బీజేపీని నిలువరించేందుకే బీఆర్ఎస్తో కలిసి పని చేస్తున్నామని నిన్న మొన్నటి దాకా చెప్పిన కామ్రేడ్లు.. ఇప్పుడేమో బీజేపీకి లబ్ధి చేకూర్చడానికి బీఆర్ఎస్, ఎంఐఎం పార్టీలు కలిసి పని చేస్తున్నాయని ఆరోపిస్తున్నారు. అప్పుడు అలా… ఇప్పుడేమో ఇలా మాట్లాడటం ఏమిటని పెద్దగా ఆశ్చర్యపడే విషయమేమీ కాదు. బీఆర్ఎస్తో పొత్తు ఉంటుందేమో అని అప్పుడు అలా అన్నారు. పొత్తు ఉండదని తేలిపోయాక ఇప్పుడు ఇలా మాట్లాడుతున్నారని ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. కమ్యూనిస్టులు, కాంగ్రెస్ కలిస్తే అధికార పార్టీకి డిపాజిట్లు కూడా రావని పెద్ద కామ్రేడ్ నారాయణ అన్నారు. అయితే గత ఎన్నికలలో కూడా కాంగ్రెస్-కమ్యూనిస్టులు కలిసే పోటీ చేసారన్న విషయాన్ని ఆయన మరిచిపోయినట్టు ఉన్నారు. ప్రస్తుతం కామ్రేడ్లకు గాంధీభవన్ గేట్లు కూడా మూసుకుపోయాయి. దీంతో తమలాగే కాంగ్రెస్ను నమ్మి మోసపోయిన భావసారూప్యత కలిగిన పార్టీగా షర్మిల పార్టీతో పొత్తు పెట్టుకుంటే ఎలా ఉంటుందని కామ్రేడ్లు ఆలోచిస్తున్నట్టు వినికిడి. ఈ ఇరు పార్టీల మధ్య పరస్పర ఓదార్పు యాత్ర జరిగే అవకాశం లేకపోలేదట. షర్మిల పార్టీ పరిస్థితి కూడా సేమ్ టు సేమ్.. అని మొహమాట పడకుండా కామ్రేడ్లు అంగీకరించడాన్ని మెచ్చుకోవాల్సిందే.
బీఆర్ఎస్ సర్కార్కు కౌంట్ డౌన్ మొదలైంది. ఇంకో వంద రోజులే. తొంబై రోజులేనని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్రెడ్డి జోస్యం చెబుతున్నారు. కానీ వాస్తవానికి ఆ కౌంట్డౌన్ రేవంత్రెడ్డికి పార్టీ అధిష్ఠానం పెట్టిందని గాంధీభవన్ వర్గాలు అంటున్నాయి. రాష్ట్రంలో పార్టీ పరిస్థితి రేవంత్ వన్మేన్ షోగా తయారైందని పలువురు నేతలు ఫిర్యాదు చేస్తే, ఎన్నికల దాకా ఓపిక పట్టండి.. ఆ తర్వాత పక్కన పెట్టబోతున్నామని అధిష్ఠానం పెద్దలు చాలా నమ్మకంగా చెబుతున్నారట. ఇది నమ్మొచ్చా అని అంటే.. రేవంత్ వ్యతిరేకించిన నాయకులకు ఎలక్షన్ స్క్రీనింగ్ కమిటీలో స్థానం కల్పించడమే దానికి సంకేతమని చెప్పినట్టు ఈ వర్గాల సమాచారం.
ఇంతకాలం పార్టీ కోసం కష్టపడ్డాం. గెలిచినా ఓడినా కనీసం ఈ ఒక్కసారి అవకాశం ఇవ్వండని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్రెడ్డి విజయానికి కృషి చేసిన ద్వితీయ శ్రేణి నాయకులు కాళ్లా, వేళ్లా పడినా సమాధానం చెప్పడం లేదట. ‘ఆఫీస్ బాయ్ నుంచి కేంద్రమంత్రి వరకు ఎదగడం వెనుక మా కృషి ఉంది. మీరు ఎలాగూ పోటీ చేయడం లేదు, మాకైనా అవకాశం ఇవ్వండని’ అడిగినా నోరు మెదపకపోవడంతో ఆయనకు కుడిభుజంగా ఉండే వెంకట్రెడ్డి బీఆర్ఎస్ తీర్థం పుచ్చుకొని షాక్ ఇచ్చారు. ఈ సారి అంబర్పేట నుంచి ‘మేమ్ సాబ్’ను (కిషన్రెడ్డి భార్య) బరిలోకి దించాలని భావిస్తున్నారు. ఆయన నోరు మెదపక పోవడానికి అదే కారణమని గుసగుసలు వినిపిస్తున్నాయి.
బీజేపీ కథ మళ్లీ మొదటి కొచ్చింది. ఇంతకాలం బండి సంజయ్ని తప్పించాలని కొందరు నాయకులు లాబీయింగ్ చేసి సక్సెస్ అయ్యారు. తాజాగా కిషన్రెడ్డిని తప్పించి బండి సంజయ్కి పార్టీ పగ్గాలు అప్పగిస్తే తప్ప పార్టీకి మనుగడ లేదని కొందరు నాయకులు లాబీయింగ్ చేస్తున్నట్టు సమాచారం. ఆ దిశగా పార్టీ ముఖ్యులు కొందరు ఇప్పటికే రహస్య భేటీలు జరిపినట్టు తెలిసింది. బండిని తప్పించడానికి అప్పుడు ప్రయోగించిన అస్ర్తాలనే ఇప్పుడు కిషన్రెడ్డిని తప్పించడానికి ప్రయోగిస్తూ నీవు నేర్పిన విద్యయే నీరజాక్ష అన్నట్టుగా ఎత్తుగడలు వేస్తున్నట్టు ఆ పార్టీ వర్గాల సమాచారం.
– వెల్జాల