యం హి న వ్యథయంత్యేతే పురుషం పురుషర్షభ
సమదుఃఖసుఖం ధీరం సోమృతత్వాయ కల్పతే॥ (భగవద్గీత 2-15)
మానవ జీవితాలలో ద్వంద్వాల ప్రాముఖ్యం ఎక్కువ. శీతోష్ణాలు, సుఖదుఃఖా లు, పుణ్యపాపాలు ఇలాంటి ద్వంద్వాలు ప్రతి మనిషినీ ఎంతో ప్రభావితం చేస్తాయి. ఇది హృదయ ధర్మం. ఇక్కడే మనిషి తన మానసిక దృఢత్వాన్ని నిరూపించుకోవాలి. రెండిటినీ సమదృష్టితో చూడగలిగే మానసిక పరిణతికి మనిషి ఎదిగితే అతను నిజమైన ధైర్యవంతుడు అనిపించుకుంటాడు. ఆ విషయాన్ని శ్రీకృష్ణుడు, అర్జునుడికి బోధిస్తూ ‘పురుష శ్రేష్ఠుడవైన ఓ అర్జునా! సుఖదుఃఖాల్లో సమబుద్ధి కలిగిన ఏ ధీరపురుషుణ్ని ఈ విషయ స్పర్శలు బాధించలేవో అటువంటి వ్యక్తే మోక్షార్హుడు’ అన్నాడు. సుఖాలు, దుఃఖాలు చలింపజేయని స్థితికి వ్యక్తులు ఎదగాలన్న ఈ భావన వెనుక మనిషి ప్రస్థానం దృఢమైన మనసును సాధించే దిశగా ఉండాలన్న సందేశం ఉంది.
సాధారణంగా మనిషి సుఖాల్లో సంతోషాన్ని, దుఃఖాల్లో బాధను పొందడం సహజమే. కానీ, మనోనిగ్రహాన్ని సాధించిన ఏ వ్యక్తి అయినా ఈ భావాల నుంచి తనను తాను నిగ్రహించుకోగలడు. అయితే అంతటి నిగ్రహాన్ని సాధించాలన్నప్పుడు అతనిలో అపారమైన మానసిక ధైర్యం, శక్తి అవసరం అవుతాయి. ఆ దిశగా సాగే వ్యక్తి సాధన సాధారణంగా ఉండదు. అది అంత సులభమైనది కూడా కాదు. దానికి ప్రతివ్యక్తి కఠోరంగా శ్రమించాలి. ఆ శ్రమ శారీరకం కాదు, మానసికమై ఉండాలి. అంటే సుఖదుఃఖాలలో కలత చెందకుండా, ఈ వ్యయాన్ని అవ్యయంగా భావించి ప్రవర్తించగలగాలి. అంటే అతనిలో ఏది బ్రహ్మమో తెలుసుకునే అవగాహన సంపూర్ణంగా ఉండాలి. ‘ఏతదమృతం ఏతదభయం ఎతద్బ్రహ్మ ఇతి’ అన్న శ్రుతి వచనాన్ని బట్టి.. ఏదైతే అమృతమో అది అభయస్థానం, అదే బ్రహ్మస్థానం అని తెలుసుకునే విజ్ఞత, మానసిక దృఢత్వం కలిగి ఉండాలి. అప్పుడే అతని వ్యక్తిత్వం ఉన్నతంగా ఎదుగుతుంది. ఈ విషయాన్నే శ్రీకృష్ణపరమాత్మ అర్జునుడికి బోధించే నెపంతో సమస్త మానవాళికి ఉపదేశించాడు.
అర్జునుడు యుద్ధరంగంలో విషాదానికి లోనుకావడం అతని కర్తవ్య నిర్వహణ కు, ధర్మాచరణకు ఆటంకం కలిగించే అంశం. దుష్టశిక్షణ చేయవలసిన వాడు భగవానుడు కాబట్టి ఆపని చేయవలసిన అర్జునుడికి ఈ విధమైన విశేషాలు బోధించాడు. దుఃఖం ధీరుడి లక్షణం కాదు. పైగా దుఃఖింపదగని వారిని గురించి అర్జునుడు బాధపడటం కర్తవ్య విముఖతకు కారణమైంది. ఆ దుఃఖస్థితి నుంచి అర్జునుడిని బయటపడేయడానికి సమబుద్ధి కలిగి ఉండమని హితవు పలికాడు శ్రీకృష్ణుడు. సాంఖ్యయోగంలోని అనేక శ్లోకాల్లో ఇదే విషయాన్ని స్పష్టం చేశాడు. దీనివల్ల సదసద్వివేకాన్ని శాస్త్రీయంగా బోధించినట్లయింది. మోక్షానికి కూడా ఇటువంటి సమదృష్టి కలిగి ఉండటమే అర్హతగా భగవద్గీత చెబుతుంది. ద్వంద్వాతీతులైన వారే సత్ఫలితాలను అందుకుంటారన్న సత్యాన్ని తెలియజేసింది.
సాధారణంగా మనిషి పొంగిపోవడం, కుంగిపోవడం ఆయా సందర్భాల్లో భావ తీవ్రతను బట్టి సంభవిస్తూ ఉంటుంది. కానీ, తనను తాను నిగ్రహించుకుంటే ఈ భావతీవ్రత అతన్ని స్థితప్రజ్ఞుడిగా నిలుపుతుందే తప్ప భావోద్వేగాలకు లోనుకానివ్వదు. అది సాధించినప్పుడే మనిషి వ్యక్తిత్వం ఉన్నతం అవుతుంది. అప్పుడే కర్తవ్య నిర్వహణకు సిద్ధమై కార్యసాధనకు అది తోడ్పడుతుంది. అర్జునుడు ఈ ఉద్వేగాలకు లోనైన కారణంగా తను చేయవలసిన యుద్ధం విషయంలో విముఖుడయ్యాడు. అర్జునుడు అందులోంచి బయటపడాలంటే ఈ జ్ఞానబోధ అవసరం. ధీరత్వం మిక్కిలి అత్యావశ్యకం. అప్పుడే ధర్మక్షేత్రమైన కురుక్షేత్రంలో పాండవుల విజయం సాధ్యమవుతుంది. అందుకే శ్రీకృష్ణుడు ధీరుని తత్తాన్ని గురించి చెప్పాడు. ఇది సర్వ మానవజాతికి వర్తించే సత్యం. సుఖదుఃఖాలకు అతీతమైన ధీరభావనే మానవుడికి, మానవజాతికి శ్రీరామ రక్ష.
– గన్నమరాజు గిరిజామనోహరబాబు
99490 13448