ప్రపంచంలోనే అత్యధిక జనాభా గల దేశంగా అవతరించనున్న భారత దేశంలో జీడీపీలో మహిళల వాటా తక్కువగా ఉంది. దీని వల్ల దేశాభివృద్ధి మంద గమనంలో సాగుతున్నది. ఈ నేపథ్యంలో ప్రభుత్వాలు వివిధ రంగాల్లోని ఉద్యోగ, ఉపాధి అవకాశాలకు తగిన విధంగా మహిళలకు ప్రత్యేక శిక్షణ ఇవ్వాలి. పురుషులతో సమానంగా వేతనాలు అందజేయాలి. మహిళలు కూడా అవరోధాలను దాటుకుని సాధ్యమైనంత త్వరగా తమ నైపుణ్యాలను మెరుగు పరచుకుని, దేశాభివృద్ధిలో చురుకైన పాత్ర పోషించాలి.
ప్రపంచ జనాభా 800 కోట్లకు చేరింది. 2023 నాటికి భారత్ ప్రపంచంలోనే అత్యధిక జనాభా కలిగిన దేశంగా అవతరించనుంది. ఇందులో మహిళల జనాభా 49 శాతంగా ఉండనుంది. ఈ నేపథ్యంలో దేశ శ్రామిక శక్తిలో మహిళలకు సరైన భాగస్వామ్యం లేకపోతే మన దేశం కలలు కంటున్న ప్రపంచ మూడో లేదా నాలుగో ఆర్థిక వ్యవస్థగా ఆవిర్భవించడం అసాధ్యమని గ్రహించాలి. అంటే మహిళలు ఉత్పాదక రంగంలో ప్రముఖ పాత్ర పోషించాలి. లింగ వివక్ష పోయినప్పుడు మాత్రమే ఇది సాధ్యమని గ్రహించాలి. ప్రస్తుత శ్రామిక మార్కెట్లో మన మహిళా భాగస్వామ్యం రేటు (ఎఫ్ఎల్ఎఫ్పీఆర్) ప్రపంచ దేశాల కంటే చాలా తక్కువ ఉన్నట్లు వరల్డ్ బ్యాంక్ తెలిపింది.
ఇంకా స్పష్టంగా చెప్పాలంటే క్షీణించింది. 2000 సంవత్సరానికి ముందు మహిళల వర్క్ ఫోర్స్ 30.5 శాతంగా ఉంటే, 2019 నాటికి అది 21.1 శాతానికి తగ్గింది. ఇది మరింత దిగజారి 2020 నాటికి 18.6 శాతంగా ఉన్నట్లు పేర్కొంది. దీనికి ప్రధాన కారణం పట్టణాల్లో మహిళలు ఉద్యోగాలు, ఉపాధి అవకాశాలు కోల్పోవడం. కొవిడ్ కాలంలో లాక్ డౌన్, కర్ఫ్యూ వల్ల పరిశ్రమలు మూత పడ్డాయి. 2021 ది గ్లోబల్ జెండర్ గ్యాప్ రిపోర్ట్ ఆఫ్ ది వరల్డ్ ఎకనమిక్ ఫోరం 156 దేశాలను పరిశీలిస్తే, ఎఫ్ఎల్ఎఫ్పీఆర్లో మన దేశం 140వ స్థానంలో ఉండటం శోచనీయం.
1983 నుంచి 2018 వరకు గణాంకాలను పరిశీలిస్తే, శ్రామిక మార్కెట్లో మహిళల భాగస్వామ్యం భారీగా పెరగలేదు. 2004-05 మధ్య కాలంలో 14.86 కోట్ల మంది మహిళా శ్రామికులు ఉండగా 2017-18 నాటికి వారి సంఖ్య 10.41 కోట్లకు తగ్గింది. చాలా మంది మహిళలు నేటికీ ఎక్కువగా వ్యవసాయ రంగంలోనే ఉపాధి పొందుతున్నారు. ఇతర రంగాలలో వారికి ఎక్కువగా ఉపాధి అవకాశాలు లభించడం లేదు. 90 శాతం మహిళలు అసంఘటిత రంగంలో పని చేస్తున్నారు. లింగ వివక్ష, పురుషులతో పోలిస్తే తక్కువ వేతనాలు, సామాజిక రక్షణ కొరవడటం, ఉద్యోగాల లేమి మహిళలను వెంటాడుతూనే ఉన్నాయి.
‘ఆక్స్ఫామ్ ఇండియా డిస్క్రిమినేషన్ రిపోర్ట్ -2022’ ప్రకారం భారతదేశంలో పురుషులు, మహిళల వేతనాల విషయంలో భారీ వ్యత్యాసం ఉన్నట్లు తెలిసింది. దీనికి కారణం అవిద్య, పని అనుభవం లేకపోవడం, నైపుణ్యాల కొరత. 2019-20లో సుమారు 60 శాతం మగవారు రెగ్యులర్ వేతనాలు పొందుతుండగా, మహిళల్లో ఆ సంఖ్య కేవలం 5 శాతం మాత్రమే. చదువుకున్న యువతుల్లో చాలా మంది ఉద్యోగం చేయడం కన్నా కుటుంబ బాధ్యతలు స్వీకరించడానికే ఎక్కువగా మొగ్గు చూపుతున్నారు. పిల్లల పోషణ, వృద్ధుల రక్షణ కోసం వారు ఎక్కువ సమయం కేటాయించాల్సిన పరిస్థితి ఏర్పడింది. ది ఎకనమిక్ ఫోరం 2020 సర్వే ప్రకారం భారత్లో సుమారు 15-59 సంవత్సరాల మధ్య వయస్కులైన మహిళల్లో 60 శాతం మంది కుటుంబ బాధ్యతల్లోనే నిమగ్నమై ఉన్నారు. మహిళలకు 84 శాతం మేరకు ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కొరతగా ఉన్నట్లు తెలిసింది.
బ్లూమ్స్ బర్గ్ ఎకనమిక్ అనాలిసిస్ ప్రకారం భారత దేశ జనాభాలో 48 శాతం మహిళలు ఉన్నా, జీడీపీలో వారి భాగస్వామ్యం కేవలం 17 శాతంగా ఉంది. చైనాను పరిశీలిస్తే వారి జీడీపీలో 40 శాతం భాగస్వామ్యం మహిళలదే. ఆసియన్ డెవలప్మెంట్ బ్యాంక్ అధ్యయనం ప్రకారం వచ్చే 25 ఏండ్లలో భారత మహిళలు పురుషులతో సమానంగా ఎదిగితేనే దేశ జీడీపీలో వారి భాగస్వామ్యం 60 శాతానికి చేరుకుంటుంది. ఈ నేపథ్యంలో కేంద్ర, రాష్ర్టాల ప్రభుత్వాలు తదనుగుణంగా చర్యలు చేపట్టాలి. మహిళల ఉద్యోగ, ఉపాధి అవకాశాలకు కుటుంబ బాధ్యతలు, అవిద్య, సామాజిక కట్టుబాట్లు, బాల్య వివాహాలు శాపంగా మారాయి. వీటి నుంచి వారికి విముక్తి కల్పించాలి. భారత్లోని విద్యార్థినుల్లో దాదాపు 43 శాతం మంది సైన్స్, ఇంజినీరింగ్ వంటి కోర్సులు చదువుతున్నారు. వీరిలో కేవలం 14 శాతం మంది మాత్రమే ఉద్యోగాలు చేస్తున్నారు. ఈ సంఖ్య పెరిగేలా ప్రభుత్వాలు ప్రణాళికలు రూపొందించాలి.
వివిధ రంగాల్లోని ఉద్యోగ, ఉపాధి అవకాశాలకు తగిన విధంగా మహిళలకు ప్రత్యేక శిక్షణ ఇవ్వాలి. మహిళల భాగస్వామ్యంతో దేశాభివృద్ధి సాధ్యమని గ్రహించాలి. పని ప్రదేశాల్లో మహిళలకు రక్షణ కల్పించాలి. వారికి పురుషులతో సమానంగా వేతనాలు అందజేయాలి. మహిళలు కూడా అవరోధాలను దాటుకుని సాధ్యమైనంత త్వరగా తమ నైపుణ్యాలను మెరుగు పరచుకుని, దేశాభివృద్ధిలో చురుకైన పాత్ర పోషించాలి అని కోరుకుందాం.
ఆసియన్ డెవలప్మెంట్ బ్యాంక్ అధ్యయనం ప్రకారం వచ్చే 25 ఏండ్లలో భారత మహిళలు పురుషులతో సమానంగా ఎదిగితేనే దేశ జీడీపీలో వారి భాగస్వామ్యం 60 శాతానికి చేరుకుంటుంది. ఈ నేపథ్యంలో కేంద్ర, రాష్ర్టాల ప్రభుత్వాలు తదనుగుణంగా చర్యలు చేపట్టాలి.
ఐ.ప్రసాదరావు: 99482 72919