యావత్ ప్రపంచం రష్యా-ఉక్రెయిన్ యుద్ధంతో కలవరపడుతున్నది. కానీ, అంతకంటే ఆందోళన పడాల్సిన అంశం.. ‘ముంచుకొస్తున్న వాతావరణ ముప్పు’ అని ఐక్యరాజ్యసమితికి చెందిన అంతర్జాతీయ సంస్థ ఐపీసీసీ తాజా నివేదికలో మానవాళిని హెచ్చరించింది. ఈ నివేదికపై ఐరాస ప్రధాన కార్యదర్శి ఆంటోనియో గుటెర్రస్ స్పందిస్తూ.. ‘జీవిత కాలంలో ఎన్నో శాస్త్రీయ నివేదికల్ని చూశాను. కానీ, ఇటువంటిది ఎన్నడూ చూడలేదు. మానవాళి బాధల సర్వసమ గ్ర చిత్రణ ఇది. వాతావరణ మార్పులకు సంబంధించిన విఫల నాయకత్వంపై అభిశంసన ఇది. ఇంతటి తీవ్రమైన సమస్యపై నాయకత్వ లేమి అనేది ఒక నేరపూరిత చర్య’ అంటూ ఆగ్రహం, ఆవేదన కలగలిసిన స్వరంతో వ్యాఖ్యానించారు. ఇకనైనా శిలాజ ఇంధనాల వాడకాన్ని ఆపివేయాలంటూ సంపన్న దేశాలకు ఆయన విజ్ఞప్తి చేశారు.
భూ తాపం నియంత్రణకు కుదిరిన పలు అంతర్జాతీయ ఒప్పందాలపై రష్యా, ఉక్రెయిన్ కూడా సంతకాలు చేశాయి. కానీ, ఆ సమస్యను మరిచి ఇప్పుడు ఇరుదేశాలు తలపడుతున్నాయి. మొత్తం ప్రపంచం వైఖరి కూడా ఇలాగే ఉన్నది. మానవాళి కలిసికట్టుగా ఎదుర్కోవాల్సిన సమస్య గ్లోబల్ వార్మింగ్. కానీ, దాని మీద దృష్టి పెట్టకుండా.. ఆర్థిక, సరిహద్దు సమస్యల మీద సై అంటే సై అంటూ సమయాన్ని, వనరుల్ని వృథా చేసుకుంటున్నాయి. పర్యావరణ పరిరక్షణ అంశం అంతర్జాతీయ సదస్సులకు, నివేదికలకే పరిమితమవుతున్నది. ఐపీసీసీ తాజా నివేదిక ప్రమాదపు ఘంటికలను గతంలో కంటే గట్టిగా మోగించింది. డాలర్ల వెనుక పరిగెడుతున్న ప్రపంచానికి ఆ భాషలో చెబితేనన్నా అర్థమవుతుందేమోనని ఆ ప్రయత్నమూ చేసింది. భూతాపాన్ని ఇప్పటికైనా అదుపులో పెట్టకపోతే 2100 నాటికి తీరప్రాంతాల్లో 14 లక్షల కోట్ల డాలర్ల (రూ.1,060 లక్షల కోట్లు) నష్టం వాటిల్లే ప్రమాదం ఉందని తెలిపింది.
మరో 30 ఏండ్లలో ముంపునకు గురయ్యే 20 అతిపెద్ద తీరప్రాంత నగరాల్లో 13 ఆసియాలోనే ఉంటాయని ఐపీసీసీ వెల్లడించింది. వీటిలో ముంబై, చెన్నై, కోల్కతా కూడా ఉన్నాయి. ఈసారి నివేదికలో ప్రాంతాల వారీగా అధ్యయనాలను ఐపీసీసీ వెలువరించటం మంచి ప్రయత్నం. దీనివల్ల ప్రమాద తీవ్రతను ప్రాంతీయ స్థాయిలో అర్థం చేసుకోవటానికి, తద్వారా ముందుజాగ్రత్త చర్యలు చేపట్టటానికి చొరవ పెరిగే అవకాశం ఉంది. భూతాపం, సముద్రమట్టాల పెరుగుదల కారణంగా తీవ్రంగా నష్టపోయే దేశాల్లో భారత్ కూడా ఉండటం ఆందోళనకరం. అయితే దక్షిణ భారతంలో, పలు ఇతర భారతీయ నగరాల్లో జలసంరక్షణకు, ప్రకృతి విపత్తుల నివారణకు అమలులో ఉన్న ప్రాచీన పద్ధతులను ఈ నివేదిక ప్రశంసించటం గమనార్హం. శిలాజ ఇంధనాల వాడకం నుంచి వీలైనంత త్వరగా ప్రపం చం బయటపడాలి. కార్పొరేట్ కంపెనీల ప్రయోజనాల కన్నా మానవాళి మనుగడ ముఖ్యమన్న ఎరుకతో ప్రత్యామ్నాయ ఇంధన వనరులను అభివృద్ధి చేసుకోవాలి. మానవాళి తక్షణం మేల్కోవాలి.