చలికాలం వచ్చిందంటే చాలు ఢిల్లీ గజగజ వణుకుతుంది. గడ్డకట్టించే చలి ఒక్కటే కాదు, ఊపిరాడనీయని కాలుష్యమూ అందుకు కారణం. ప్రస్తుత సీజన్లో ఢిల్లీ కాలుష్యం డబ్ల్యూహెచ్ఓ అనుమతించిన స్థాయి కంటే 100 రెట్లు అధికంగా ఉన్నట్టు వచ్చిన వార్తలు ఆం దోళన కలిగిస్తున్నాయి. పంజాబ్, హర్యానా రైతులు పంటలు వేసేందుకు ముందు పొలాల్లోని గడ్డీగాదాన్ని తగులబెట్టడం వల్ల ఏర్పడే పొగ గాలిలో కలిసి ఢిల్లీ దిశగా వస్తుంది.
ఉష్ణోగ్రతలు పడిపోవడం వల్ల ఆ పొగమంచుతో కలగలిసిన కాలుష్యం చిక్కబడి దేశ రాజధాని నగరాన్ని కమ్మేస్తుంది. ఇది ఏటా జరిగే తంతు అయినప్పటికీ ఈ సారి తీవ్రత అధికంగా ఉన్నట్టు తెలుస్తున్నది. దీని ఫలితంగా జనజీవనం అతలాకుతలమవుతున్నది. ఏటా మాదిరిగానే ఢిల్లీ ప్రభుత్వం అత్యవసర చర్యలు ప్రారంభించింది. బడులకు సెలవిచ్చారు. ఢిల్లీ సర్కారు మరోసారి సరి-బేసి వాహన విధానం అమల్లోకి తెచ్చింది. సామాన్య ప్రజలు ఊపిరాడక ఇబ్బందులు పడుతుంటే, ఉబ్బసం తదితర వ్యాధులతో బాధపడేవారు తీవ్రమైన శ్వాసకోశ ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.
ఇది ఏటా ఎదురయ్యే సమస్యే అయినప్పటికీ ఇటు ఢిల్లీ గానీ, అటు కేంద్ర సర్కారు గానీ పటిష్ఠమైన చర్యలు చేపట్టకపోవడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. తెలంగాణ ప్రభుత్వం కాలుష్యం నియంత్రణకు చేపట్టిన పకడ్బందీ చర్యలు దేశానికి ఆదర్శంగా నిలుస్తున్నాయి. ఇందులో హరితహారం తలమానికంగా నిలుస్తున్నది. దీని ఫలితంగా అటవీ విస్తీర్ణం 7.7 శాతం పెరిగినట్టు అటవీ సర్వే విభాగం ధ్రువీకరించింది. పల్లె ప్రకృతి వనాలు దీనికి సైదోడుగా నిలుస్తున్నాయి.
వాయు కాలుష్యానికి ప్రధానంగా కారణమయ్యే వరి కొయ్యలను కాల్చొద్దని ప్రజల్లో చైతన్యం తీసుకువచ్చేందుకు తెలంగాణ ప్రభుత్వం కృషిచేస్తున్నది. ప్రగతిశీల విద్యుత్తు వాహనాల విధానంతో కాలుష్య రహిత ప్రయాణాన్నీ ప్రోత్సహిస్తున్నది. రాజధాని హైదరాబాద్ నగరంలో బ్యాటరీ బస్సులను క్రమంగా పెంచుకుంటూ వస్తున్నది. దూరప్రాంత సర్వీసులకూ వీటిని ప్రవేశపెడుతున్నారు. వీటన్నింటి ఫలితంగా కాలుష్యం చాలావరకు అదుపులోకి వస్తున్నది.
కాలుష్యం ఆరోగ్య సమస్య మాత్రమే కాకుండా ఆర్థికరంగంపై కూడా ప్రభావం చూపుతుందనేది తెలిసిందే. జీడీపీ వృద్ధి, ఉత్పాదకత, తలసరి ఆదాయాలు గణనీయంగా తగ్గడానికి కాలుష్యమే కారణమని ఇటీవల జరిగిన అధ్యయనాలు తెలుపుతున్నాయి. వైద్యరంగంపై ప్రభుత్వం చేసే వ్యయాలు మాత్రం ఇబ్బడిముబ్బడిగా పెరిగిపోతాయి. భారత్ వంటి వర్ధమాన దేశం మనసు పెట్టి ఆలోచించాల్సిన అంశం ఇది. చలికాలంలో ఢిల్లీ లాగే నైరుతి రుతుపవనాలు తిరుగుముఖం పట్టే సమయంలో ఆర్థిక రాజధాని ముంబై కూడా కాలుష్యం సమస్యను ఎదుర్కొంటుంది.
కాలుష్య ప్రభావంతో 2030 నాటికి వార్షిక జీడీపీ నష్టం 4.5 శాతానికి చేరుకుంటుందని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఇటీవల ఒక నివేదికలో హెచ్చరించింది. ప్రపంచంలోని 30 అత్యధిక కాలుష్యం ఉన్న నగరాల్లో 20కి పైగా భారత్లోనే ఉండటం గమనార్హం. ఈ పరిస్థితి విధానపరమైన స్పందన తక్షణావశ్యకతను తెలియజేస్తున్నది.