రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ ఏది చేసినా చరిత్రే అవుతుంది. అది రాష్ట్రసాధన మొదలు.. అనేక సందర్భాల్లో నిరూపితమైంది. రాష్ట్ర సాధనోద్యమంలో ఆకాంక్షల నినాదాలుగా మొదలైన నీళ్లు, నిధులు, నియామకాలను నిజాలు చేసి చూపిస్తున్నారు ముఖ్యమంత్రి కేసీఆర్. తాజాగా 90 వేలకు పైగా ఉద్యోగ నియామక ప్రకటన చారిత్రాత్మకమైనదే గాక, భవిష్యత్ తెలంగాణ బంగారు కాంతులను చూపుతున్నది.
లంగాణ ప్రజల ప్రధాన సమస్య అయిన నీళ్ల విషయంలో ప్రపంచ ప్రఖ్యాతి గాంచిన కాళేశ్వరం లాంటి భారీ ఎత్తిపోతల పథకాన్ని చేపట్టిన రాష్ట్ర ప్రభుత్వం మూడేండ్లలోనే పూర్తిచేసి రికార్డు సృష్టించింది. ఇక నిధుల విషయానికి వస్తే.. గత ఏడేండ్లలో జరిగిన పురోగతి ఆర్థిక నిపుణులనే అబ్బురపరిచింది. ముఖ్యంగా మొన్న అసెంబ్లీలో ప్రవేశపెట్టిన బడ్జెట్ వివరాల ప్రకారం.. ఉమ్మడి రాష్ట్రంలో లక్ష కోట్లకే పరిమితమైన బడ్జెట్, నేడు 2,56,958 కోట్లకు చేరింది. ఇది అసాధారణమైన రికార్డు. ఇప్పుడు అదే వరుసలో నియామకాలకు సంబంధించి ముఖ్యమంత్రి ప్రకటన ఉన్నది. పెద్ద ఎత్తున నియామకాలకు శ్రీకారం చుట్టారు. కేసీఆర్ అసెంబ్లీలో చేసిన ప్రకటన నిరుద్యోగుల కలల సాఫల్యానికి ఒక ప్రణాళికగా ఉన్నది. ముఖ్యమంత్రి చేసిన ప్రకటనలో నాలుగు అంశాలను
ప్రధానంగా ప్రస్తావించటం గమనార్హం.
ముఖ్యమంత్రి ప్రసంగ పాఠాన్ని అర్థం చేసుకున్నవారికి ఆత్మవిశ్వాసం కలిగించేదిగా ఉన్నది. ఈ ఏడేండ్లలో తెలంగాణ రాష్ట్ర పునర్వ్యవస్థీకరణ వివిధ దశల్లో ఎలా జరిగిందో ముఖ్యమంత్రి రేఖామాత్రంగా వివరించారు. రాష్ట్ర విభజనలో భాగంగా మొదలైన ఉద్యోగుల విభజన.. ఆంధ్ర, తెలంగాణ రాష్ర్టాల మధ్య అనేక చిక్కుముడులను వేసింది. వాటిని ఒక్కొక్కటిగా విప్పుకొంటూ..
రావడానికి ఇంతకాలం పట్టింది. అయినా ఏపీ కొర్రీల వల్ల 9, 10 షెడ్యూల్ సంస్థల విభజన పూర్తికాలేదు. ఇంకా అనేక అంశాలు కోర్టుల పరిధిలో, అలాగే కేంద్ర ప్రభుత్వ జోక్యంతో ఎటూ తేలకుండా ఉన్నాయి. ఇంకా కొంతమంది తెలంగాణ ఉద్యోగులు ఆంధ్రా ప్రాంతంలోనే ఉండిపోయారు. ఆంధ్రా ఉద్యోగులు కొందరు తెలంగాణలో తిష్ట వేశారు. ఇలా కొనసాగుతుండగానే
ముఖ్యమంత్రి రాష్ట్ర పునర్వ్యవస్థీకరణకు పూనుకున్నారు. ఆయన మొదటి శాసససభ సమావేశంలోనే రాష్ట్ర పునర్నిర్మాణంలో భాగంగా తెలంగాణ తనను తాను పునర్ వ్యవస్థీకరించుకోవాల్సిన అవసరం ఉందన్నారు. కొత్త అవసరాలకు అనుగుణంగా, కొత్త ఆలోచనలు, కొంత అంకురాలు, కొత్త పథకాలు, వాటి అమలుకు కొత్త శాఖలు రూపొందించారు. అంతేకాకుండా పది
జిల్లాలుగా ఉన్న తెలంగాణను 33 జిల్లాలుగా విభజించి పరిపాలనను ప్రజలకు మరింత చేరువ చేశారు. కొత్త జిల్లాలకు అనుగుణంగా ఉన్న సిబ్బందిని సర్దుబాటు చేసి, ఖాళీలను నిర్ధారించుకోగలిగారు. ఇది మొదటి దశ పునర్వ్యవస్థీకరణ.
ఇక పునర్నిర్మాణంలో భాగంగా రాష్ట్ర స్థితిగతులు ఆకళింపు చేసుకొని భవిష్యత్ అవసరాలకు అనుగుణంగా ప్రాధాన్యాలను నిర్ణయించుకున్నారు. కేసీఆర్కు తెలంగాణ అవసరాలు, తెలంగాణ వనరులు, తెలంగాణ అభివృద్ధి విస్తృతికి సంబంధించిన అంశాల పట్ల స్పష్టత ఉన్నది. తదనుగుణంగా ప్రాధాన్యతా క్రమంలో 2014 నుంచే ఉద్యోగాల భర్తీకి శ్రీకారం చుట్టారు. తెలంగాణ
ప్రభుత్వం ఈ పునర్నిర్మాణ క్రమంలో నీళ్లను ప్రధానాంశంగా భావించింది. అటు సాగునీటికి, ఇటు తాగునీటికి రెండు అద్భుతమైన పథకాలను ‘మిషన్ కాకతీయ’, ‘మిషన్ భగీరథ’ రూపంలో తీసుకొచ్చింది. అంతేకాకుండా నీళ్ల వినియోగంలో భాగంగా కాళేశ్వరం, కల్వకుర్తి లాంటి ప్రాజెక్టులను పూర్తిచేసి ఉత్తర, దక్షిణ తెలంగాణలను గోదావరి, కృష్ణా జలాలతో కోటి ఎకరాల
మాగాణంగా మార్చారు. ఈ ప్రయత్నం అనేక ఇతర రంగాలను ప్రభావితం చేసింది. ముఖ్యంగా వ్యవసాయరంగం విస్తరించింది. పల్లెల్లో పరిపాలనావ్యవస్థ మెరుగుపడింది. అదేవిధంగా విద్యుత్ రంగంలో అనుసరించిన విధానాల వల్ల వ్యవసాయానికి, పరిశ్రమలకు నిరంతర, నాణ్యమైన విద్యుత్ను సరఫరా చేయగలుగుతున్నది. ఇట్లా నీళ్లు, పల్లెప్రగతి, వ్యవసాయం, విద్యుత్, విద్య, వైద్యం
వంటి మౌలిక వనరులను పటిష్ఠం చేసుకుంటూ.. ముందుకువెళ్లడం మూలంగా తెలంగాణ బలమైన పునర్నిర్మాణ పునాదులు వేసుకున్నది. ఈ క్రమంలో ఖాళీగా ఉన్న మొత్తం 1,56,254 పోస్టులు గుర్తించి ఇప్పటివరకు 1,33,942 పోస్టులు భర్తీ చేసినట్టు సీఎం అసెంబ్లీలో ప్రకటించారు. అంటే ఇప్పటివరకు ఒక శాస్త్రీయమైన పద్ధతిలో తెలంగాణ పునర్నిర్మాణ ప్రణాళికకు
ముఖ్యమంత్రి ఒక వాస్తుశిల్పిగా నిలిచారు. ఇప్పుడు తాజాగా భవిష్యత్ అవసరాల కోసం 91,142 ఉద్యోగాల భర్తీ ప్రకటన చేసి సంచలనం సృష్టించారు. ఇది సంచలనమే. ఎందుకంటే ఇప్పటివరకు దేశంలో ఏ రాష్ట్రం కూడా ఒకేసారి ఇంత పెద్ద సంఖ్యలో ఉద్యోగాలు ప్రకటించలేదు. అందుకు ఇవాళ యావత్ తెలంగాణ సమాజం కేసీఆర్ నిర్ణయాన్ని నిండు మనసుతో స్వాగతిస్తున్నది.
భారీ ఉద్యోగాలతో పాటు, ఉద్యోగ నియామక ప్రక్రియలో పెనుమార్పులకు శ్రీకారం చుట్టి.. ‘మన ఉద్యోగాలు మనకే’ అన్న నినాదాన్ని నిజం చేశారు. తెలంగాణ ఏర్పడిన మరుసటి రోజు నుంచే రెండు దఫాలుగా రాజ్యాంగంలోని ఆర్టికల్ 371-డీని సవరింపజేసి 95 శాతం ఉద్యోగాలు తెలంగాణ బిడ్డలకే చెందేవిధంగా కృషిచేశారు. ఇది దేశంలోనే అరుదైన అవకాశం. ఏ రాష్ట్రంలో కూడా జిల్లా, జోనల్ స్థాయిలో, లేదా రాష్ట్రస్థాయిలో ఎక్కడివారికి అక్కడే ఉద్యోగాలు దొరికే అవకాశాల్లేవు. ఇప్పుడు ఈ కొత్త నిబంధన ద్వారా భూమిపుత్రులకు తమను తాము పరిపాలించుకునే అవకాశం లభించబోతున్నది. మరోవైపు అటు నిరుద్యోగులు, ఇటు రాజకీయ నిరుద్యోగులు పదేపదే ప్రస్తావిస్తున్న ‘జాబ్ క్యాలెండర్’ను రూపొందించనున్నట్టు సభలో ప్రకటించటం హర్షణీయం. ఇది నిరుద్యోగులకు, యువకులకు అత్యంత భరోసా కలిగించే విషయం. ఏ పనికైనా ఒక నిర్ణయం ప్రకటించినప్పుడు లబ్ధిదారులకు ఆ నిర్ణయం అమలయ్యే ముందే ఒక భరోసా కలగాలి. శాసనసభ ప్రకటనతో రాష్ట్ర నిరుద్యోగులకు అటువంటి విశ్వాసాన్ని కేసీఆర్ కలిగించారు.
కేసీఆర్ చేసిన ప్రకటనలో అత్యంత ప్రధానమైన, ప్రభావవంతమైన అంశం భారీసంఖ్యలో వివిధ స్థాయిల సివిల్ సర్వీసులకు సంబంధించిన నియామక ప్రకటన. అంటే రాష్ట్ర ప్రభుత్వ సాధారణ పరిపాలనావ్యవస్థను నడిపించడానికి అవసరమయ్యే అధికారవర్గ నియామకం. వీటిని వివిధ గ్రూపుల్లో విభజిస్తారు. అందులో ఆర్డీవో వంటి గ్రూప్-1 ఉన్నతాధికారి నుంచి కిందిస్థాయి గుమస్తా
వరకు ఉం టారు. చరిత్రలో ఎన్నడూ కనీవినీ ఎరగని రీతిలో ఈ ఉద్యోగాలు ఉమ్మడి రాష్ట్రంలో ఉన్నప్పుడు గాని, ఇంకా ఏ రాష్ట్రంలో గాని ఈ స్థాయిలో లేవు. అందులో ముఖ్యంగా గ్రూప్-1లోనే 500 పైచిలుకు ఉద్యోగాలు ప్రకటించడం
అసాధారణం. అదేవిధంగా సాధారణ, మధ్యతరగతి కుటుంబాల నుంచి వచ్చిన నిరుద్యోగ యువతకు గ్రూప్-2, 3, 4లలో ఒకేసారి 11 వేల పైచిలుకు ఉద్యోగాలు లభించడమనేది అనూహ్యం. ఒకరకంగా నిరుద్యోగుల దీర్ఘకాల నిరీక్షణకు ఇది అందివచ్చిన వరం లాంటిది.
ఇట్లా జిల్లాల్లో- 39,829, జోన్లలో- 18,866, మల్టీజోనల్ పోస్టులు-13,170, సచివాలయం, హెచ్ఓడీలు, విశ్వ విద్యాలయాల్లో- 8,147 పోస్టులను భర్తీ చేయనున్నారు. కొత్త జిల్లాల ఏర్పాటు తర్వాత గ్రూప్-1 క్యాడర్ మొదలు.. గ్రూప్-4 పోస్టుల విభజన, కొత్త జిల్లాలకు అనుగుణంగా ఉద్యోగుల బదిలీలు, పోస్టింగుల వల్ల ఉద్యోగాల భర్తీ ప్రకటన ఆలస్యమైందన్నది వాస్తవం. దీన్ని కొందరు ‘జాప్యం’ అంటున్నారు! కానీ శాస్త్రీయ పద్ధతిలో ఈ ప్రక్రియను పూర్తిచేయడానికి ఒక్కో దశలో కొన్ని అవాంతరాలు ఎదురయ్యాయి. ఇప్పుడు.. ఒక్కొక్క దశలో ఒక్కో ఫలాన్ని అందిస్తున్నది. ఇదంతా ఒక నిర్దిష్టమైన, స్పష్టమైన పునర్నిర్మాణ అజెండా వల్లనే సాధ్యమైనది.
వ్యవసాయ రంగంలో తీసుకున్న చర్యల వల్ల ప్రతి మండలానికి ఒక ‘ఏఈవో’ను రాష్ట్ర ప్రభుత్వం నియమించింది. విద్యుత్రంగంలో తీసుకున్న చర్యల వల్ల అక్కడ కూడా వేల సంఖ్యలో నియామకాలు జరిగాయి. ఇదంతా కొత్త జిల్లాల ఏర్పాటు వల్లనే సాధ్యమైంది. ప్రస్తుతం జిల్లాల్లో చేపట్టనున్న ఉద్యోగాల్లో అనేక ఖాళీలు కొత్తగా ఏర్పర్చుకున్న విభాగాల్లో ఉన్నాయి. ఇప్పుడు రాష్ట్రంలో అధికార యంత్రాంగం చేయాల్సిందల్లా ముఖ్యమంత్రి ఆవిష్కరించిన ‘విజన్’ మేరకు ప్రకటన లు, కార్యాచరణ సిద్ధం చేసి నియామకాలు పూర్తి చేయ డమే. ఆ దిశగా ఇప్పటినుంచే కసరత్తు మొదలైనట్టు తెలుస్తున్నది. రాష్ట్రంలో ఈ నియామకాలు పూర్తిచేయడానికి అవసరమైన సామర్థ్యం కలిగిన నియామక సంస్థలున్నాయి. తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ గడిచిన ఏడేండ్లలో పారదర్శకతే ప్రాతిపదికగా దాదాపు 40 వేల ఉద్యోగాలను భర్తీచేసింది. అదేవిధంగా ఎంతో ప్రతిష్టాత్మకంగా పనిచేసిన పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డు, అలాగే జిల్లా స్థాయిలో జరగబోయే డిస్ట్రిక్ట్ సెలక్షన్ కమిటీలు కలెక్టర్ల ఆధ్వరంలో ఏర్పడే అవకాశం ఉన్నది.
టీచర్లు, డాక్టర్లు, ఇంజినీర్లకు తోడు సాధారణ పరిపాలనా వ్యవహారాలకు సంబంధించిన జనరల్ పోస్టులు కూడా వేల సంఖ్యలో వెలువడబోతున్నాయి. ఇప్పుడు తెలంగాణ యువత ఈ అవకాశాన్ని అందిపుచ్చుకొని విజయపథంలో నిలవడమే లక్ష్యం కావాలి. రేపటి రాష్ట్ర పునర్నిర్మాణానికి సారథ్యం వహించే అవకాశాన్ని అందిపుచ్చుకోవాలి. బంగా రు తెలంగాణ నిర్మాణంలో
భాగస్వాములవ్వాలి.
ఇప్పుడు రాష్ట్రంలో అధికార యంత్రాంగం చేయాల్సిందల్లా ముఖ్యమంత్రి ఆవిష్కరించిన ‘విజన్’ మేరకు ప్రకటనలు, కార్యాచరణ సిద్ధం చేయాలి. నియామకాలు పూర్తి చేయాలి. ఆ దిశగా ఇప్పటినుంచే కసరత్తు మొదలైనట్టు తెలుస్తున్నది. రాష్ట్రంలో ఈ నియామకాలు
పూర్తిచేయడానికి అవసరమైన సామర్థ్యం కలిగిన నియామక సంస్థలున్నాయి.
నీళ్లు, పల్లెప్రగతి, వ్యవసాయం, విద్యుత్, విద్య, వైద్యం వంటి మౌలిక వనరులను పటిష్ఠం చేసుకుంటూ.. ముందుకువెళ్లడం
మూలంగా తెలంగాణ బలమైన పునర్నిర్మాణ పునాదులు వేసుకున్నది. ఈ క్రమంలో ఖాళీగా ఉన్న మొత్తం 1,56,254 పోస్టులు
గుర్తించి ఇప్పటివరకు 1,33,942 పోస్టులు భర్తీ చేసినట్టు సీఎం అసెంబ్లీలో ప్రకటించారు. అంటే ఇప్పటివరకు ఒక శాస్త్రీయమైన పద్ధతిలో తెలంగాణ పునర్నిర్మాణ ప్రణాళికకు ముఖ్యమంత్రి ఒక వాస్తుశిల్పిగా నిలిచారు.
(వ్యాసకర్త: టీఎస్పీఎస్సీ మాజీ చైర్మన్)