ఉక్రెయిన్ యుద్ధం కారణంగా రష్యాపై గతేడాది పశ్చిమ దేశాలు మూకుమ్మడిగా ఆర్థిక ఆంక్షలు విధించాయి. ఈ పరిస్థితిని తనకనుకూలంగా మలుచుకొని రష్యా నుంచి భారత్ చౌక ధరలకు చమురును దిగుమతి చేసుకుంటున్నది. మన దేశపు మొత్తం దిగుమతుల్లో రష్యా వాటా 35 శాతానికి చేరింది. ఈ మారకం రూపాయి ద్వారా జరగడంతో భారత్కు మరింత లాభసాటిగా మారింది. అయినప్పటికీ భారత్ చమురు దిగుమతుల్లో పశ్చిమాసియా వాటా 45 శాతం మేర ఉంటున్నది. ఇందులో ఇరాక్ వాటా 21 శాతం, సౌదీ అరేబియా వాటా 18 శాతం. ఇప్పుడు పశ్చిమాసియాలో యుద్ధం ప్రజ్వరిల్లుతున్నది. ఇజ్రాయెల్-హమాస్ భీకరపోరు ఎటుపోయి ఎటు తిరుగుతుందోననే ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి.
ఇరాన్, లెబనాన్, ఇతర దేశాలు ప్రత్యక్ష యుద్ధంలోకి దిగుతాయా? గాజాపై అణుబాంబు వేస్తామని ఇజ్రాయెల్ మంత్రి హెచ్చరించడంపై ప్రపంచం స్పందన ఎలా ఉంటుంది? ఇస్లామిక్ దేశాల వైఖరి ఏమిటి? ప్రస్తుతం ఈ ప్రశ్నలు పశ్చిమాసియాపైనే కాదు, ప్రపంచం ముందూ వేలాడుతున్నాయి. ఆ సంగతి అలా ఉంచితే ప్రస్తుత యుద్ధం ప్రభావం చమురు ధరలపై పడుతుందా? అనేది అతిపెద్ద ప్రశ్నగా ముందుకువచ్చింది. చమురు దిగుమతిలో, వినియోగంలో ప్రపంచంలో మూడో స్థానంలో ఉన్న భారత్కు ఈ ప్రశ్న సహజంగానే ఆందోళన కలిగిస్తున్నది.
ఉక్రెయిన్ యుద్ధం మొదలైన తర్వాత రష్యా నుంచి భారత్ చమురు దిగుమతులు గణనీయంగా పెరిగినా, ఇప్పటికీ పశ్చిమాసియా నుంచే అత్యధిక మొత్తంలో చమురు కొనుగోలు చేస్తున్నది. పశ్చిమాసియాలో యుద్ధం వల్ల ఉద్రిక్తతలు పెరిగితే చమురు ధరలు పైపైకి పోయే ప్రమాదం ఉన్నది. అదే జరిగితే భారత ఆర్థికవ్యవస్థ కుదుపునకు గురయ్యే అవకాశం ఉన్నదని ఆర్థికవేత్తలు హెచ్చరిస్తున్నారు. ఇదేమీ నిరాధారమైన ఆందోళన కాదు. గాజా సంక్షోభం ముదురుతున్న కొద్దీ ఆయిల్ మార్కెట్లు ఉత్కంఠకు, ఒడిదుడుకులకు లోనవుతున్నాయని అంతర్జాతీయ ఇంధన సంస్థ (ఐఈఏ) పేర్కొనడం గమనార్హం. యుద్ధం తీవ్రమైతే ద్రవ్యోల్బణం పెరుగుతుందని, దీనిపై దిద్దుబాటు చర్యలు తీసుకోవాల్సి రావచ్చని కూడా ప్రపంచ బ్యాంకు వర్ధమాన దేశాలను హెచ్చరించింది. ప్రధానంగా ఆహార ధరలపై, అంతిమంగా ఆహారభద్రతపై చమురు సంక్షోభం ప్రభావం పడుతుందని అప్రమత్తం చేయడం గమనార్హం.
ఉద్రిక్తతలు పెరిగితే చమురుతో పాటుగా అన్నిరకాల సరుకుల రవాణా కూడా దెబ్బతినే అవకాశం ఉంటుంది. ఆర్థికంగానే కాకుండా రాజకీయంగా కూడా ఇజ్రాయెల్-హమాస్ యుద్ధం భారత్కు పరీక్షగా మారుతున్నది. సంప్రదాయికంగా పాలస్తీనాకు మద్దతుగా నిలిచే భారత్ ఇజ్రాయెల్ వైపు మళ్లడంపై విస్మయం వ్యక్తమవుతున్నది. పశ్చిమాసియాలోని చమురుదేశాలు ప్రధానంగా ఇస్లాం మతానికి చెందినవేననేది తెలిసిందే. దాదాపుగా అవన్నీ కూడా ఇజ్రాయెల్కు బద్ధశత్రువులే. ఈ నేపథ్యంలో భారత్ దౌత్యపరంగా ఆచి తూచి అడుగులు వేయాల్సిన ఆవశ్యకత కనిపిస్తున్నది.