న్యూఢిల్లీ, మే 22 : హొర్ముజ్ జలసంధి మూసివేత కొనసాగితే అత్యంత దారుణమైన పరిస్థితిలో అంతర్జాతీయంగా ముడి చమురు ధర 200 డాలర్లకు చేరుకొంటుదని గ్లోబల్, డాటా, మార్కెటింగ్ రీసెర్చి సంస్థ ఉడ్ మెకంజీ తాజాగా ఒక నివేదికలో హెచ్చరించింది. ఫిబ్రవరిలో ఇరాన్పై అమెరికా-ఇజ్రాయెల్ సంయుక్త దాడులు ప్రారంభించిన తర్వాత ప్రపంచ ఇంధన మార్కెట్లు తీవ్ర ఒడిదుడుకులు ఎదుర్కొంటున్నాయి. చమురు ధరలు రోజురోజుకూ పైకి ఎగబాకుతూ ప్రపంచ వ్యాప్తంగా పలు దేశాలకు దడ పుట్టించేలా అధిక ద్రవ్యోల్బణం, వడ్డీ రేట్ల పెంపునకు కారణమవుతున్నాయి. హొర్ముజ్లో మూడో నెలలో కూడా ప్రతిష్టంభన కొనసాగుతుండటంతో సరఫరాల చైన్లపై తీవ్ర ప్రభావం పడుతున్నది.
దీంతో ప్రపంచ దేశాల్లో సంక్షోభం మొదలై వాటి ఆర్థిక వ్యవస్థలు త్రీవంగా దెబ్బ తింటున్నాయి. వాణిజ్య ఉత్పత్తుల రవాణాకు కేంద్ర బిందువుగా ఉన్న హొర్ముజ్ను మూసివేయడం వల్ల అది కేవలం ఇంధన సంక్షోభం కంటే తీవ్రమైన సమస్యగా మారుతుందని ఉడ్ మెకంజీ ఎకనామిక్స్ హెడ్ పీటర్ మార్టిన్ హెచ్చరించారు. ముఖ్యంగా పరిశ్రమల కార్యకలాపాలు, సరుకు రవాణా, ప్రపంచ ఆర్థిక వృద్ధిపై తీవ్ర ప్రభావం చూపుతుందని అన్నారు. ఒక వేళ హొర్ముజ్లో పరిస్థితి ఇలాగే కొనసాగితే 2026 రెండో అర్ధ భాగంలో ప్రపంచ చమురు డిమాండ్ రోజుకు ఆరు మిలియన్ బారెళ్లకు తగ్గినప్పటికీ చమురు ధరలు బ్యారెల్కు 200 డాలర్లకు చేరుతుందని, ప్రపంచ ఆర్థిక వ్యవస్థ 0.4 శాతం మేర సంకోచించే ప్రమాదం ఉందన్నారు. అలాగే ప్రపంచ దేశాలు ప్రత్యామ్నాయ ఇంధన మార్గాలపై దృష్టి సారిస్తాయని, యూరప్, అసియా దేశాల్లో హైడ్రోకార్బన్ వినియోగం తగ్గి, విద్యుదీకరణ పెరుగుతుందన్నారు. అయితే ఈ పరిణామాలు యూఎస్ ఎల్ఎన్జీ ఎగుమతిదారులకు ప్రయోజనం చేకూరుస్తుందని వెల్లడించారు.