గత రెండేండ్లలో మానవజాతి చవిచూసిన అతిపెద్ద ఉత్పాతం ఏదనడిగితే.. టక్కున వచ్చే సమాధానం కరోనా అనే. కానీ సమాజంలో సగమైన స్త్రీజాతి అంతకుమించిన పెను ఉత్పాతాన్ని చవిచూస్తున్నదని ప్రపంచ ఆరోగ్య సంస్థ విస్తుగొలిపే నిజాన్ని బయటపెట్టింది. ప్రపంచవ్యాప్తంగా ప్రతి ముగ్గురు మహిళల్లో ఒకరు హింసను ఎదుర్కొంటున్నారంటూ ఈ నివేదిక వెల్లడించిన నిష్ఠుర సత్యం ఒక జాతిపై జరుగుతున్న హింసాచర్యలకు నిలువుటద్దంలా కనిపిస్తున్నది. స్త్రీని దేవతగా పూజించాలని చెప్పే భారత్లోనూ పరిస్థితి ఇందుకు భిన్నంగా ఏం లేదు. ఏ వ్యాక్సిన్లకూ లొంగని ఈ మాయరోగం నుంచి మహిళలకు రక్షణ కల్పించాలంటే మనుషులుగా చెప్పుకొంటున్న ప్రతి ఒక్కరూ ప్రతినబూనాల్సిందే!
అర్దరాత్రి ఆడపిల్ల ఒంటరిగా తిరిగిననాడే దేశానికి స్వాతంత్య్రం వచ్చినట్టన్నారు జాతిపిత మహాత్మాగాంధీ. కానీ ఆయన పలుకులు సాకారమయ్యే రోజు సుదూరంలోనూ కనిపించని పరిస్థితి దేశంలో నెలకొన్నది. ఒకవైపు లింగ వివక్షకూ, మహిళలపై దాడులకూ వ్యతిరేకంగా ఎన్నో ఉద్యమాలు జరుగుతున్నాయి. అయినా మళ్లీ మళ్లీ అవే సంఘటనలు పునరావృతమవుతున్నాయి. స్త్రీ నిర్భీతిగా మనగలగడమే లక్ష్యంగా రూపుదిద్దుకొంటున్న అనేకానేక చట్టాలకు తూట్లు పొడుస్తున్నారు. దీంతో ఎప్పటికప్పుడు ఒళ్లు గగుర్పొడిచే రీతిలో మహిళలపై అకృత్యా లు జరుగుతూనే ఉన్నాయి.
మొన్నటికి మొన్న ఢిల్లీలో పెళ్లి చేసుకొమ్మని అడిగినందుకు ప్రేయసిని ఖండఖండాలుగా నరికిన ఘటన యావత్ భారతావనిని ఉలిక్కిపడేలా చేసింది. అది మరువకముందే యూపీలో.. తనను మనువాడలేదన్న అక్కసుతో మరో అభాగ్యురాలిని ఇదేరీతిలో ముక్కలు చేసిన పాశవిక ఘటన వెన్నులో వణుకుపుట్టిస్తున్నది. తెచ్చిన కట్నం చాలలేదని చిత్తూరులో ఓ సాఫ్ట్వేర్ ప్రబుద్ధుడు భార్యను చంపి చెరువులో పడేశాడు. రెండవసారి కడుపులో ఆడపిల్లనే మోస్తుందన్న సాకుతో ఆరునెలల చూలాలిని విషమిచ్చి చంపిన వికృత ఘటన గుంటూరులో వెలుగుచూసింది. ఇవేవీ క్షణికావేశంతోనో, పొరపాటుగానో చేసిన నేరాలు కావు. ఇలాంటి నేరం చేసినవారికి ఏ కోశానా పశ్చాత్తాపం కనిపించడం లేదని వారిని విచారిస్తున్న పోలీసులే విస్తుపోతున్నారు. ఇది నేరాలకు ఒడిగడుతున్నవారిలో స్త్రీ జాతి పట్ల పాతుకుపోయిన సంకుచిత భావజాలానికి అద్దం పడుతున్నది.
గంటకు 86 అత్యాచారాలు: స్త్రీ శరీరం మీద పూర్తి హక్కు ఆమెకే ఉంటుందనీ, ఆమె అంగీకారం లేకుం డా భర్తయినా సరే ఆమెను తాకడాన్ని నేరంగానే పరిగణించాలని సర్వోన్నత న్యాయస్థానం తీర్పునిచ్చింది. క్షేత్రస్థాయిలో మాత్రం ఇందుకు భిన్నమైన పరిస్థితులే కానవస్తున్నాయి. స్త్రీలపై అఘాయిత్యాలకు ఒడిగడుతున్నవారిలో అత్యధికులు సన్నిహితులే కావడం మహిళల భద్రతను ప్రశ్నార్థకం చేస్తున్నది.
ఈ విష సంస్కృతికి తెరపడాలంటే, మార్పు ఇంటినుంచే మొదలుకావాలి. లింగభేదాలకు అతీతంగా ఎదుటి మనిషిని గౌరవించడం పిల్లలకు నేర్పించాలి. దాన్ని సుసాధ్యం చేస్తేనే కనీసం మరో రెండుతరాల తర్వాతైనా ఈ నేల మీద సమానత్వపు పూలతోటలను చూడగలిగే భాగ్యం కలుగుతుందేమో..
ఒక్క 2021లోనే ఆడవాళ్ల మీద జరిగిన హింసకు సంబంధించి భారత్లో నమోదైన కేసులు 4,28,278. అంతకుముందు ఏడాదితో పోలిస్తే ఈ నేరాల సంఖ్య 15.3 శాతం పెరిగిందని నేషనల్ క్రైమ్ రికార్డ్ బ్యూరో వెల్లడించింది. అందులోనూ సుమారు 32 శాతం నేరాలు భర్త, అతని సంబంధీకులు పాల్పడినవే. ఇదే ఏడాది 45,026 మంది ఆడబిడ్డలు ఆత్మహత్యలకు పాల్పడ్డారు. అందులో సగానికి పైగా మహిళలు గృహిణులే. ఆ ఆత్మహత్యలకు వరకట్నంతో పాటు సంతాన సం బంధిత సమస్యలే ప్రధాన కారణాలుగా ఉన్నాయి. ఆడవాళ్లపై అత్యధికంగా హింస జరుగుతున్న రాష్ర్టాల్లో అస్సాం మొదటి స్థానంలో ఉన్నది. ఇక్కడ మహిళలపై జరుగుతున్న నేరాల రేటు ఒక్క ఏడాదిలోనే ఏకంగా 168.3 శాతం పెరిగింది. దీని తర్వాత స్థానంలో ఒడి శా, హర్యాణాలున్నాయి. కేంద్రపాలిత ప్రాంతాల జాబితాలో దేశ రాజధాని ఢిల్లీ (143.6 శాతం పెరుగుదల) ముందు వరుసలో ఉండటం శోచనీయం. ఆడవాళ్ల మీద వివక్ష దాడులతో ఆగడం లేదు. ఒక్క భారత్లోనే ఈ ఏడాది 284 మంది అబలలు లైంగికదాడి, అనంతరం హత్యకు గురయ్యారు. సగటున రోజుకు ఇండియాలో జరుగుతున్న లైంగికదాడుల సంఖ్య 86. దేశవ్యాప్తంగా ప్రతిగంటకు మహిళలపై దాడులకు సంబంధించి 49 కేసులు నమోదవుతున్నాయి. ప్రపంచ వ్యాప్తంగా ప్రతి 11 నిమిషాలకు ఒక మహిళ లేదా బాలిక హత్యకు గురవుతున్నదని ఐరాస నివేదిక తెలుపుతున్నది. వారి సంరక్షణకు ప్రభుత్వాలు నిధులు కేటాయించి కార్యాచరణ రూపొందించాలని నొక్కి చెప్తున్నది.
ఇదే కర్తవ్యం..: లెక్కకు మిక్కిలి ఘటనల్లో ఆడవాళ్లకు సత్వర న్యాయం ఎండమావే అవుతున్నది. స్త్రీల రక్షణకు పటిష్ఠ చర్యలు తీసుకోవడానికి కేంద్రం నిర్భయ చట్టాన్ని అమల్లోకి తెచ్చింది. అదే నిర్భయ నిందితులకు పూర్తిస్థాయి శిక్ష పడటానికి ఎనిమిదేండ్లు పట్టడం న్యాయవ్యవస్థలో ఉన్న లోపాలను దివిటీపట్టి చూపిస్తున్నది. గుజరాత్ అల్లర్ల సమయంలో బిల్కిస్ బానో అనే మహిళపై అమానవీయ రీతిలో లైంగికదాడికి తెగబడ్డ దోషులకు ఇటీవల లభించిన స్వాగతం సభ్య సమాజాన్ని తలదించుకునేలా చేసింది. 2019 లోక్సభ ఎన్నికల్లో పోటీచేసిన వారిలో 126 మంది మహిళలపై హింస కు పాల్పడి కేసులు ఎదుర్కొంటున్న ప్రబుద్ధులే. ఆడవాళ్లపై హింసకు పటిష్ఠమైన చట్టాల లేమితో పాటు, నైతిక విలువలు వంటబట్టించని విద్యావ్యవస్థ కూడా ఒక కారణమే. దీనికితోడు మితిమీరిన హింస, ఆశ్లీలతను అరచేతిలో చూపిస్తున్న అంతర్జాల వినియో గం, మాదకద్రవ్యాలు మరో కారణం. ఈ విష సంస్కృతికి తెరపడాలంటే, మార్పు ఇంటినుంచే మొదలుకావాలి. లింగభేదాలకతీతంగా ఎదుటి మనిషిని గౌరవించడం పిల్లలకు నేర్పించాలి. దాన్ని సుసాధ్యం చేస్తేనే కనీసం మరో రెండుతరాల తర్వాతైనా ఈ నేల మీద సమానత్వపు పూలతోటలను చూడగలిగే భాగ్యం కలుగుతుందేమో.
(నేడు మహిళలపై హింస నిర్మూలన దినం)
-లక్ష్మీహరిత ఇంద్రగంటి