భారత్కు తరలి రావడానికి అనుకూల పరిస్థితులు నెలకొన్నాయి. ఈ దశలో, విదేశాల్లో ఉన్న భారతీయ సంతతి వ్యాపారవేత్తలు, ఉన్నతస్థాయి నిపుణులు స్వదేశానికి తిరిగి వచ్చే పరిస్థితులు కల్పించాలే తప్ప ఇక్కడ ఉన్న వారికి పొగ పెట్టకూడదు. భయాలు, సందేహాలు తొలగించి సంపన్న శ్రేణులు తరలిపోకుండా చూడవలసిన బాధ్యత కేంద్ర ప్రభుత్వానిది.