ప్రధాని మోదీ తెలంగాణ పర్యటన సందర్భంగా చేసిన వ్యాఖ్యలు దిగ్భ్రాంతికరంగా ఉన్నాయి. అబద్ధాలు, అర్ధ సత్యాలు మాట్లాడటం ప్రధానికి అలవాటే. కానీ అబద్ధాలు అలవోకగా వండి వారిస్తే ఇక్కడి ప్రజలు గ్రహించలేరా? ఏదైనా రాష్ర్టానికి వచ్చినప్పుడు ఆ రాష్ర్టాన్ని, ప్రజలను గౌరవించాలనే కనీస మర్యాద మోదీకి తెలువదా? రాష్ట్ర ప్రజల అభిమానాన్ని చూరగొనాలి తప్ప చౌకబారు కయ్యానికి దిగకూడదు.
నాయకుడికి ఏ ప్రాంతంపైనా వివక్ష ఉన్నట్టు కనిపించకూడదు. అన్ని వర్గాల, ప్రాంతాల ఆదరాభిమానాలను చూరగొనేలా ప్రవర్తించాలి. కానీ నిండు పార్లమెంటులో ‘తల్లిని చంపి బిడ్డను బతికించారు’ వంటి దుర్మార్గపు వ్యాఖ్యానాలతో తెలంగాణ ప్రజల మనోభావాలను దెబ్బతీసిన మోదీ ఇప్పుడు ఏకంగా మన గడ్డమీదకు వచ్చి ఇక్కడి ప్రజలను కించపరచడం అభ్యంతరకరం.
మునుగోడు అసెంబ్లీ స్థానానికి ఉప ఎన్నిక ముగిసింది. ఎన్నికల సందర్భంలో వాడివేడి చర్చలు జరిగి ఉం టాయి. ఆవేశకావేశాలు చెలరేగి ఉంటాయి. కా నీ ఎన్నికలు ముగిసిన తరువాత సౌహార్దంగా ఉండమని ప్రజలకు అన్ని పార్టీల నాయకులు బోధించాలి. తాము కూడా ఆ విధంగా వ్యవహరించాలి. అభివృద్ధిపై దృష్టి సారించాలి. కానీ ఎన్నికలు ముగిసి వేడి చల్లారిన తరువాత వచ్చి ప్రధాని మాట్లాడిన తీరు విచిత్రంగా ఉన్నది. పైగా ఆయన చెప్పిందేమిటి! మునుగోడు ప్రజలు బీజేపీపై భరోసా ఉంచారట. కాంగ్రెస్ నుంచి తెచ్చుకున్న వ్యాపారస్థుడిని రంగంలోకి దింపి ఇదీ బీజేపీ తడాఖా అంటూ ఏదో చూ పించబోయారు. గెలువలేక బొక్కా బోర్లా పడ్డా రు. పడితే పడ్డారు. గెలుపు ఓటములు సహ జం. కానీ ధనబలం గెలువలేదనేది అంగీకరించకుండా బీజేపీపై ప్రజలు భరోసా చూపారనడమేమిటి? ఇదెక్కడి విశ్లేషణ! టీఆర్ఎస్ తన బలగాలను మోహరించడం తప్పా? బీజేపీ నాయకులు తమ ప్రచారం సాగించలేదా?
మోదీ గారు అబద్ధాలను వండివార్చటమే కాదు, హాస్యాన్ని కూడా పండించగలరని ఈ పర్యటనలో నిరూపించుకున్నారు. హైదరాబాద్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీకి కోట లాంటింది. కానీ ఇక్కడ ప్రభుత్వం మూఢ నమ్మకాలను పెంచి పోషిస్తోందట! ఈ మాటలు వింటే జనం కడుపుబ్బ నవ్వరా! మూఢనమ్మకాలను పెంచి పోషించేది బీజేపీ పరివారమా? తెలంగాణ ప్రభుత్వమా? ఆసేతు హిమాచలం మూఢనమ్మకాలను పెంచి పోషిస్తూ , విద్వేషాలను రెచ్చగొడుతూ రాజకీయంగా పబ్బం గడుపుకునే నాయకులు తెలంగాణ ప్రభుత్వంపై మూఢనమ్మకాల ఆరోపణలను చేయడమేమిటి? తెలంగాణ సమాజం ఎవరి నమ్మకాలనూ అవమానించదు, అందరి విశ్వాసాలను, మనోభావాల ను గౌరవిస్తుంది. లౌకిక సంస్కృతి లక్షణమది. తెలంగాణ నుంచి మూఢనమ్మకాలను తరిమేయాల్సిన సమయం వచ్చింది అని ఘనత వహించిన మోదీ గారు పిలుపు ఇవ్వడం మరీ విడ్డూరంగా ఉన్నది. తెలంగాణ నుంచే కాదు, దేశం మొత్తం నుంచి మూఢనమ్మకాలను తరిమి వేయడం అజెండా అయితే అదే చేపట్టండి అభ్యంతరం ఎందుకు? పరిపాలనకు, మతానికి సంబంధం లేకుండా ఉండాలని, లౌకిక విధానమే ఉత్తమమని మీ కార్యకర్తలకు బోధించండి. మూకదాడులకు పాల్పడటాన్ని ఖండించండి. ఆ ధైర్యం, చిత్తశుద్ధి మీకున్నదా?
తెలంగాణ ప్రభుత్వం అభివృద్ధికి, ప్రజాస్వామ్యానికి, సామాజిక న్యాయానికి అతి పెద్ద శత్రువట? ఎంత గొప్పగా మాట్లాడారు మోదీజీ! అభివృద్ధికి శత్రువులు ఎవరు మోదీజీ! గత ఎనిమిదేండ్ల లెక్కలు తీయండి. దేశ వ్యాప్తంగా తమరి ప్రభుత్వం సాధించిన అభివృద్ధి ఏపాటిది? తెలంగాణ సాధించిన ప్రగతి ఎంత? గణాంకాలు చెబుతున్నాయి కదా. తెలంగాణ ప్రభుత్వానికి అవార్డులు ప్రకటించింది మీ ప్రభుత్వమే కదా. ఏయే రంగాలలో ఎవరు ఎంత వృద్ధి సాధించారనేది ఒక్కసారి బేరీజు వేసి చూసుకోండి. ఇగ మీ నోట ప్రజాస్వామ్యం అనే మాట వినిపించడమంటేనే 21వ శతాబ్దంలోకెల్లా ఒక పెద్ద జోక్ కదా! ప్రజాస్వామ్యమంటే ఏమిటి మోదీజీ? ఇతర పార్టీల రాష్ట్ర ప్రభుత్వాలను కూలదోయడమా? ప్రజా ప్రభుత్వాలకు వ్యతిరేకంగా గవర్నర్లను ఎగదోయడమా? పార్లమెంటును బలహీనపరచడమా? పార్లమెంటరీ కమిటీలను నిర్లక్ష్యం చేయడమా? పార్లమెంటు చర్చల్లో పాల్గొనకపోవడమా? మీ నిఘంటువులో ప్రజాస్వామ్యం అంటే ఏమని ఉందో ఒకసారి దేశ ప్రజలకు చూపించండి! ఇంకా సామాజిక న్యాయమనే పెద్ద మాట కూడా మీ నోట వెలువడింది. బీజేపీ అధికారానికి వచ్చిందే బలహీనవర్గాల వ్యతిరేక ఎజెండాతోని కాదా? మీరు అధికారం చేపట్టిన తరువాత బలహీనవర్గాల ప్రాతినిధ్యం తగ్గిపోయింది వాస్తవం కాదా? బలహీనవర్గాలకు నిధుల కేటాయింపును తమ ప్రభుత్వం తగ్గించింది వాస్తవం కాదా? తెల్లారితే బలహీనవర్గాల ప్రజల సంక్షేమానికి వ్యతిరేకంగా నిర్ణయాలు తీసుకునేది మీ ప్రభుత్వమే. మళ్ళా మీరు విచిత్రమైన రీతిలో వారిపై ప్రేమ ఒలకబోస్తున్నారు. తెలంగాణను శరవేగంగా అభివృద్ధి చేస్తున్నది రాష్ట్ర ప్రభుత్వం. ప్రజాస్వామ్యాన్ని గౌరవించాలని డిమాండ్ చేస్తున్నది తెలంగాణ రాష్ట్రం. అంతేకాదు, దళిత బంధు వంటి అనేక పథకాలను అమలు చేస్తున్నది. గ్రామీణ వృత్తులను ఆదుకుంటున్నది. పేదల ఆదాయాలను పెంచింది. మీ కంటికి ఈ అభివృద్ధి ఆనడం లేదా?
మీ నోటి వెంట అవినీతి అనే మాట రావడం దయ్యాలు వేదాలు వల్లించినట్టుగా ఉన్నది. రఫేల్ మొదలుకొని వ్యాపమ్ వరకు అనేకానేక కుంభకోణాలతో కుతకుతలాడుతున్నవి బీజేపీ ప్రభుత్వాలే. ముందు మీ ఇంటిని శుభ్రపరుచుకోండి. తెలంగాణ నాయకుల మీద బురద జల్లడం వల్ల ఫలితం ఉండదు. ఇక్కడి ప్రజలకు తెలుసు ఎవరు అవినీతిపరులో, వరు నీతివంతులో.
కొందరికి మోదీని తిట్టడమే పనిగా ఉందట. ఎవరు సారూ మిమ్ములను తిట్టింది. ఒకసారి బండి సంజయ్ మాటలను వినండి. తల్లిదండ్రులు పిల్లల చెవులు మూస్తారు వినకూడదని. సభ్యత సంస్కారం లేని నాయకులను పార్టీలో అందలం ఎక్కించి శెభాష్ అని వెన్నుతడుతున్నది మీరు. అదే మీ సంస్కారమైతే తెలంగాణ ప్రజల గౌరవ వాక్యాలు మీకు తిట్లలాగే కనిపిస్తాయి మరి. మీ నిఘంటువు అట్లా ఉన్నది మరి. హైదరాబాద్ అంటే మోదీగారికి తెగ ఇష్టమట! పైగా తెలంగాణ ప్రజలకు నష్టం కలిగిస్తే ఊరుకునేది లేదంటూ మోదీ గారు ప్రేమ ఒలకబోశారు. ఆహా ఎంత ప్రేమ మోదీజీ! ఇక్కడి ప్రజల అమాయకత్వంపై తమరికి ఎంత నమ్మకం! హైదరాబాద్ మీద, తెలంగాణ మీద ఇంత ప్రేమ ఉంటే మరి తాము చేస్తున్నదేమిటి? ప్రేమ అంటే సేవ చేయడమా? యాసిడ్ దాడి చేయడమా? మీ నిఘంటువులో ఏమని ఉన్నది? గుజరాత్కు ప్రకటించినట్టు తెలంగాణకు ఏమైనా ఇచ్చారా? వచ్చే వాటిని తరలించుకుపోతున్నారు కదా!
హైదరాబాద్ మీద అంత ప్రేమ ఉంటే ఐటీఐఆర్ ప్రాజెక్టు ఒకటి ఇస్తే సరిపోతుంది కదా! తెలంగాణ మీద అంత పావురమే ఉంటే ఒక జాతీయ ప్రాజెక్టు ఇవ్వవచ్చు కదా? బయ్యారం ఉక్కు కర్మాగారం పెట్టించవచ్చు. అటవీ విశ్వవిద్యాలయమో, కోచ్ ఫ్యాక్టరీయో దయతలచవచ్చు కదా? మీరు చెయ్యవలసిన బాధ్యతలను తెలంగాణ రాష్ట్రం పదేపదే గుర్తు చేస్తూనే ఉన్నది. అయినా మీ ప్రేమ ఎంత ఘాటుగా ఉందో కానీ ఒక్క ప్రాజెక్టూ రాదాయె?
కనీసం చుట్టం చూపుగా వచ్చినప్పుడైనా విభజన హామీలు అమలు చేస్తామని ఒక్కటంటే ఒక్క మాట అంటారని ప్రజలు ఎదురు చూశారు. కానీ ఈ విషయంలో మీకు మొహమాటం అన్నదే లేదు. మోచేతి పట్టు అంటారు. పట్టుకున్నట్టు ఉంటుంది జాడిస్తే జారి పోతూ ఉంటుంది. మీ ప్రేమ అటువంటిదే! తెలంగాణ ప్రజల కలలను చెరిపేయాలని చూస్తే తీవ్ర పరిణామాలు ఉంటాయట! మీకు మీరే హెచ్చరించుకుంటున్నట్టుగా ఉన్నది. మనసులో బుగులు బయట పడ్డదా ఏమిటి?
పనిలో పనిగా మోదీజీకి రైతుల మీద కూ డా వెర్రి ప్రేమ పుట్టుకొచ్చింది. ఇక్కడి రైతుల పరిస్థితి ఏమీ బాగా లేదట? ఇంత పచ్చి అబద్ధాలా! దేశంలోనే వ్యవసాయ సంక్షోభానికి పరిష్కార మార్గాన్ని కనుగొని ప్రయోగాత్మకంగా అమలు చేసి చూపించింది తెలంగాణ. ఇక్కడి పంటలు కొనకుండా ఇబ్బందులు పెడుతున్నది మీ ప్రభుత్వం. గింత ఉల్టా పల్టా మాట్లాడితే ఎట్లా? రైతులకు దేశంలో మీరు చేసిందేమిటి? బీజేపీ రాష్ట్ర ప్రభుత్వాలు ఒరగబెట్టిందేమిటి? ఇంత ఘోరమైన వక్రీకరణలా? మోదీ గారి మాటలలో ఇంకా బాగా నవ్వించే అంశం పాజిటివ్ అజెండా! మొన్న మునుగోడు ఎన్నికలలో పాజిటివ్ అజెండాతో పో యిందెవరు? టీఆర్ఎస్ కాదా? తాము చేసింది చెప్పి ఓట్లడిగింది. గెలిస్తే ఏమి చేయగలమో చెప్పింది? ఇంతకన్నా పాజిటివిటీ ఏమి టి? మీ పార్టీ నేత బండి సంజయ్ బూతులు తిట్టడం పాజిటివిటీయా? ద్వేషాలు రెచ్చగొట్టడం పాజిటివిటీయా? హిజాబ్, హలాల్, చైనా పాకిస్థాన్ అంటూ ఎన్నికల ముందు మాట్లాడటం పాజిటివిటీయా? ఇవేమి వింత భాష్యాలు? మీరు చేసిందేమిటి? చేయబోయేది ఏమిటి? కొంచెం వివరించి చెబుతారా?
సింగరేణిని ప్రైవేటీకరించేది లేదట? కామధేనువు వంటి ఎల్ఐసీని అమ్మకానికి పెట్టింది మీరు. రైల్వేల దగ్గరి నుంచి ఓడరేవుల వరకు పలారం పంచినట్టు ప్రైవేటుకు అప్పగిస్తున్నది మీరు. కరెంటు మీటర్లు పెట్టాలని, ప్రైవేటీకరణ విధానాలు అమలు చేయాలని రాష్ర్టాలపై ఒత్తిడి తెస్తున్నది మీరు. మీకు మాటపై నిలబడే లక్షణం ఉంటే, సత్యసంధత ఉంటే ఏమి చెప్పినా నమ్మవచ్చు. కానీ కార్మికుల ప్రయోజనాలను కాలరాస్తూ, దేశ ప్రజల ఆస్తులను అమ్మకానికి పెడుతున్న మీ అజెండా ప్రజలకు అర్థమైంది. అందుకే సింగరేణిపై భయాలు నెలకొన్నాయి. ఒకవైపు మీరు ప్రైవేటీకరణ బాటలో నడుస్తుంటే, తెలంగాణ ప్రభుత్వం ఖాయిలా పరిశ్రమలను పునరుద్ధరిస్తున్నది. అందుకే మీరు సంజాయిషీ ఇచ్చుకోవలసి వస్తున్నది. సంజాయిషీ ఇవ్వడం కాదు, సత్యసంధతను నిరూపించుకోండి.
మోదీ గారూ! ఏదైనా రాష్ర్టానికి పోతే చైనాకో, పాకిస్థాన్కో పోయినట్టుగా ప్రవర్తించకూడదు, మాట్లాడకూడదు. తెలంగాణ భారత్లోనే ఉన్నది. ఇక్కడి రాష్ట్ర ప్రభుత్వం అంటే ప్రజాప్రభుత్వం. కేంద్రం రాష్ర్టాన్ని కలుపుకొని పోవాలె. తెలంగాణ రాష్ట్రం సాధించుకున్న తరువాత ఇక్కడి సమాజం సాధించిన అభివృద్ధిని మీ నోటితో ఒక్కసారైనా ప్రశంసిస్తే ఎంత బాగుండేది. ఇక్కడి ప్రజలు పొంగిపోయేవారు కదా. ఇక్కడి ప్రజలకు చేసిన హామీలు నెరవేరుస్తామని ఒక్క మాట అంటే ఎంత సంతోషించేవారు. విభజన హామీలపై ఒక స్పష్టమైన అజెండా ప్రకటిస్తే ఎంత గొప్పగా ఉండేది. కేంద్ర రాష్ట్ర సంబంధాలను ఆరోగ్యవంతంగా మారుస్తానని చెబితే రాష్ట్ర ప్రజలే కాదు, దేశమంతా సంతోషించేది. అదొక చరిత్రాత్మక వ్యాఖ్యగా నిలిచిపోయేది. ఇప్పుడు ఎన్నికలు కూడా లేవు. ఈ సందర్భంలో మీరు దేశ ప్రధానిగా ఎంతో హుందాగా మాట్లాడాల్సింది. సా క్షాత్తూ పార్లమెంటులోనే మీరు తెలంగాణ ఏర్పాటును కించపరిచారు. ప్రధాని హోదాలో ఒక రాష్ట్రంపై విద్వేషం కక్కడం సబబా, సం స్కారమా? అనేక సందర్భాలలో మీ నిర్ణయా లు తెలంగాణకు వ్యతిరేకంగానే ఉంటున్నాయి.
తెలంగాణ ప్రజల హృదయాన్ని మీరు అనేక సందర్భాలలో గాయపరిచారు. ఆ మాటలకు, చేతలకు పశ్చాత్తాపం ప్రకటించి ఇక నుంచి తెలంగాణ ప్రజల సంక్షేమాన్ని పట్టించుకుంటాననే ఒక్క హామీ ఇస్తే ఎంత బాగుండేది. ఈ పర్యటన సందర్భంగా తెలంగాణ ప్రజల మనసును హత్తుకునే విధంగా నాలుగంటే నాలుగు మాటలు చిరునవ్వుతో మాట్లాడితే మీ పదవికి వన్నె వచ్చేది. మీ అబద్ధాలకు, వక్రీకరణలకు బండి గణాలు సంతోషిస్తాయి కావచ్చు. కానీ తెలంగాణ ప్రజలు హర్షించరు.
ఇప్పటి వరకు తాము నికార్సయిన, ఎలాంటి ఆరోపణలు లేని పారదర్శకమైన పార్టీకి చెందిన వారమని, పారదర్శక ప్రభుత్వాన్ని నడుపుతున్నామని ప్రజలకు కల్పించిన భ్రమలు తెలంగాణలో ఎమ్మెల్యేల కొనుగోలు వ్యవహారంతో పటాపంచలు అవుతాయేమోనన్న భయం స్పష్టంగా కనిపించింది.
తాము ఇన్నాళ్లుగా చెబుతున్న జుమ్లా మాటలు పటాపంచలు అవుతాయోమోనన్న భయంతోనే కదా సిట్ దర్యాప్తును ఆపాలని అడుగుతోంది. సీబీఐ అప్పటి డైరెక్టర్ అలోక్ వర్మను తప్పించిన విధానం, రాకేష్ అస్థానకు సంబంధించిన వ్యవహారాన్ని ఈ సందర్భంగా మనం ఒక్కసారి గుర్తు చేసుకోవాలి.
విచారణ అంటే భయం ఎందుకు అని ప్రతిపక్షాలను ప్రశ్నించేవారు, విచారణ పేరు వినగానే ప్రవర్తించే తీరులోనే మర్మం అర్థం అవుతుంది.
పీవీ జీఎస్