దేశానికి స్వాతంత్య్రం వచ్చి 75 ఏండ్లు గడిచిపోయాయి. అయినా దేశానికి అన్నం పెట్టే రైతన్న మాత్రం ఆ ఫలాలు ఇంకా అనుభవించలేకపోతున్నాడు. పలురకాల ఉత్పత్తులకు పెట్టుబడిదారులు, కార్పొరేట్ యాజమానులే ధరలు నిర్ణయిస్తుండగా తాను పండించిన పంటకు మాత్రం రైతు ధర నిర్ణయించలేకపోతున్నాడు. ఆరుగాలం కష్టపడి పండించిన పంట ఎప్పుడు అమ్ముడుపోతుందా అని ఎదురుచూసే పరిస్థితుల్లోనే ఇంకా కొట్టుమిట్టాడుతున్నాడు. తెలంగాణ ప్రభుత్వం, ముఖ్యమంత్రి కేసీఆర్ రైతు పక్షపాతి కాబట్టి రైతు రాజు కావాలి, రైతులకు మంచి రోజులు రావాలనే తపన పడుతున్నారు. అందుకోసమే రైతు కేంద్రంగా పలు సంక్షేమ పథకాలను అమలుచేస్తున్నారు. ప్రత్యామ్నాయ పంటల వైపు రైతులు మళ్లాలని, అప్పుడే తాను పండించిన పంట తాను నిర్ణయించిన ధరకే అమ్ముడుపోతుందని సూచిస్తున్నారు. ఆ దిశగా రైతులు నడుచుకోవాలి.
రాష్ట్ర ఆవిర్భావం తర్వాత తెలంగాణ వ్యవసాయరంగంలో అనూహ్య మార్పులు చోటుచేసుకున్నాయి. ముఖ్యంగా వ్యవసాయానికి సాగునీరు అందుబాటులోకి వచ్చింది. సీఎం కేసీఆర్ కృషి ఫలితంగా 2014 నాటికి కోటి 34 లక్షల ఎకరాలున్న వ్యవసాయ సాగు విస్తీర్ణం 2021 నాటికి 2 కోట్ల 15 లక్షల ఎకరాలకు పెరిగింది. 2014లో 45 లక్షల టన్నులు మాత్రమే ఉన్న వరిధాన్యం ఉత్పత్తి 2021 నాటికి దాదాపు 3 కోట్ల టన్నులకు చేరింది. ఉమ్మడి రాష్ట్రంలో ఆకలితో అల్లాడిన తెలంగాణ ఈ ఏడేండ్లలో దేశానికే అన్నపూర్ణగా మారింది.
రాష్ట్ర ప్రభుత్వం వ్యవసాయరంగంలో రైతుల ప్రస్తుత పరిస్థితి, పంటల సాగు, దిగుబడులు, స్థానిక, జాతీయ, అంతర్జాతీయ ఆహార అవసరాల కోసం ప్రత్యేకంగా ఏర్పాటుచేసిన ‘మార్కెట్ రీసెర్చ్ అనాలసిస్ వింగ్’ ద్వారా గుర్తిస్తున్నది. ఈ నేపథ్యంలోనే సంప్రదాయ సాగులో పడి నష్టపోతున్న రైతాంగాన్ని మార్కెట్లో డిమాండ్ ఉన్న పంటల సాగు వైపు ప్రోత్సహిస్తున్నది. భూసార పరిస్థితులు, నేల రకాలు, వ్యవసాయానికి అవసరమైన పలురకాల వనరులు, వాతావరణ పరిస్థితులు, రైతుల ఆర్థిక స్థితిగతులు, చిన్న కమతాల్లో సాగు వంటి సమస్యలను ప్రభుత్వం అధ్యయనం చేసింది. ప్రస్తుతం ఉన్న సాంకేతికతను వ్యవసాయానికి జోడించడం, రైతుల సాగు పెట్టుబడులు తగ్గించడం, పంటల ఉత్పాదకతను పెంచడం తద్వారా రైతుకు ఆదాయం పెంచడం లాంటి లక్ష్యాలను ప్రభుత్వం నిర్దేశించుకున్నది. ఇందులో భాగంగానే నేల ఆరోగ్యం కాపాడటం, పర్యావరణ కాలుష్యాన్ని నివారించాలన్న దీర్ఘకాలిక లక్ష్యంతో ముందుకుసాగాల్సిన అవసరాన్ని గుర్తించింది.
ఒకే పంటను సంప్రదాయబద్ధంగా పండించడం ద్వారా పంజాబ్, ఆంధ్రప్రదేశ్లలో భూసారం, పర్యావరణ సమతుల్యత దెబ్బతిన్నది. పెట్టుబడి ఖర్చులు పెరిగిపోయి ఆదాయం తగ్గింది. సమస్యాత్మక భూముల శాతం పెరిగి ఏ పంటా పండని పరిస్థితులు ఏర్పడ్డాయి. ఆ పంటలను ఉపయోగించిన ప్రజల ఆరోగ్యం కూడా దెబ్బతినడం మనం గమనిస్తున్నాం. అత్యధిక శాతం ప్రజలు క్యాన్సర్, మధుమేహం, బీపీ, గుండె సంబంధిత వ్యాధుల బారిన పడుతున్నారు. తెలంగాణ రైతాంగం ఈ పరిణామాలను గమనించాలి. ఇక్కడి నేలలు, వాతావరణం, ప్రభుత్వం కల్పిస్తున్న వసతులు, ప్రోత్సాహం నేపథ్యంలో పలురకాల పంటలను సాగుచేసే అవకాశం ఉన్నది. దీన్ని ఉపయోగించుకొని సంప్రదాయబద్ధంగా సాగు చేస్తూ నష్టపోవడం కంటే లాభాలనందించే పలురకాల ప్రత్నామ్నాయ పంటల సాగు వైపు మళ్లాల్సిన అవసరం ఎంతైనా ఉన్నది.
రాష్ట్ర రైతాంగం ప్రభుత్వ కనీస మద్దతు ధరను ఆశించి వరి, పత్తి పంటలు మాత్రమే అత్యధికంగా సాగు చేస్తున్నది. అవసరమైన మేరకే వరిని సాగు చేస్తూ, మార్కెట్లో డిమాండ్ ఉన్న ఇతర ప్రత్యామ్నాయ పంటలను సాగు చేస్తే రైతుల వద్దకే మార్కెట్ వచ్చే పరిస్థితి ఉన్నది. గత ఏడేండ్లలో రాష్ట్రంలో పెరిగిన వరి సాగు మూలంగా పెద్ద ఎత్తున ఉత్పత్తి అయిన వరి ధాన్యం కొనలేమని కేంద్రం చేతులు ఎత్తేసే పరిస్థితి ఏర్పడింది. ఈ నేఫథ్యంలో రైతులు ప్రత్యామ్నాయ పంటలను సాగు చేయడానికి సిద్ధం కావాల్సిన అవసరం ఉన్నది. దీంతో పాటు పప్పు, నూనె గింజలకు మార్కెట్లో డిమాండ్ ఉన్నది. ప్రపంచవ్యాప్తంగా పోషక భద్రత ఉన్న ఆహారం వైపు ప్రజలు దృష్టి సారిస్తున్నారు. జాతీయంగా, అంతర్జాతీయంగా ఉన్న డిమాండ్కు తగ్గట్లు పప్పు, నూనె గింజల ఉత్పత్తుల్లేవు. తెలంగాణలో పత్తి తర్వాత కంది సాగుకు ఎక్కువ అవకాశాలున్న నేపథ్యంలో దాన్ని పెద్ద ఎత్తున సాగు చేయాలని రైతాంగాన్ని ప్రభుత్వం కోరుతున్నది. ప్రభుత్వ వినతిని గమనంలోకి తీసుకున్న రైతులు గతంలో 3.5 లక్షల ఎకరాలున్న కంది సాగును 11 లక్షల ఎకరాలకు పెంచారు. దీంతో పాటు రాష్ట్రంలో పెసలు, మినుములు, శనగలు, ఇతర అపరాల సాగుకు అవకాశం ఉన్నది. ఆ పంటలు సాగు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం రైతులను ప్రోత్సహిస్తున్నది.
మన దేశం ఏటా సుమారు రూ.80 వేల కోట్ల విలువైన వంట నూనెలను దిగుమతి చేసుకుంటున్నది. దీన్ని గమనించిన రాష్ట్ర ప్రభుత్వం నాలుగైదేండ్లలో 20 లక్షల ఎకరాల్లో ఆయిల్పామ్ సాగు లక్ష్యంగా సాగుతున్నది. దీంతో పాటు నువ్వులు, వేరుశనగ, ఆవాలు, పొద్దుతిరుగుడు సాగును ప్రోత్సహించడమే కాకుండా రాబోయేకాలంలో దానికి అవసరమైన ఆహారశుద్ధి పరిశ్రమలను జిల్లాలవారీగా ఏర్పాటుకు శ్రీకారం చుట్టింది. వీటితో పాటు పెరుగుతున్న పట్టణీకరణ, మారుతున్న ప్రజల ఆహారపుటలవాట్లను దృష్టిలో పెట్టుకొని రాష్ట్ర ప్రభుత్వం కూరగాయలు, పండ్లతోటల పెంపకాన్ని ప్రోత్సహిస్తున్నది. పంటల మార్పిడి మూలంగా చిన్న, సన్నకారు రైతులు అధికంగా లాభాలు ఆర్జించవచ్చు. భూసారాన్ని కాపాడుతూ భావితరాలకు నాణ్యమైన, శ్రేష్ఠమైన ఆహార ఉత్పత్తులను అందిస్తూ, పోషక భద్రత కల్పించవచ్చు. అంతిమంగా భిన్నరకాల పంటలు సాగుచేసి రైతే స్వయంగా ధర నిర్ణయించే పరిస్థితి రావాలన్నది ప్రభుత్వ ఉద్దేశం. కాబట్టి రైతాంగం తమకు ఏది లాభదాయకమో నిర్ణయించుకొని ముందుకుసాగితే ఎవరిపైనా ఆధారపడాల్సిన అవసరం ఉండదు.
– సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి
(వ్యాసకర్త: రాష్ట్ర వ్యవసాయశాఖ మంత్రి)