బీజేపీకి కర్ణాటక ఫైల్స్ (ఓటమి) చేసిన డ్యామేజీ అంతా ఇంతా కాదు. ఆ పార్టీ కర్ణాటకలో ఓటమి తర్వాత తెలంగాణ వలస నేతలు తమ దారి తాము చూసుకుంటామని అధిష్ఠానాన్నే బ్లాక్మెయిల్ చేశారు. దీంతో ఈటలకు ఎన్నికల నిర్వహణ కమిటీ బాధ్యతలు అప్పగించింది. మరి నా సంగతేంటి? అని కోమటిరెడ్డి రాజగోపాల్రెడ్డి దబాయించడంతో పార్టీ జాతీయ కార్యవర్గ సభ్యుడిగా ప్రకటించింది. తమ తర్వాత పార్టీలో చేరిన వారికి పోస్టులు ఇచ్చి తమను చిన్నచూపు చూస్తే ఎలా? అని మరికొందరు వార్నింగ్ ఇవ్వడంతో తాజాగా ‘మేరీ మిట్టీ… మేరా దేశ్’ రాష్ట్ర కమిటీ కన్వీనర్గా కొండా విశ్వేశ్వర్రెడ్డిని, కో-ఆర్డినేటర్గా రవీందర్నాయక్ను నియమించింది. ఇదేమి పోస్టు? ఇలాంటి కమిటీ ఎక్కడైనా ఉందా? అని ప్రశ్నిస్తే, ఈటలకు ఇచ్చిన పోస్టు కూడా ఎక్కడా లేదు. ఆయన అడ్జెస్ట్ కాలేదా? అన్నారట. .
కట్నం కోసం అత్తింటి వేధింపులు తట్టుకోలేకనో, వ్యసనపరుడైన భర్తను భరించలేకనో ఆత్మహత్యలకు పాల్పడిన వారిగురించి విన్నాం. చూశాం కానీ, వచ్చే ఎన్నికల్లో మా ఆయన్నీ గెలిపించకపోతే చచ్చిపోతానని బెదిరించిన ఇల్లాలి గురించి మాత్రం వినడం ఇదే. ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లా అచ్చంపేట కాంగ్రెస్ మాజీ ఎమ్మెల్యే డాక్టర్ వంశీకృష్ణను ఈసారి ఎన్నికల్లో గెలిపించాలి ‘నేను మీ ముందు ప్రాణాలతో ఉండా లంటే, నా చివరి కోరికను తీర్చండి’ అని ఆయన సతీ మణి అనురాధ బహిరంగ సమావేశంలోనే హెచ్చరించింది. ఈ రకంగా ‘బ్లాక్మెయిల్ చేయడం మీకు తగునా తల్లీ’ అని ఓటర్లు వాపోతున్నారు.
కాంగ్రెస్లో ఇంచార్జీలు కొనసాగడం మూన్నాళ్ల ముచ్చటే. కొద్దికాలం గడిచాక అసమ్మతి, ఫిర్యాదులు, ఆరోపణలు షరామాములే. గతంలో ఇంచార్జీలుగా పనిచేసిన కుంతియా, మానిక్కమ్ ఠాగూర్పై ఆరోపణలు, విమర్శలు, ఫిర్యాదులు వెల్లువెత్తడంతో వారి స్థానంలో కొత్తవారిని నియమించారు. ప్రస్తుత ఇంచార్జీ మాణిక్రావు ఠాక్రే కూడా ఎంతకాలం కొనసాగుతారో డౌటేనని గాంధీభవన్ వర్గాలు అంటున్నాయి. రాష్ట్ర నేతలను సంప్రదించకుండా వైసీపీ ఎంపీ ఆర్.కృష్ణయ్యతో ఠాక్రే ఇటీవల భేటీ అయ్యారు. ఇది నచ్చని బీసీ నేతలు కొందరు అధిష్టానానికి ఫిర్యాదు చేశారట. దీనిపై ఆయన్ను అధిష్ఠానం వివరణ కోరితే, కృష్ణయ్య గతంలో కాంగ్రెస్ పార్టీలో ఉండటంతో కలిసినట్టు సంజాయిషీ ఇచ్చుకున్నారట. అలా అయితే జగన్ కూడా గతంలో కాంగ్రెస్లో ఉన్నారు. మరి ఆయన్ని కూడా కలుస్తారా? అని బీసీ నేతలు తాజాగా కౌంటర్ ఇస్తున్నారు..
ముప్పై మంది నాయకులు కలిసి ఉంటారు కానీ ముగ్గురు మహిళా నేతలు కలిసి ఉండటం కష్టమని బీజేపీ రాష్ట్ర నేతలు వాపోతున్నారు. పార్టీ నుంచి విజయశాంతి అవుట్ అని పక్కా సమాచారం ఉండటం వల్లనే జయసుధ కాషాయ కండువా కప్పుకున్నదని ఈ వర్గాల కథనం. అధిష్ఠానంపై కొంతకాలంగా కారాలు మిరియాలు నూరుతున్న విజయశాంతి పార్టీ మారడం దాదాపు ఖాయమని అంటున్నారు. ఈ విషయం కిషన్రెడ్డికి తెలిసే జయసుధను ఢిల్లీకి తీసుకెళ్లి పార్టీ కండువా కప్పారని చెప్తున్నారు. బండి సంజయ్ అధ్యక్షునిగా ఉంటే టికెట్ వచ్చేది… ఇప్పుడు వస్తుందో రాదోనని మరో నటి జీవిత తన సన్నిహితుల వద్ద వాపోతుందట. విజయశాంతి తర్వాతి వికెట్ జీవితనే అని అంచనా వేస్తున్నారు.
–వెల్జాల