కరోనా కారణంగా యావత్ ప్రపంచం ఆర్థికమాంద్యం అల్లకల్లోల పరిస్థితుల్లో ఉన్నది. ఇలాంటి కష్ట సమయంలో కూడా విశ్వనగరం అయిన మన హైదరాబాద్ అవకాశాలకు చిరునామాగా మారింది. మల్టి నేషనల్ కంపెనీలు హైదరాబాద్లో పెట్టుబడులు పెట్టడానికి క్యూ కడుతున్నాయి. ఇందులో భాగంగానే అతిపెద్ద విమానయాన విడిభాగాల తయారీ సంస్థ అయిన ‘సఫేరా’
కరోనా కారణంగా యావత్ ప్రపంచం ఆర్థికమాంద్యం అల్లకల్లోల పరిస్థితుల్లో ఉన్నది. ఇలాంటి కష్ట సమయంలో కూడా విశ్వనగరం అయిన మన హైదరాబాద్ అవకాశాలకు చిరునామాగా మారింది. మల్టి నేషనల్ కంపెనీలు హైదరాబాద్లో పెట్టుబడులు పెట్టడానికి క్యూ కడుతున్నాయి. ఇందులో భాగంగానే అతిపెద్ద విమానయాన విడిభాగాల తయారీ సంస్థ అయిన ‘సఫేరా’ కూడా తెలంగాణలో పరిశ్రమ స్థాపించడానికి ప్రభుత్వంతో ఒప్పందం కుదుర్చుకున్నది.
దేశ ఐటీ, సేవారంగాల్లో బెంగళూరు తర్వాత స్థానం హైదరాబాద్ నగరానిదే. హైదరాబాద్ ‘గంగా జమునీ తహ్జీబ్’కు ప్రతీక. అందుకే ఇక్కడ భిన్నవర్గాల ప్రజలు, విభిన్న ఆచార, సంప్రదాయాలు కలగలిసిన వ్యక్తులుంటారు. అందుకే అంటారు ‘తెలంగాణకు మణిహారం హైదరాబాద్’ అని.
ప్రపంచవ్యాప్తంగా ఉన్న పలు కంపెనీలు హైదరాబాద్ వైపు ఆసక్తిగా చూడటానికి, ఈ మహా నగరంలో పెట్టుబడులు పెట్టేందుకు ముందుకు రావడం ఇక్కడి యువత అదృష్టంగా భావించవచ్చు. యువత నైపుణ్యాలను తీర్చిదిద్దు తున్న రాష్ట్ర ప్రభుత్వ చొరవ ఇందుకు ఒక కారణమైతే, ఇక్కడి అనుకూల వాతావరణం మరొక కారణం. రాష్ట్రంలో ఇప్పుడు ఐటీ రూపంలో సిరులు కురుస్తున్నాయి. రాష్ట్ర ప్రభుత్వం, మంత్రి కేటీఆర్ చూపుతున్న ప్రత్యేక చొరవ ఇందుకు ప్రధాన కారణం అని చెప్పక తప్పదు.
అయితే, దేశ జీడీపీలో సేవారంగం వాటా 53.89 శాతం, జీవీఏలో రూ.179.15 లక్షల కోట్లు. అలాగే పారిశ్రామికరంగం వాటా 25.9 శాతం వాటాగా ఉంటే వ్యవసాయరంగం వాటా 20.19 శాతం. తెలంగాణ సేవా రంగం వాటా 61.3 శాతం. 2014-15, 2020-2021 మధ్యకాలంలో తెలంగాణ ఐటీ రంగంలో ఉద్యోగుల సంఖ్య 3.7 లక్షల నుంచి 7.7 లక్షలకు పెరిగింది.
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం యువతకు ఉద్యోగ కల్పనే లక్ష్యంగా ముందుకు సాగుతున్నది. అందులో భాగంగానే స్టార్టప్లు, టీ హబ్, వీ-హబ్, టీఎస్ఐసీ, టీ-వర్క్ల ద్వారా ఐటీ రంగాన్ని ఒక్క హైదరాబాద్ నగరానికే కాకుండా ద్వితీయ శ్రేణి నగరాలకూ విస్తరిస్తున్నది. ప్రస్తుతం రాష్ట్ర తలసరి ఆదాయ విషయానికి వస్తే రూ.2,78,833 అయితే ప్రస్తుత దేశ తలసరి రూ.1,49, 848గా ఉన్నది. వ్యవసాయరంగం వాటా తెలంగాణ జీవీఏలో 18.8 శాతంగా ఉన్నది.
ప్రస్తుతం హైదరాబాద్ కేంద్రంగా మైక్రోసాఫ్ట్, అమెజాన్, వాల్యూల్యాబ్స్, కోనీ, ఒరాకిల్ లాంటి ప్రఖ్యాతిగాంచిన సంస్థలున్నాయి. రాష్ట్రంలో తెలంగాణ అకాడమీ ఫర్ స్కిల్ డెవలప్మెంట్ అనే సంస్థను ప్రభుత్వం ప్రారంభించింది. రాష్ట్ర యువత నైపుణ్యాలను పెంచు తూ ఉద్యోగస్థులుగా మలచడమే ఈ సంస్థ లక్ష్యం. ఇందులో నమోదైన కళాశాలలు 718 ఉండగా, 2 లక్షల 44 వేల యువత ఉద్యోగాల కోసం నమోదు చేసుకున్నారు. ప్రతి విద్యార్థికి ఉద్యోగం కల్పించడమే లక్ష్యంగా ప్రభుత్వం ఈ సంస్థను నెలకొల్పడం హర్షించదగిన విషయం. ఇప్పుడున్న పరిస్థితిలో విద్యార్థులు నైపుణ్యాలను అందించే కళాశాలను ఎంపిక చేసుకుంటే హైదరాబాద్లోనే ఉద్యోగం సాధించడం పెద్ద కష్టమేం కాదు. ఉద్యోగం సాధించి జీవితంలో స్థిరపడాలనే యువతకు మంచి తరుణం మించిన దొరకదు. అందుకే, హైదరాబాద్ అవకాశాలకు హరివిల్లుగా దేశంలోనే ప్రసిద్ధికెక్కడం అభినందనీయం.
– డాక్టర్ శ్రీశైలం మోతుకూరి
(వ్యాసకర్త: అసిస్టెంట్ ప్రొఫెసర్, విశ్వవిశ్వాని సిస్టమ్స్ ఆఫ్ మేనెజ్మెంట్, హైదరాబాద్)