నల్లగొండ జిల్లాలోని చండూరు పేరెత్తగానే ‘సాహితీ మేఖల’ సంస్థ గుర్తుకువస్తుంది. సాహితీ మేఖల తెలంగాణలోనే తొలి సాహితీ సంస్థగా మనుగడ సాగించింది. 1934లో ‘కవిరత్న’ అంబటిపూడి వెంకటరత్నం శాస్త్రి ఈ సంస్థను చండూరు కేంద్రంలో స్థాపించి తెలుగుజాతికి వెలుగు బాటగా నిలిచారు. పోరాటాల ఖిల్లాగా పేరొందిన నల్లగొండ జిల్లాలో సాహిత్య బీజాలు నాటి ఎందరో కవి పండితులను తీర్చిదిద్దిన ఘనత అంబటిపూడికే దక్కింది. అంబటిపూడి పుట్టింది ఆంధ్రలోనైనా ఆయన జీవితమంతా చండూరులోనే గడిచింది. ఉన్నత విద్య చదివినా ఉద్యోగాల జోలికి వెళ్లకుండా సాహిత్యం, సంఘసేవకు జీవితాన్ని ధారపోసిన ధన్యజీవి.
నా కవితాకుమారి జనన స్థలమయ్యది నా ప్రవర్తన/శ్రీకి విహారభూమి యది చిత్రము! నాదు పవిత్ర జీవితా/ శా కిరణమ్ము రాలిన శ్మశాన తలమ్మటనే శుభాశుభ/ వ్యాకృతి వెల్గు నీడల నయమ్ములనేర్పినదా పురమ్మెకా
అది పురాఋషి సాహితీ నదిత పుణ్య
పంచ భూతాత్మకం జైన ప్రాంతమేమొ
ఆ ఋషుల రక్తమే నేడు నా ఋషిత్వ
హేతువై కావ్య వీధి మ్రోయించునేమో
1942లో చండూరు గురించి అంబటిపూడిరాసుకున్న కవిత ఇది.
చండూరు అంటే అంబటిపూడికి వల్లమానిన అభిమానం. చండూరు పరిసర గ్రామాల్లో ఆయనకు వందల మంది అభిమానులు, శిష్యులున్నారు. అంబటిపూడి సాహిత్యసేవ కంటే ముందే సమాజ సేవ చేశారు. కులమతాలకతీతంగా సహపంక్తి భోజనాలను ఏర్పాటు చేశారు. దరిద్ర నారాయణ సమితిని నెలకొల్పి ప్రతి శుక్రవారం దాతల నుంచి బియ్యం, వస్ర్తా లు సేకరించి అన్నదానం, వస్త్రదానం చేసేవాడు. నాడు మద్యం నిషేధించాలని ‘కల్లొద్దురా..కల్లొద్దురా’ అంటూ గీతాలు పాడి ప్రజల్లో చైతన్యం కలిగించారు. ప్లేగు వ్యాధితో వందలాది మంది చనిపోతుంటే అంబటిపూడి స్వయంగా ముం దుండి సామూహిక దహన సంస్కారాలు చేశారు. కమ్యూనిస్టు నాయకుడు రావి నారాయణరెడ్డి సహకారంతో ఒక హరిజన పాఠశాలను స్థాపించారు.
‘నా తెలంగాణ కోటి రతనాల వీణ’ అని ఎలుగెత్తి చాటిన దాశరథి తొలి రచన అయిన ‘అగ్నిధార’ కావ్యాన్ని ప్రచురించి వ్యాప్తి చేసిన ఘనత సాహితీ మేఖలదే. చండూరు గురించి దాశరథి ఒక లేఖలో ఇలా రాశారు. ‘సాహితీ మేఖల అనగానే ఎన్నో జ్ఞాపకాలు మనసులో మెదలుతాయి. నల్లగొండ జిల్లా చండూరులో వెలసిన సంస్థ అది. పులిజాల హనుమంతరావు నేను నల్లగొండలో బస్సు దిగి ఒక వెన్నెల రాత్రి ఎడ్ల బండి మీద చండూరుకు ప్రయాణించాం. మా అమ్మ నాకు రొట్టెలు, అందులో నంజుకోడానికి ఉసిరికాయ పచ్చడి పెట్టింది. సామాను దట్టించిన భారీ బండిపై భాగం మీద కూర్చొని పున్నమి వెన్నెల్లో రొట్టెలు తింటూ ప్రయాణం సాగించాను. హనుమంతరావు తల్లిగారు నన్ను తన కుమారునిలా ఎంతో ప్రేమగా చూసుకొనేది. కవి మిత్రులం రాత్రంతా కవితా గోష్టిలో గడిపేవాళ్లం.’
‘తెలుగుదేశం’ గ్రంథకర్త దేవులపల్లి రామానుజరావు తన గ్రంథంలో ‘సాహితీ మేఖల ఆశయం కవితా రచన. కావ్య ప్రచారం. ఇందులో చాలామంది కవులు నూతన భావాలతో పాటు, ప్రబంధాల పక్వతతో కూడిన శైలిని అలవర్చుకున్నారు. ఈ వొడ్డాణంలో పొదిగిన రత్నాలు కొన్ని నిజంగా సానలు దీరి ఉన్నాయి’ అని రాశారు. చండూరులో 1946లో సాహితీ మేఖల దశమ వార్షికోత్సవాలు మూడు రోజుల పాటు జరిగాయి. ఇవి పేరుకు సాహిత్య సభలే అయి నా జాతీయసభల కన్నా మిన్నగా జరిగాయి. మూడురోజుల పాటు కవి సమ్మేళనాలు, కథా సమ్మేళనాలు, సాహిత్య గోష్టులు నిర్వహించారు. ఈ సభలకు అభినవ పోతన వానమామలై వరదాచార్యులు, దేవులపల్లి రామానుజరావు, కొప్పరపు కవులు, సత్యదుర్గేశ్వర కవులు, మాడపాటి హనుమంతరావు, సురవరం ప్రతాపరెడ్డి, సినారె, దాశరథి, కాళోజీ, బిరుదురాజు రామరాజు తదితరులు హాజరయ్యారు. అంబటిపూడి అధ్యక్షతన ప్రజాకవి కాళోజీకి ఘన సన్మానం జరిగింది. కాంచనపల్లి చిన వెంకటరామారావు ‘మా వూళ్లో కూడానా’ అన్న కథలు కూడా సభల్లోనే రాయడం విశేషం. కొన్ని వేల మంది పాల్గొన్న ఈ సాహితీ సమావేశాలు మొదటివి, చివరివిగానే నిలిచిపోయాయి.
పున్న అంజయ్య: 93966 10639