భారతదేశ తాత్విక ఉద్యమాల్లో భక్తికవులది ఓ అధ్యాయం. పద్నాలుగో శతాబ్దం నాటికి భారతదేశంపై విదేశీ రాజులు ఆక్రమణకు దిగారు. బలవంతపు మత మార్పిడులు జరుగుతున్న కాలమది. హిందూ సమాజంలో కులం పేరుతో అసమానతలు, అంటరానితనం తీవ్రంగా ఉన్న రోజులవి. అటువంటి సమయంలో జన్మించిన రవిదాస్ తన భక్తిగీతాలతో భక్తి ఉద్యమానికి తెరతీసి ఎందరినో ఆ మార్గంలో నడిపించారు. మన దేశానికి దిశానిర్దేశం చేశారు.
ఎవరైతే తమ భావజాలంతో ఇతరులను ప్రభావితం చేస్తారో వాళ్లే చరిత్ర మలుపులో నిలబడి రాబోయే తరానికి దిశానిర్దేశం చేస్తారు. అలాంటి వారిలో రవిదాస్ ఒకరు. అందుకే రవిదాస్ భక్తులు ఆయన బంగారు విగ్రహాన్ని జలంధర్ నుంచి కాశీ వరకు మోసుకొచ్చారు. అంబేద్కర్ కూడా స్ఫూర్తిగా తీసుకున్న మహనీయుడాయన.
సంత్ రవిదాస్ భక్తికవుల్లో ఆధ్యాత్మిక భావాన్నే కాకుండా సామాజిక భావాలనూ కలిగించారు. బానిస భావాలను ఆయన వ్యతిరేకించారు. మానసిక, కుల, శారీరక బానిసత్వాన్ని వ్యతిరేకించారాయన. మనిషి స్వతంత్రుడిగా జీవించాలనేది ఆయన భావన. ప్రతి మనిషిలోనూ చైతన్యాన్ని రగిలించేందుకు కృషి చేశారు సంత్ రవిదాస్. మానవతాపూర్ణంగా మనిషి ఉండాలని తన కవిత్వంతో, తన పాటలతో ఆయన ప్రపంచానికి చాటారు. జీవితాంతం సమాజాన్ని మేల్కొలిపే బాటలోనే పయనించారు.
సంత్ రవిదాస్ క్రీ.శ. 1377లో కాశీ వద్ద ఉన్న సీర్ గోవర్ధనపురంలో మాఘపూర్ణిమ రోజున జన్మించారు. ఆయన తల్లిదండ్రులు కలసాదేవి, సంతోఖ్దాస్ అణగారిన చర్మకార వర్గానికి చెందినవారు. కబీర్కు సమకాలికుడైన రవిదాస్ ఆధ్యాత్మిక సన్యాసిగానే అంటరానివారి అభ్యున్నతి కోసం ఉద్యమాన్ని నడిపారు. వారి సాంఘిక విముక్తి కోసం కృషి చేశారు. సామాన్యులే కాదు, శ్రీకృష్ణుని ఆరాధించే అంతఃపురవాసి మీరాబాయి లాంటి వారెందరో రవిదాస్ వెంటనడిచారు. ఆయన పదాల ప్రవాహం బనారస్ దాటి ఉత్తరప్రదేశ్, పంజాబ్, గుజరాత్ వరకు చేరాయి. భక్తకవిగా, ప్రవక్తగా ఆయన చేసిన పోరాటం నేటి సమాజానికి స్ఫూర్తిదాయకం.
రవిదాస్కు కాశీ మహారాజు, మహారాణి కూడా శిష్యులే. జీవితాంతం చర్మకార వృత్తిని అవలంబిస్తూనే అత్యంత నిరాడంబరంగా బతికారు రవిదాస్. చిత్తోడ్ రాజు రాణా సంగా అభ్యర్థన మేరకు అక్కడికి వెళ్లిన ఆయన తన 120వ ఏట భగవంతునిలో లీనమయ్యారని చెప్తారు.
సమానో మంత్ర.. అనే వేదసారమంతా రవిదాస్ పదాలలో ఉంది. ‘కులం గురించి ఎవరు, ఎవర్నీ అడగకూడదు. బ్రాహ్మణుడు, క్షత్రియుడు, వైశ్యుడు, శూద్రుడు.. అందరూ మనిషి కులానికి చెందినవారే.
మానవత్వమే పరమ ధర్మం’ అని ఆయన బోధించారు. సంత్ చెప్పే ప్రతీమాట.. అనుభవం, అధ్యయనం, అవగాహన, మానవతావాదం నుంచి పుట్టుకొచ్చినవే.
జాతి వైతాళికులైన అంబేద్కర్ లాంటి వారిపై రవిదాస్ ప్రభావం చాలా ఉంది. రవిదాస్ ఒక వ్యక్తి కాదు, ఒక ఉద్యమం. సామాజిక సమరసత కోసం పోరాడే ప్రతి ఒక్కరికీ ఆయన ఒక ఉత్తేజం. పదవుల లాలసతో విభజన, విద్వేష రాజకీయాలు గ్రామీణ ప్రజా జీవితాల్ని విచ్ఛిన్నం చేస్తున్న ప్రస్తుత తరుణంలో సంత్ రవిదాస్ బోధనలను విస్తృతంగా ప్రచారం చేయాల్సిన అవసరం ఉన్నది. ఆయన కీర్తి, స్ఫూర్తిని ఉత్తర భారతదేశంతో పాటు దక్షిణ భారత్లో కూడా యావత్ దళిత జాతి కొనసాగిస్తున్నది. రవిదాస్ జయంతిని రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా నిర్వహించాలి. ఎందరికో స్ఫూర్తిదాయకంగా నిలిచే ఆయనకు నివాళి అర్పించడమంటే యావత్ భారత జాతిని గౌరవించుకోవడమే.
-బైరి వెంకటేశం మోచి
94919 94090