18ఏండ్ల సుదీర్ఘ విరామం తర్వాత మలయాళ సినీ దిగ్గజాలు మమ్ముట్టి, మోహన్లాల్ కలిసి నటించిన చిత్రం ‘పేట్రియాట్’. నయనతార, ఫహాద్ ఫాజిల్, కున్చాకో బోబన్ కీలక పాత్రధారులు. మహేశ్ నారాయణన్ దర్శకుడు. జూన్ 5 నుంచి ఓటీటీ ప్లాట్ఫామ్ జీ 5లో ఈ సినిమా స్ట్రీమింగ్ కానున్నది. అధికారం ఆధారంగా నడిచే వ్యవస్థలో నియంత్రణలేని నిఘా ఎంత ప్రమాదకరమో చూపించే సినిమా ఇదని మేకర్స్ చెబుతున్నారు.
ఏ నిఘా వ్యవస్థ నిర్మాణంలో హీరో కీలక పాత్ర పోషించాడో.. ఆ వ్యవస్థలోని లోపాలను తానే ఎత్తిచూపాల్సిన పరిస్థితులు తలెత్తుతాయి. ఏది దేశద్రోహం? ఏది దేశభక్తి అనేది నిర్ధారించుకోలేని విపత్కర పరిస్థితులు తలెత్తినప్పుడు ప్రధాన పాత్రధారి తీసుకున్న నిర్ణయం ఏంటి? అనేదే ఈ కథ. ఓ భారీ కుట్ర చట్టూ ఈ కథ నడుస్తుందని మేకర్స్ తెలిపారు. ఇది మనస్సాక్షి, బాధ్యత, ధైర్యం గురించి చెప్పే బలమైన కథ అని మమ్ముట్టి చెప్పారు. నిజం, అధికారం మధ్య నిరంతరంగా జరిగే సంఘర్షణను ఈ చిత్రం ఆవిష్కరిస్తుందని మోహన్లాల్ పేర్కొన్నారు.