తమను ఎవరూ పొగడటం లేదని బాధపడేవారు ఉంటారు గానీ.. తిట్టడం లేదని బాధపడేవారు ఉండటం మాత్రం నిజంగా ఆశ్చర్యపోయే విషయమే. ఒక జాతీయపార్టీకి సంబంధించిన కథాకమామిషూ ఇది. ‘ముఖ్యమంత్రి కేసీఆర్ వాళ్లనే తిడుతున్నారు. మంత్రులు కూడా వాళ్లనే అంటున్నారు. టీఆర్ఎస్ నాయకులు కూడా వాళ్లనే తిడుతున్నారు. దీంతో మా పరిస్థితి ఏమిటో అర్థం కావడం లేదు. ఇలా అయితే జనం దృష్టిలో మేము చులకనైపోమా?’ అని కాంగ్రెస్ సీనియర్ నాయకుడు ఒకరు వాపోయారు. ఆ నాయకుడు ఎవరో కాదు, సాక్షాత్తు భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి. ఇటీవల ఒక టీవీ చానల్కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడుతూ, ‘సీఎం కేసీఆర్ ఎప్పుడూ బీజేపీనే టార్గెట్ చేస్తూ, రాష్ట్రంలో ఆ పార్టీనే హైలైట్ చేస్తున్నారు. అలా చేయడం వల్ల చివరకు రాష్ట్రంలో టీఆర్ఎస్, బీజేపీ రెండు పార్టీలే ఉన్నాయా అనే అభిప్రాయాన్ని కల్పించగలిగారు. వాళ్లను మాత్రమే తిట్టి మమ్మల్ని ఏమీ అనడం లేదంటే.. అది మా పార్టీపై ప్రేమ కాదు. మా పార్టీని దెబ్బ తీసే కుట్రతో ఇదంతా చేస్తున్నారు’ అని ఎంపీ కోమటిరెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. ఈ ఇంటర్వ్యూ చూశాక.. ‘తిట్లన్నీ ఒక పార్టీకేనా? కాంగ్రెస్ వాళ్లు ఏం పాపం చేసారు. కాస్త ఎక్కువో, తక్కువో అప్పడప్పుడు ఆ పార్టీనీ తిట్టొచ్చుగా! వాళ్లు కూడా సంతోషిస్తారు’ అని ఎవరికైనా అనిపించే అవకాశం ఉంది.
‘మరీ ఇంత అన్యాయమా? ఏ ఒక్కరికో జరుగుతున్న అవమానం కాదు ఇది. మా అందరి ఆత్మాభిమానానికి సంబంధించిన విషయం. అందుకే మేము వీటికి ఆత్మాభిమాన సమావేశాలని పేరు పెట్టుకున్నాం’ అని అంటున్నారు బీజేపీ నాయకులు. ఇంతకూ వీళ్లు అనేది ఎవరి గురించి? అని ఎవరినైనా అడిగితే.. అధికార టీఆర్ఎస్ పార్టీ గురించో లేక రాష్ట్ర ప్రభుత్వం గురించో అయి ఉంటుందని చెబుతారు. కానీ అలా అనుకున్నారో ‘కమలంలో కాలేసినట్టే’ అవుతుంది. ఇదంతా బీజేపీ అంతర్గత సంక్షోభం ముచ్చట. ముందొచ్చిన చెవుల కంటే వెనుకొచ్చిన కొమ్ములు వాడివంటే దానికి మేమెలా ఒప్పుకొంటామని బీజేపీలో సీనియర్ నాయకులంతా ఏకతాటిపైకి వచ్చి రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్పై గుర్రుమంటున్నారు. బండి ఒంటెత్తు పోకడలపై విసిగిపోయి ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో.. పెద్దపల్లి, గోదావరిఖనిలో బీజేపీ సీనియర్ నేతలు ‘ఆత్మాభిమానం’ పేరిట సమావేశాలు ఏర్పాటు చేసుకున్నారు. వీరి స్ఫూర్తితో నిజామాబాద్ జిల్లా సీనియర్లు కూడా ఇదే నినాదంతో శంఖం పూరించారు. ఈ చింతన్ బైఠక్లపై పార్టీ సీనియర్ నాయకుడు నల్లు ఇంద్రసేనారెడ్డి నేతృత్వంలో ఒక కమిటీని అధిష్ఠానం ఏర్పాటు చేసింది. ఈ కమిటీ ఇప్పటికే అసమ్మతి నేతలతో భేటీల మీద భేటీలు నిర్వహించినట్టు సమాచారం.
గణతంత్ర దినోత్సవం సందర్భంగా హస్తిన పరేడ్లో ప్రదర్శనకు ఎంపికైన వాటిలో తమ శకటాలు ఎందుకు లేవని కొన్ని రాష్ర్టాలు మండిపడుతుంటే.. ఆ మండిపడటాలు ఎందుకో అర్థం కావడం లేదని కేంద్రం అమాయకపు ముఖం పెడుతున్నది. ఎంపికైన శకటాలు ఏయే రాష్ర్టాలకు చెందినవో గుర్తు చేసుకుంటే తమను నిందించాల్సిన అవసరమే ఉండదని కేంద్ర అధికారులు చెబుతున్నారట. దక్షిణాది నుంచి ఒక్క కర్ణాటక శకటం మాత్రమే ఎంపికైంది. అయినప్పటికీ, ‘ఇందులో వివక్ష ఎక్కడుంది’ అని శకటాల ఎంపిక కమిటీ ఎదురుప్రశ్నించినట్టు వార్తలు వచ్చాయి. అంటే శకటం ఎంపిక కావాలంటే.. బీజేపీ పాలిత రాష్ట్రం కావడం ఒక్కటే అర్హతా? అని బీజేపీయేతర రాష్ర్టాలు ప్రశ్నిస్తే.. ‘ఆ ఒక్కటీ ఆడక్కు’ అన్నట్టుగా ఎంపిక కమిటీ తీరు ఉన్నదని విమర్శలు వినిపిస్తున్నాయి.
-వెల్జాల