జనాభాలో నిన్న మొన్నటిదాకా రెండోస్థానానికి పరిమితమైన భారత్ పొరుగుదేశం చైనాను వెనుకకు నెట్టేసి మొదటి స్థానానికి చేరుకున్నది. ఈ సత్యం ఇప్పుడిప్పుడే దేశ ప్రజల్లోకి మెల్లమెల్లగా ఇంకుతున్నది. ఇంతకూ ఇది వరమా? శాపమా? అంటే చూసే దృక్కోణాన్ని బట్టి ఉంటుంది. పెద్ద జనాభా అంటే పెద్ద మార్కెట్ అని అర్థం. ఆ రకంగా చూస్తే మన దేశం వాణిజ్య ప్రపంచానికి ఆకర్షణీయమైన గమ్యస్థానంగా ఉంటుంది. శ్రామికశక్తి, ముఖ్యంగా యువత దండిగా అందుబాటులో ఉంటుంది కనుక పరిశ్రమలు పెట్టడానికి ముందుకు వచ్చేవారు పెరుగుతారు. అదే ఇంకోవైపు నుంచి చూస్తే పేదరికం, ఆకలి, అజ్ఞానం వెక్కిరిస్తాయి. పెరిగిన జనాభాకు అన్నీ సమకూర్చడం దేశానికి తలకు మించిన భారమవుతుంది. పైగా వాతావరణ మార్పులతో దేశ వ్యవసాయం అతలాకుతలమవుతున్నది. అయితే వనరులు, భూమి పరిమితమేనన్న విషయాన్ని గుర్తుంచుకోవాలి.
జనాభాలో అగ్రస్థానానికి చేరుకోవడంపై భారతీయులు ఏమనుకుంటున్నారు? దీనిపై గర్విస్తున్నారా లేక సిగ్గు పడుతున్నారా? ఈ ప్రశ్నపై చాలామంది ఎటూ తేల్చుకోలేకపోతున్నారని సర్వేలు చెప్తున్నాయి. ప్రముఖ మీడియా సంస్థ మింట్ జరిపిన సర్వేలో ఆసక్తికరమైన విషయాలు వెలుగుచూశాయి. చైనా తన జనాభాను తగ్గించుకొని రెండో స్థానంలోకి వస్తే జనాభా ఇబ్బడిముబ్బడిగా పెరిగి భారత్ మొదటి స్థానంలోకి వచ్చిపడింది. అధిక జనాభా అనేది అభివృద్ధికి అడ్డుపడుతున్న సమస్యా లేక అందివచ్చిన అవకాశమా? ఓవైపు ప్రపంచ మార్కెట్లో చైనా తన ప్రభావాన్ని రోజురోజుకూ పెంచుకుంటూ పోతున్నది. అటు జనాభా నియంత్రణలోనూ మనకన్నా మెరుగైన పనితనాన్ని చూపిస్తున్నది. ఉపాధి కల్పన, పేదరిక నిర్మూలనలోనూ చైనా ఆదర్శంగా నిలుస్తున్నట్టు ఎక్కువమంది భారతీయులు భావిస్తున్నారు. ఈ దిశగా మనదేశంలో స్పష్టమైన విధానమంటూ ఉన్నట్టు కనిపించడం లేదని యువత కలత చెందుతున్నది. 2 కోట్ల ఉద్యోగాల హామీ ఏమైందో ఏమో గానీ, అస్తవ్యస్త విధానాల వల్ల ఉన్న ఉద్యోగాలు ఊడుతున్నాయి.
భారత పౌరుల మనోగత అభిప్రాయాల్లోనూ చాలా మార్పులు వస్తున్నాయి. ముఖ్యంగా పట్టణ యువత అనేక కొత్త ఆలోచనలకు ఆధారభూతంగా నిలుస్తున్నది. కుటుంబాలు, వివాహం, పిల్లల విషయంలో విప్లవాత్మక మార్పులు చోటుచేసుకుంటున్నాయి. మింట్ సర్వే ప్రకారం పట్టణ యువతలో 53 శాతం మంది వ్యక్తిగత స్వేచ్ఛకు అడ్డుపడుతుందనే ఉద్దేశంతో వివాహ వ్యవస్థపై పెద్దగా ఆసక్తి చూపడం లేదు. పిల్లలు వద్దనుకునేవారూ పెరుగుతున్నారు. ఇక వృద్ధులైన తల్లిదండ్రులు తాము కనిపెంచిన పిల్లలతో కలిసి ఉండాల్సిన అవసరం లేదని 51 శాతం మంది చెప్పడం దేనికి సంకేతం? మలిసంజెలో ఉన్నవారి సంక్షేమాన్ని ప్రశ్నార్థకం చేస్తున్న అభిప్రాయమిది. 57 శాతం మంది సంప్రదాయాలు, ఆచారాల కన్నా వ్యక్తిగత ఇష్టాయిష్టాలకే ప్రాధాన్యం ఇస్తున్నారు. ఆధునికత, సాంకేతికతతో పాటు సమాజం ఆలోచనావిధానంలో సమూల మార్పులు వస్తున్నాయనడానికి సంకేతమిది.