పహల్గాంలో భారత మహిళల సిందూరాన్ని నేలరాల్చిన ముష్కరుల స్థావరాలపై భారత రక్షణ దళాలు అగ్నివర్షం కురిపించాయి. ఉగ్రవాదంపై ప్రతీకారంగా ‘ఆపరేషన్ సిందూర్’ పేరిట జరిపిన మహోగ్రదాడిలో పాకిస్థాన్ గడ్డపై ఇష్టారాజ్యంగా నడుపుతున్న శిక్షణా స్థావరాలు బూడిద కుప్పలుగా మారాయి. లక్ష్యాలను ఛేదించడంలో, శత్రు స్థావరాలను నేలమట్టం చేయడంలో మన దళాల పాటవానికి సిందూ ర్ నిలువుటద్దం పడుతున్నది. ఒకటి కాదు, రెండు కాదు ఏక కాలంలో తొమ్మిది స్థావరాలపై ఇండియా గురిపెట్టింది. మంగళవారం అర్ధరాత్రి దాటిన తర్వాత పాక్ భూభాగం, ఆక్రమిత కశ్మీర్లోని అనేక ఉగ్రవాద శిబిరాలు ధ్వంసమైనట్టు వార్తలు వెలువడుతున్నాయి.
రక్షణ నిబంధనల రీత్యా పూర్తి సమాచారం ఇంకా బయటికి రానప్పటికీ ఉగ్రవాద మూలాలను తెగటార్చే లక్ష్యంతో ఇవి జరిగాయనేది అధికారిక సమాచారం. భారత రక్షణ దళాలు మొత్తం తొమ్మిది లక్ష్యాలను ఎంచుకోగా అందులో ఐదు పాక్ భూ భాగంలో, మిగిలిన నాలుగు పాక్ ఆక్రమిత కశ్మీర్లో ఉన్నాయి. ఉగ్రదాడులకు పథకాలు వేసే, ఆ దాడులను నిర్దేశించే ప్రదేశాలే లక్ష్యంగా క్షిపణుల వర్షం కురిపించినట్టు రక్షణశాఖ వెల్లడించడం విశేషం.
ప్రధానంగా లష్కరే తోయిబా, జైషే మహమ్మద్ సంస్థల స్థావరాలు లక్ష్యంగా భారత్ క్షిపణుల వర్షం కురిపించింది. మొత్తం 24 ప్రకంపనలు సంభవించినట్టు పాక్ అధికారికంగా వెల్లడించింది. అంతేకాకుండా తొలి వార్తల్లో 26 మంది మరణించినట్టు ప్రకటించింది. తమ వాళ్లు 14 మంది భారత్ దాడుల్లో మరణించినట్టు జైషే మహమ్మద్ మసూద్ అజర్ ప్రకటించడం గమనార్హం. తన భూ భాగాన్ని భారత వ్యతిరేక ఉగ్రవాద కార్యకలాపాలకు సురక్షిత స్థావరంగా మార్చిన పాక్ స్పందన ‘తేలు కుట్టిన దొంగ’ తరహాలో ఉన్నది.
ఆత్మరక్షణ కోసం స్పందించే హక్కు తనకున్నదని, తగిన సమయంలో దానిని ఉపయోగిస్తామని చెప్పడం మేకపోతు గాంభీర్యం తప్ప మరోటి కాదు. ఈ దాడులను ఒకరకంగా పాకిస్థాన్ తనంతట తానుగా ఆహ్వానించిందని చెప్పవచ్చు. మతోన్మాద ఉగ్రమూకలను పెంచి పోషించి, భారత్పై పాక్ మొదలుపెట్టిన పరోక్ష యుద్ధం చివరి ఘట్టానికి చేరుకున్నది. తప్పుచేసిన వారు శిక్ష అనుభవించక తప్పని సమయం వచ్చింది. భారత్ రక్తమోడుతుంటే రాక్షసానందం పొందిన పొరుగు నాయకత్వం పరిహారం చెల్లించుకునే రోజు రానే వచ్చింది.
ఉగ్రవాదాన్ని పెంచి పోషించినందుకు పాక్ అంతర్జాతీయంగానూ ఏకాకి అయింది. పాకిస్థాన్ విజ్ఞప్తి మేరకు రెండు రోజుల కిందట జరిగిన ఐక్యరాజ్య భద్రతా మండలి సమావేశం ఎలాంటి తీర్మానం చేయకుండానే ముగిసిపోవడం దీన్నే సూచిస్తున్నది. పైగా కశ్మీర్ సమస్యను లేవనెత్తేందుకు పాక్ జరిపిన ప్రయత్నాలు పేలవంగా తేలిపోవడమూ పొరుగు దేశ వైఫల్యాన్ని సూచిస్తున్నది.
ఉగ్రవాదపు విషపు మొక్కను తన పెరడులో పెంచిపోషించిన పాక్ ప్రపంచం ముందు దోషిగా నిలబడింది. పహల్గాంలో రీతిలో అమాయకులను చంపి న దుర్మార్గులు పాక్లోని తమ సూత్రధారులతో ఎప్పటికప్పుడు కమ్యూనికేషన్ జరిపినట్టు రుజువులు దొరికాయని భారత విదేశాంగశాఖ తాజాగా ధృవీకరించింది. భారత్ జరిపిన దాడులకు ఇంతకన్నా బలమైన హేతువు ఏం కావాలి?