ప్రధాని నరేంద్ర మోదీ నేతృత్వంలోని బీజేపీ ప్రభుత్వం అనుసరిస్తున్న అప్రజాస్వామిక విధానాలను, సీబీఐ, ఈడీ వంటి కేంద్ర సంస్థలను దుర్వినియోగం చేయడాన్ని ప్రజలు గమనిస్తున్నారు. ఆ సంస్థలు నమోదు చేస్తున్న 95 శాతానికి పైగా కేసులు ప్రతిపక్ష పార్టీలపైనే కావడం గమనార్హం. అదే సమయంలో బీజేపీలో చేరినవారిపై కేసులు అటకెక్కాయి. సత్యం, న్యాయం, ధర్మం అని గొప్పగొప్ప మాటలు చెప్పే ప్రధాని మోదీ తనకు సన్నిహితుడైన వ్యాపారవేత్తపై వచ్చిన ఆర్థిక మోసాల ఆరోపణలను విస్మరించడం దారుణం.
కాంగ్రెస్ పాలించిన 2004-14 మధ్య కాలంలో 72 మంది రాజకీయ నేతల పై సీబీఐ విచారణ చేపడితే అందులో 43 మంది విపక్షాలకు చెందినవారు కాగా, 2014 నుంచి బీజేపీ పాలనలో సీబీఐ దాడులు ఎదుర్కొన్నవారు 124 మంది కాగా వారిలో 118మంది విపక్షీయులే ఉన్నా రు. అంటే ఈ రెండు పాలనల కాలంలో ప్రతిపక్షాలపై కేసుల శాతం 60 నుంచి 95కు పెరిగింది. యూపీఏ ప్రభుత్వం 29 మంది సొంత నేతలపై దర్యాప్తునకు ఆదేశిస్తే ఎన్డీఏ సీబీఐ కేసులు నమోదు చేసింది కేవలం ఆరుగురిపైనే.
సీబీఐ, ఈడీ, ఐటీ స్థాయి బలమైన శక్తులు రాష్ర్టాల చేతుల్లో లేనందువల్ల కేంద్రాన్ని ఎదుర్కొనేందుకు లేఖాస్త్రమే మిగిలింది. అయితే ఆ అస్త్రం కొంచెమైనా ప్రధానిని పునరాలోచించుకొనేలా చేస్తుందని అనుకోలేం. ఎందుకంటే ఇప్పుడు వచ్చిన చిక్కేమిటంటే దర్యాప్తు సంస్థల కొరడా చేపట్టిన పాలక బీజేపీ కేవ లం విపక్షాల వారిపైనే దాన్ని ఝుళిపిస్తున్నది. దాడులు చేయిస్తామని బెదిరించి ఆయా పార్టీల కీలక నేతలను తమ బుట్టలో వేసుకుంటున్నది.
మనదంతా ఒకే దేశం. కానీ దేశాన్ని ఏలుతున్న పాలకులు ఏకత్వానికి ముప్పు తలపెడుతున్నారు. ప్రాంతం, కులం, భాష, రాజకీయాలకు ముడిపెడుతున్నారు. ఎన్నికల్లో లబ్ధి పొందుతున్నారు. రాజ్యాంగ సమాఖ్యస్ఫూర్తిని దెబ్బతీస్తూ వారికి నచ్చిన రాష్ర్టాలకు నిధులిస్తూ, నచ్చని రాష్ర్టాలకు మొండిచేయి చూపుతున్నారు.
నిరుద్యోగం, ద్రవ్యోల్బణం, ఆందోళన కలిగించే సామాజిక సమస్యలను లేవనెత్తకుండా ప్రతిపక్షాలను నిలువరించేందుకు మోదీ ప్రభుత్వం వ్యూహాలు పన్నుతున్నది. చర్చలను నిరోధించడం, న్యాయవ్యవస్థ విశ్వసనీయతను దెబ్బతీసేందుకు బీజేపీ ప్రభుత్వం క్రమబద్ధమైన దాడులు చేస్తున్నది. ముఖ్యంగా ప్రతిపక్ష నాయకులపై సీబీఐ దాడులు పెరగడం దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైంది. అయితే బీజేపీ ప్రభుత్వం కేం ద్ర సంస్థలను కీలు బొమ్మలుగా వాడుకుంటుందని. కావాలనే ప్రతిపక్ష నాయకులపై కేంద్ర దర్యాప్తు సంస్థలతో దాడులను చేయిస్తున్నదని ఇదివరకే విపక్ష నాయకులు ఆరోపించారు. ఈ విషయంపై 14 ప్రతిపక్ష పార్టీలు సుప్రీంకోర్టును కూడా ఆశ్రయించాయి.
సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (సీబీఐ) సోదాలు లేదా ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) దాడులు బీజేపీయేతర రాష్ర్టాలలోనే నిర్వహించబడ్డాయి. బీజేపీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం అప్రజాస్వామికంగా కేంద్ర దర్యాప్తు సంస్థలను స్వార్థ, రాజకీయ ప్రయోజనాలతో దుర్వినియోగం చేయడంపై ప్రతిపక్షాల నాయకులు అభ్యంతరాలు వ్యక్తం చేస్తున్నారు.అలాగే తమను విమర్శించే వార్త సంస్థలపై కూడా ప్రభుత్వం దాడులకు పాల్పడుతున్న సంఘటనలున్నాయి.
గుజరాత్ అల్లర్లపై డాక్యుమెంటరీ విడుదల చేసిన వెంటనే బీబీసీ వార్త సంస్థకు చెందిన ఢిల్లీ, ముంబై ఆఫీసులపై ఐటీ దాడులు చేసింది. రాజకీయ నాయకులపై ఎలాంటి కేసులు కోర్టులో ఉన్నా, ఎన్ని దర్యాప్తులు జరిగినా నిజాలు బయటపడి ఊచలు లెక్కపెట్టే సందర్భాలు అరుదు. అయితే ఈ దాడులు, దర్యాప్తుల వార్తలు రాజకీయ మనుగడను దెబ్బ తీస్తాయనే భయమే నేతల్లో ఎక్కువ. దాడులు నిర్వహించేవారి ఉద్దేశం కూడా అదే. రెండో ప్రపంచ యుద్ధకాలంలో ఆయుధాల కొనుగోలులో అవకతవకలను అరికట్టేందుకు 1941లో ఏర్పడ్డ కేంద్ర దర్యాప్తు సంస్థ (సీబీ ఐ) రూపురేఖలు క్రమంగా మారి ఇప్పుడు కేవలం పాలకపక్ష రాజకీయ ప్రయోజనాలకు సేవికగా మారడం చరిత్రక విషాదం.
ప్రతిపక్షాలను లేకుండా చేయాలని కేంద్రం అహంకారపూరితంగా వ్యవహరిస్తున్నది. తొమ్మిదేండ్లలో తొమ్మిది రాష్ట్ర ప్రభుత్వాలను కూల్చిన ఘనత మోదీది. ఇలా అప్రజాస్వామికంగా ప్రభుత్వాలను కూలుస్తూ దేశాన్నంతా తన చెప్పుచేతల్లో ఉంచుకోవాలనే కేంద్ర బీజేపీ ప్రభుత్వానికి రానున్న ఎన్నికల్లో కర్రుకాల్చి వాత బెట్టడానికి ప్రజలు సిద్ధంగా ఉన్నారు. అందుకే అడ్డదారిలోనైనా అధికారాన్ని కాపాడుకోవాలని బీజేపీ ప్రయత్నాలను మొదలుపెట్టింది. ప్రజల మధ్య విద్వేషాలు సృష్టించి తద్వారా లబ్ధి పొందాలని చూస్తున్నది. కానీ ప్రజలు బీజేపీ పాలనకు చరమగీతం పాడటానికే మొగ్గు చూపుతున్నారన్నది నిజం.
-తీగల అశోక్ కుమార్
79891 14086