మోదీ మాటలు, చేతల మధ్య తేడా ఏమిటో గమనించండి!
బీజేపీ నిబద్ధతను గూర్చి అన్ని పార్టీల వారూ పునరాలోచించండి!
మీ అంతరాత్మ ప్రబోధంతో రాష్ట్రపతిని ఎన్నుకోండి!
1. మోదీ గారు ప్రధానిగా తొలిసారి పార్లమెంటు భవనంలోకి ప్రవేశించినప్పుడు సాష్టాంగ ప్రమాణం చేసి తనకు శ్రద్ధాభక్తులు ఉన్నట్టుగా చాటుకున్నారు! ఆయన విధేయతను చూసి భారతీయులు ముగ్ధులయ్యారు. అలాంటి పార్లమెంటులో గతంలో చేసిన ‘ఏపీకి ప్రత్యేక హోదా’ ప్రకటనను, తిరుపతిలో శ్రీవేంకటేశ్వరస్వామి సాక్షిగా తానే స్వయంగా చేసిన ‘ఏపీకి ప్రత్యేక హోదా’ వాగ్దానాన్ని గడ్డిపోచతో సమంగా గాలికి వదిలేశారు. అదీ పార్లమెంటు పట్ల, తన వాగ్దానాల పట్ల మోదీ గారి నిబద్ధత.
2. 2019 కుంభమేళాలో ‘స్వచ్ఛభారత్’కు మీరందిస్తున్న సేవలు అమూల్యాలంటూ పారిశుద్ధ్య కార్మికుల కాళ్లు కడిగారు ప్రధాని మోదీ. ఆ దృశ్యాలు దేశవ్యాప్తంగా వైరలయ్యాయి. అలా తాను పేదల మనిషినంటూ చాటుకున్నారు. కానీ ‘స్వచ్ఛ గంగా’ ప్రాజెక్టును నిర్వహిస్తున్న ‘విశాల్ ప్రొటెక్షన్ ఫోర్స్’ సంస్థ వాళ్లకు మూడు నెలలుగా జీతాలివ్వని కారణంగా వాళ్ళ కుటుంబాలు పస్తులున్నాయి. 2021, డిసెంబర్ 21న అక్కడ సభకు విచ్చేసిన మోదీకి తమ గోడు వినిపించుకునేందుకు వెళ్లారు సదరు కార్మికులు. మోదీకి 100 మీటర్ల దూరంలో వాళ్లను నిలిపివేశారు. ‘మా కాళ్ళు కడగడటం మాపట్ల గౌరవంతో కాదు, అదంతా ఒక స్టంట్ అని ఇప్పుడు మాకర్థమవుతున్నది. మా కష్టార్జితాన్ని మాకిప్పించండి’ అంటూ భోరున ఏడ్చేశారు ఆ కార్మికులు.
3. అంబేద్కర్ విగ్రహాల పునరుద్ధరణ, దళితుల ఇళ్లకెళ్లి సహపంక్తి భోజనాలు చేయటం వగైరాల ద్వారా దళిత హిందువులను బీజేపీ ఆకట్టుకున్నది. తాను చాయ్వాలానని మోదీ చెప్పుకున్నారు. మా ‘మోదీ బీసీ, పేదల పెన్నిధి’ అంటూ బీజేపీ బీసీలను కూడా ఆకర్షిస్తున్నది. ‘హిందువుగా జీవించు, హిందువునని గర్వించు’ అన్న స్టిక్కర్లను దళిత, బీసీ యువకుల చేత గ్రామ గ్రామాన ఇంటింటికీ అంటింపజేస్తున్నారు. కానీ ఆచరణలో మాత్రం దళితులకు, బీసీలకు చేయూతనిచ్చే రిజర్వేషన్లు పొందుపరిచిన అంబేద్కర్ రాజ్యాంగాన్ని బేఖాతరు చేస్తున్నారు. రిజర్వేషన్ల ద్వారా సామాజిక సమతుల్యతకు తోడ్పడుతున్న ప్రభుత్వరంగ సంస్థలకు ‘చాయ్’లాగా అమ్మేస్తున్నారు. బీసీలను గాలికొదిలేసి (బి) బిగ్ (సి) కార్పొరేట్ల సేవలో ప్రధాని మోదీ తరిస్తున్నారు. కోట్ల రూపాయల ప్రజాధనంతో వివిధ దేశాల్లో పర్యటిస్తున్న మోదీ గారిని చూసి, ఆయా దేశాల నుంచి వివిధ పరిశ్రమలను రప్పించి కోట్ల మందికి ఉద్యోగాలిప్పిస్తారంటూ సామాన్య ప్రజలు వేయికండ్లతో ఎదురు చూస్తున్నారు. కానీ వాస్తవమేమంటే.. శ్రీలంక నుంచి 58 వేల కోట్ల ‘విండ్ పవర్’ ప్రాజెక్టును, ఆస్ట్రేలియా నుంచి బొగ్గు గనుల కాంట్రాక్టును, రష్యా నుంచి 45 వేల కోట్ల పోర్టు నిర్మాణ ప్రాజెక్టును, మలేషియా నుంచి ఎంఎంసీ పోర్టు కంపెనీతో డీల్ను అదానీకి, అలాగే స్వీడన్ నుంచి 6 వేల కోట్ల ఫైటర్ ఎయిర్క్రాఫ్ట్ల డీల్ను, రష్యా నుంచి 6 బిలియన్ల, ఇజ్రాయెల్ నుంచి 65 వేల కోట్ల, అమెరికా నుంచి 15 వేల కోట్ల బిజినెస్ డీల్స్ను, ఫ్రాన్సు నుంచి 58 వేల కోట్ల ‘రఫెల్’ డీల్ను అంబానీలకు మోదీ ఇప్పించినట్లు తెలిసి పేద భారతీయులు మొత్తుకున్నారు. ఈ మధ్య ‘మోదీ దేవుడు’ అని బండి సంజయ్ అన్న మాట అక్షరాల నిజం. ఎస్సీ, ఎస్టీ, బీసీలకేమీ కాకపోవచ్చు గానీ, వివిధ దేశాల నుంచి వేలాది కోట్ల డీల్స్ను కుదిర్చిపెట్టిన మోదీ గారు అదానీ, అంబానీలకు దేవుడే గదా మరి!
ఇక రాష్ట్రపతి అభ్యర్థిగా బీజేపీ ప్రతిపాదించిన ‘ద్రౌపదీ ముర్ము’ గిరిజన మహిళ, స్వీయ ప్రగతి కోసం పరిశ్రమిస్తూ ఈ స్థాయికి ఎదిగినందుకు ఆమె తప్పక అభినందనీయురాలే! అయితే ఆమె తనకోసమే తప్ప, తనవాళ్ల కోసం చేసిందేమీ లేదు. ప్రజాప్రతినిధిగా, గవర్నర్గా ఎదిగినా, కనీసం సొంత గ్రామానికి విద్యుత్ సౌకర్యాన్ని కూడా కల్పించలేదు. గిరిజనులపై మోదీ ప్రభుత్వం చేపట్టిన అణచివేత చర్యలను మాటమాత్రంగానైనా ఖండించలేదు. మా ఆడపడుచు ‘ద్రౌపదీ ముర్ము’ మాకేమీ చేయలేదంటూ గిరిజనులే వాపోయినట్లు మీడియా వార్తలు తెలుపుతున్నాయి.
4. ‘గిరిజన మహిళ’ను రాష్ట్రపతి అభ్యర్థిగా ప్రకటించి, తాను గిరిజనోద్ధారకుడినని చెప్పకనే చాటుకున్నారు మోదీ. అయితే వారు ఇటీవలే సవరించిన అటవీ చట్టాలను, ఆయా సందర్భాల్లో గిరిజనులపై అణచివేత చర్యలను పరిశీలిస్తే గిరిజనుల పట్ల మోదీకి, బీజేపీకి నిబద్ధత ఏపాటిదో తెలిసిపోతుంది. మోదీ సవరించిన అటవీ చట్టాలు ఎ)గిరిజన కమ్యూనిటీల, గ్రామసభల, అటవీవాసుల భూ, నివాస హక్కుల్ని కాలరాస్తున్నాయి. బి)ఆయా ప్రాంతాల్లో చేపట్టే ప్రాజెక్టులకు అడ్డుగా ఉన్న వేలాది గిరిజన కుటుంబాలను వెళ్లగొట్టేందుకు బలవంతపు చర్యలు చేపట్టేందుకు మోదీ ప్రభుత్వానికి వీలు కల్పిస్తున్నయి. తరతరాలుగా అక్కడ నివసిస్తున్న లక్షల మంది గిరిజనులకు ప్రత్యామ్నాయాలను ప్రస్తావించకుండానే, ఆ భూములపై కార్పొరేట్లకు, వాళ్ల కంపెనీలకు గుత్తాధిపత్యాన్ని కల్పిస్తున్నయి. ఒడిషాలోని ‘నియాంగిరి’ అటవీ ప్రాంత కొండల కింద ప్రమాదకర బాక్సైట్ తవ్వకాలను ప్రారంభించిన ‘వేదాంత’ కంపెనీకి వ్యతిరేకంగా ఉద్యమించిన గిరిజనులు, గిరిజన నేతలను మావోయిస్టులన్న ముద్రవేసి జైళ్లలో నిర్బంధించారు. తమిళనాడులోని ‘తూత్తుకుడి’ పట్టణంలో ‘వేదాంత కంపెనీ’ నిర్వహిస్తున్న ‘స్టెరిలైట్ కాపర్ ఫ్యాక్టరీ’ పరిసరాల భూములను, గాలిని, నీటిని కలుషితం చేసి ప్రజలకు శ్వాసకోశ వ్యాధులను కలిగిస్తున్నాయి. ఆ ఫ్యాక్టరీని మూసేయవలసిందిగా ఆందోళనకు దిగిన ఆయా గ్రామాల ప్రజలను నడిరోడ్డులో కాల్చివేసింది మోదీ హయాంలోనే. ఇంకో మధ్యప్రదేశ్లోని సాల్ ఫారెస్ట్ ఏరియాలో, పర్యావరణ నిబంధనలకు అతీతంగా బొగ్గు తవ్వకాలను సాగిస్తున్న ‘హిండాల్కో’, ‘ఎస్ఆర్ ఎనర్జీ’ కంపెనీలకు వ్యతిరేకంగా ఉద్యమించిన పలువురు పర్యావరణ ఉద్యమకారులను దేశద్రోహ నేరం కింద అరెస్టు చేసి జైళ్లలో నిర్బంధించింది కూడా మోదీ ప్రభుత్వమే!
ఇటువంటి సంఘటనలను గుర్తుచేసుకుంటూ ఎస్సీ, ఎస్టీ, బీసీలంతా ఆలోచనలో పడ్డారు. ఇప్పుడు వారికి అర్థమైంది. మోదీ మాటలన్నీ మన పేదలకు కాదు, దేశ సంపద మూటలన్ని బడా కార్పొరేట్లకని. ఈ ఎనిమిదేండ్లలో మన కష్టాలు రెట్టింపయ్యాయి. మరోసారి మోదీని గెలిపించుకుంటే కేసీఆర్ అన్నట్లు మనకే కాదు, దేశానికి పెను ప్రమాదం అంటూ వాపోతున్నారు.
‘కర్ణుని లాగే ద్రౌపదీముర్ము’ హృదయం కూడా కృతజ్ఞతా భావంతో నిండి ఉంటుంది! ‘దుర్యోధనుడు ఎలాంటివాడైతే నాకేంటి? నన్నీ స్థితికి ఎక్కదీసిన వాళ్లకోసమే నేను శ్రమిస్తాను’ అనుకునే కర్ణుడి వంటి కృతజ్ఞతా స్వభావులు ద్రౌపదీ ముర్ము. అందుకేనేమో ఆమెను రాష్ట్రపతిని చేస్తే మోదీ రబ్బరుస్టాంపుగా వ్యవహరిస్తారు. తస్మాత్ జాగ్రత్త! అంటూ దీర్ఘదర్శి అయిన కేసీఆర్తోపాటు దేశవ్యాప్తంగా గల పలువురు రాజకీయ విశ్లేషకులు కూడా హెచ్చరిస్తున్నారు.
అందుకే వివిధ పార్టీల ప్రజా ప్రతినిధులారా! బాగా ఆలోచించండి! వ్యక్తిగతంగా కాక, సామాజిక దృక్పథంతో ఆలోచించండి. అధ్యయనశీలి, ముందుచూపు కలిగిన కేసీఆర్ ప్రబోధించినట్లు మీ ఆత్మప్రబోధంతో రాష్ట్రపతి అభ్యర్థిని ఎంచుకోండి. మీ దేశభక్తిని చాటుకోండి.
-పాతూరి వేంకటేశ్వరరావు 98490 81889