హైదరాబాద్ మహా నగరంలో అతిపెద్ద
ఆధ్యాత్మిక, సాంస్కృతిక ఉత్సవం గణేశ్
నిమజ్జన కార్యక్రమం. ఈసారి ఎట్టి పరిస్థితుల్లో హుస్సేన్ సాగర్లో ‘ప్లాస్టర్ ఆఫ్ పారిస్’తో తయారుచేసిన విగ్రహాల నిమజ్జనానికి అనుమతించేది లేదని హైకోర్టు స్పష్టమైన ఆదేశాలు జారీచేయడంతో అటు ప్రభుత్వ యంత్రాంగం, ఇటు భాగ్యనగర్ గణేశ్ ఉత్సవ సమితి ఆందోళనకు గురయ్యాయి.
దాదాపు మూడు లక్షలకుపైగా వినాయక విగ్రహాల నిమజ్జనానికి అతి తక్కువ సమయంలో ప్రత్యామ్నాయ ఏర్పాట్లను చేయలేని పరిస్థితిలో జీహెచ్ఎంసీ, హెచ్ఎండీఏ, పోలీస్ తదితర ప్రభుత్వ శాఖలు ఆందోళనకు గురయ్యాయి. రాష్ట్రప్రభుత్వం సుప్రీంకోర్టును ఆశ్రయించడంతో ఈ ఒక్కసారికి మాత్రం హుస్సేన్సాగర్లో నిమజ్జనానికి అనుమతించింది. వచ్చే ఏడాది మాత్రం ఎట్టి పరిస్థితుల్లోనూ అనుమతించేది లేదని ఉత్తర్వులు జారీచేసింది. దీంతో ఇప్పటి నుంచే వచ్చే ఏడాదికి ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేసుకోవాల్సిన పరిస్థితులు ఏర్పడ్డాయి.
‘ప్లాస్టర్ ఆఫ్ పారిస్’తో తయారుచేసిన విగ్రహాల వల్ల జల కాలుష్యం ఏర్పడుతున్నదని పర్యావరణవేత్తలు ఏనాటి నుంచో తీవ్ర ఆందోళన చేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే జీహెచ్ఎంసీ తన పరిధిలో దాదాపు 30 గణేశ్ నిమజ్జన కొలనులు నిర్మించింది. నిమజ్జన కొలనులను బెంగళూరు తర్వాత ఒక్క హైదరాబాద్లోనే ఇలా నిర్మించారు. నాలుగేండ్లుగా స్థానిక చెరువుల్లో కాకుండా, ఈ కొలనులలో స్థానికంగా చిన్న విగ్రహాలను నిమజ్జనం చేయడం గణనీయంగా కాలు ష్య నివారణకు తోడ్పడుతున్నది. వచ్చే ఏడాదిలోగా నగరంలోని ప్రతి మున్సిపల్ సర్కిల్లోని చెరువులు, కుంటల వద్ద ఇదే విధమైన నిమజ్జన కొలనులను పెద్ద ఎత్తున నిర్మించాల్సి ఉంది. ఇప్పటినుంచే ‘ప్లాస్టర్ ఆఫ్ పారిస్’తో విగ్రహాలను తయారు చేయకుండా నియంత్రించాలి.
దీనికి గణేశ్ ఉత్సవ సమితి కూడా పూర్తి స్థాయిలో సహకరించాలి. నగరంలోని పలు కాలనీలు, అపార్ట్మెంట్లలో ఇప్పటికే మట్టి గణపతులను ప్రతిష్ఠించటం ప్రారంభమైంది. ఇండ్లల్లో కూడా ఈ సంస్కృతి మొదలైంది. కాగా రాష్ట్రంలోనే అతి పెద్దదైన ఖైరతాబాద్ వినాయకుడి విగ్రహాన్ని కూడా (తగిన ఏర్పాట్లు చేస్తే) ప్రతిష్ఠాపన ప్రదేశంలోనే నిమజ్జనం చేస్తామని ఖైరతాబాద్ గణేశ్ ఉత్సవ కమిటీ ప్రకటించడం శుభ పరిణామం. హుస్సేన్ సాగర్ను పూర్తిగా శుద్ధిచేసి తిరిగి పూర్వవైభవం తేవాలని రాష్ట్ర ప్రభుత్వం గతంలోనే ప్రకటించింది. దీనికి అనుగుణంగా హెచ్ఎండీఏ ఆధ్వర్యంలో కాలుష్య నివారణ చర్యలను చేపడుతున్నది. కలుషిత జలాలు హుస్సేన్సాగర్లో కలవకుండా బాల్కాపూర్, కూకట్పల్లి నాలాలను జీహెచ్ఎంసీ దారి మళ్లించింది. ఒకప్పుడు హుస్సేన్సాగర్ దగ్గరికి పోతే విపరీతమైన దుర్వాసన వచ్చేది. దీనిని అరికట్టడానికి హెచ్ఎండీఏ చేపట్టిన చర్యలు ఇప్పటికే సత్ఫాలితాలనిస్తున్నాయి. ప్రస్తుతం ట్యాంక్బండ్ నెక్లెస్రోడ్ పరిసర ప్రాంతాల్లో ప్రపంచస్థాయి టూరిజం కేంద్రాలు వస్తున్నాయి.
గణేశ్ ఉత్సవాలను మతపరంగా కాకుండా హైదరాబాద్ నగర సామాజిక, సాంస్కృతిక ఉత్సవంగానూ, పర్యావరణ హితంగానూ జరుపుకోవడానికి అన్నివర్గాలు ముఖ్యంగా భాగ్యనగర్ ఉత్సవ సమితి, స్వచ్ఛంద సంస్థలు, ఆధ్యాత్మిక సంస్థలు, మతపెద్దలు ముందుకు రావాలి. సుప్రీంకోర్టు తీర్పుకనుగుణంగా ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయడానికి ప్రభుత్వానికి సహకరించాలి. దీనివల్ల హైదరాబాద్ నగరం యావ త్ దేశానికే మార్గదర్శకంగా మారుతుంది.
కన్నెకంటి వెంకటరమణ
(వ్యాసకర్త: జాయింట్ డైరెక్టర్, సమాచార శాఖ)