అశోకుని తదనంతరం వచ్చిన అనేక రాజులు సైతం హిందూ దేవాలయాలతోపాటుగా బౌద్ధ ఆరామాలను కట్టించారు. మహాయాన బౌద్ధ సిద్ధాంతాన్ని బోధించిన నాలుగవ బౌద్ధ మహా పరిషత్ నిర్వహించిన కుషాణ మహారాజు కనిష్కుడు (క్రీస్తుశకం 78-144) కశ్మీర్ను పాలించాడు. బుద్ధ చరితను రాసిన అశ్వఘోషుడు, ప్రముఖ బౌద్ధ తాత్వికులు నాగార్జునుడు, వసుగుప్తుడు కనిష్కుని ఆస్థానంలో ఆదరాభిమానాలు చూరగొన్నవారే. కనిష్కుడు రాజ్యాభిషేకం చేసిన క్రీస్తుశకం 78 నుంచి శక సంవత్సరాన్ని గణించడం ప్రారంభమైనదని కొందరు చరిత్రకారుల అభిప్రాయం. కనిష్కుని కాలంలోనే నాగార్జునాచార్యుని బోధనల ప్రభావంతో కశ్మీర్ అంతటా బౌద్ధమతం వ్యాపించి ప్రాధాన్యం సంతరించుకున్నదని రాజతరంగిణి వివరించింది (1వ తారంగం: 177వ శ్లోకం). అయితే, శైవ, వైష్ణవ, బౌద్ధ అనుయాయుల మధ్య ఘర్షణలు జరిగేవని కల్హణుడు వెల్లడించాడు.
కుషాణుల తర్వాత కశ్మీర్ను పాలించిన రెండవ చంద్రదేవుడు బౌద్ధమతాన్ని వ్యతిరేకించాడనీ, భరింపజాలని బౌద్ధ భిక్షు తెగలను చంద్రదేవుడు అంతం చేశాడని రాజతరంగిణి చెప్తుంది (1వ తారంగం: 184వ శ్లోకం). ప్రముఖ బౌద్ధ భిక్షువు కుమారజీవుడు (క్రీస్తు శకం 344-413) కశ్మీర్లోని శారదా పీఠంలో విద్యాభ్యాసం చేశాడు. ప్రపంచంలోకెల్లా అతిపెద్ద గ్రంథాలయాల్లో శారదాపీఠం ఒకటిగా గుర్తింపు పొందింది. టిబెట్ భాష, లిపి ఈ పీఠంలోనే రూపుదిద్దుకున్నదని చెప్తారు.
ఇస్లాం, సిక్కు మతాల ప్రవేశం: క్రీస్తుశకం 1301లో కశ్మీర్ను సహదేవుడు పరిపాలిస్తున్న తరుణం లో పర్యటించిన సూఫీ మతానుయాయి బుల్ బుల్ షా ఇస్లాం మతాన్ని కశ్మీర్లో ప్రచారం చేశాడు. తర్వాత ఆఫ్గనిస్థాన్లోని స్వాత్ ప్రాంతం నుంచి వల స వచ్చిన షామీర్ కశ్మీర్ను పరిపాలిస్తున్న కోటారా ణి ఆంతరంగిక సలహాదారుగా పదోన్నతి పొంది క్రీస్తుశకం 1339లో కుట్ర చేసి ఆమెను పదవీచ్యుతురాలిని చేసి కశ్మీర్ రాజపదవి చేపట్టాడు. ఇతని కాలంలోనే వందలాది సూఫీ సన్యాసి షా హందమ్ అనుయాయులు కశ్మీర్లో స్థిరపడి ఇస్లాం వ్యాప్తికి కృషిచేశారు. అయితే, కశ్మీర్ చరిత్రలో అతిహేయమైన మత మారణకాండను సుల్తాన్ సికందర్ (క్రీస్తుశకం 1389-1413) రక్తాక్షరాలతో లిఖించాడు. ఇస్లామిక్ రాజ్యంలో ఇస్లామేతరులు బతుకడానికి అనుమతించే జిజియా పన్నును హిందువులపై విధించాడు. హిందువులు తమ నుదుటిన తిలకం దిద్దుకోవడం నిషేధించాడు. వేలాది హిందువులను బలవంతంగా మతమార్పిడి చేశాడు. కశ్మీర్లోని హిందూ దేవాలయాలను ధ్వంసం చేసి బత్ శికన్(విగ్రహ విధ్వంసకుడు) అనే బిరుదు పొందాడు. ఇతని కాలంలో విధ్వంసానికి గురికాని పట్టణంలోని, నగరంలోని, గ్రామంలోని, పల్లెలోని గుడులు గాని, విగ్రహాలు గాని లేవని చెప్తారు. సుల్తాన్, అతని మంత్రి లాయక్ సైఫుద్దీన్ కశ్మీర్ హిందువులను బలప్రయోగంతో బలవంతపు మతమార్పిడులు చేశారు. హిందువులపై జరిగిన ఈ అమానుష అణచివేత వల్ల వేలాది హిందువులు కశ్మీర్ నుంచి వేరే ప్రాంతాలకు వలస పోవడం వల్ల కశ్మీర్ చరిత్రలో మొదటిసారి కశ్మీరీ పండితుల జనాభా గణనీయంగా తగ్గింది. ఇది కశ్మీర్లో హిందువుల మొదటి జన హననం.
ఇక్కడొక విషయం మనం గమనించాలి. గతం లో కశ్మీర్ రాజులు కొందరు రాజ ధనాగారాన్ని నిం పడానికి దేవాలయాలను, బౌద్ధ ఆరామాలను దోచుకున్న ఉదంతాలున్నాయి. క్రీస్తుశకం 950లో కశ్మీర్ను పాలించిన కుమారగుప్తుడు బౌద్ధ విహారంలో దాక్కున్న తిరుగుబాటు నాయకుడిని చంపడానికి శ్రీనగర్లోని ఒక దేవాలయంలోని ఇత్తడి బుద్ధుని విగ్రహాన్ని సంగ్రహించి దేవాలయాన్ని మంటలకు ఆహుతి చేశాడు. ప్రపంచవ్యాప్తంగా తన ఖ్యాతి విస్తరిస్తుందన్న భ్రమలో ఆ మూర్ఖపు రాజు కాలిన బౌద్ధవిహార స్థానంలో క్షేమ గౌరీశ్వరి దేవాలయాన్ని నిర్మించాడని రాజ తరంగిణిలో తెలియజేశాడు (6వ తారంగం: 171-173 వ శ్లోకం). కల్హణుడు మరో కశ్మీర్ రాజు శంకరవర్మ గురించి చెప్తూ ప్రతిరోజు కొత్త వ్యసనాలకు బానిసై తన కోరికలు తీరడానికి సరిపడా ధనం లేక అతను తరచుగా వివిధ సాకులు చూపి దేవాలయాలను దోచుకున్నాడని చెప్పాడు (5వ తారంగం: 166వ శ్లోకం). కానీ, సుల్తాన్ సికందర్ మాత్రం ధనం కోసమో, తిరుగుబాటును అణచడానికో కాకుండా మతోన్మాదంతోనే బలవంతపు మత మార్పిడులకు, ఇస్లాంకు విరుద్ధమైన విగ్రహారాధన అణచివేతకే చర్యలు తీసుకున్నాడని స్పష్టమవుతుంది. కశ్మీర్లో ఇస్లాం ప్రకారం షరియా చట్టం అమలును పర్యవేక్షించడానికి షైక్ ఉల్ ఇస్లాం సంస్థను నెలకొల్పడాన్ని బట్టి అతని ఇస్లాం మతరాజ్య స్వభావం బోధపడుతుంది. ఇస్లాంకు వ్యతిరేకమని అతను భావించిన సంగీత, నృత్య, నాటక ప్రదర్శనలు, మద్యపానం, జూదశాలలను నిషేధించాడు.
అయితే, అతని తర్వాత క్రీస్తుశకం 1429లో కశ్మీర్ను పాలించిన జైన్ ఉల్ అబిదీన్ మాత్రం సికందర్ ప్రవేశపెట్టిన మతోన్మాద చట్టాలన్నిటిని రద్దు చేశాడు. తన రాజ్యంలోని అన్ని మతాలవారిని సమదృష్టితో చూశాడు. అతను పర్షియన్, సంస్కృత కవులను ప్రోత్సహించాడు. ప్రాంతీయ వృత్తులకు ఊతమివ్వడంతో పాటు అనేక సుందరమైన ఉద్యాన వనాలను, పంట కాలువలను నిర్మించాడు. సంగీత, నాట్య కళలను ప్రోత్సహించాడు. మొఘల్ చక్రవర్తి అక్బర్ పాలనలో కూడా కశ్మీర్ అన్ని మతాల సహజీవాన్ని చవిచూసింది. అయితే, ఔరంగజేబు మతోన్మాద పాలనలో తిరిగి దుర్భర అణచివేతకు గురైంది.
అఫ్ఘానీలు-సిక్కులు: ఆఫ్ఘన్ రాజు అహ్మద్ షా అబ్దాలీ పాలన కశ్మీర్లో క్రీస్తుశకం 1753లో ప్రారంభమైంది. సుమారు యాభై ఏండ్లు కొనసాగిన ఆఫ్గన్ల పాలనలో కశ్మీర్ పండితులపైనా, షియా ముస్లింలపైనా అనేక అత్యాచారాలు జరిగాయి. అప్పటి ఘోరాలను ఉదహరిస్తూ మత మార్పిడికి ఒప్పుకోని కశ్మీర్ పండితుల తలలకు గుదిబండను కట్టి ఆఫ్ఘన్ గవర్నర్ అసద్ఖాన్ కశ్మీర్లో దాల్ సరస్సులో పారవేయించాడనీ, అప్పటినుంచి దాల్ సరస్సు దగ్గరి ఆ ప్రాంతాన్ని బత్ మజార్ (విగ్రహారాధకుల స్మశానం)గా పిలవబడుతుందని చెప్తారు. ఇది కశ్మీర్లో హిందువుల రెండో జనహననం.
సిక్కు మత గురువు మహారాజా రంజిత్సింగ్ క్రీస్తుశకం 1819లో కశ్మీర్ను పాలించాడు. కశ్మీర్ను క్రీస్తుశకం 1846 నుంచి డోగ్రాలు ఏలారు. మహారాజు గులాబ్ సింగ్ క్రీస్తుశకం 1846లో బ్రిటిష్ వారి నుంచి కశ్మీర్ను కొనుగోలు చేశాడు. వీరిలో మహారాజా హరిసింగ్ 1926లో కశ్మీర్కు రాజై భారతదేశం స్వాతంత్య్రం పొందేవరకు కొనసాగాడు.
(ఇంకా ఉంది…)
– ఆనందేశి నాగరాజు 98488 38323