సమర్థ మానవ వనరుల నిర్మాణానికి విద్య అత్యంత కీలకమైనది. విద్యార్జనకు కేంద్ర బిందువు పాఠశాల. ఇక్కడ
అభ్యసించే పాఠ్య, సహ పాఠ్యాంశాలు విద్యార్థి మానసిక, శారీరక అభివృద్ధికి ఎంతగానో తోడ్పడతాయి. పాఠశాల
విద్య గుణాత్మక మెరుగుదలకు దోహదకారి కావాలన్నదే ఎన్సీఈఆర్టీ ఏర్పాటు వెనుక ప్రధాన లక్ష్యం. ఇది దేశవ్యాప్తంగా పాఠ్యపుస్తకాల ప్రచురణ, వినూత్న విద్యా పద్ధతుల అభివృద్ధి ఉపాధ్యాయుల శిక్షణ తదితర బాధ్యతలను నిర్వహిస్తుంటుంది. రాష్ట్రస్థాయిలో ఎస్సీఈఆర్టీ ఈ బాధ్యతలు నిర్వహిస్తున్నది.
ఇటీవల నూతన జాతీయ విద్యా విధానం (ఎన్ఈపీ) ప్రకారం నేషనల్ కౌన్సిల్ ఆఫ్ ఎడ్యుకేషనల్ రిసెర్చ్ అండ్ ట్రైనింగ్(ఎన్సీఈఆర్టీ)చేపడుతున్న పాఠ్యాంశాల సవరణ తీవ్ర వివాదాస్పదమౌతున్నది. కేంద్ర ప్రభుత్వం చరిత్రను, వాస్తవాలను మార్చేందుకు ప్రయత్నాలు చేస్తున్నదనే విమర్శలు కూడా వస్తున్నాయి. పుస్తకాల్లో గతేడాది ఎన్సీఈఆర్టీ ప్రకటించిన ‘పాఠ్యాంశాల హేతుబద్దీకరణ’ పేరిట పలు తరగతులకు చెందిన ముఖ్యమైన అంశాలను తొలగించడమే దీనికి నిదర్శనం. దీంతో ప్రభుత్వాల సంకుచిత విధానాలు పాఠ్యాంశాల్లోకి చొరబడుతున్నాయనే అనుమానం కలుగుతుంది. దేశంలో మత పరిస్థితులపై గాంధీజీ మృతి ప్రభావం, హిందూ-ము స్లిం ఐక్యతకు గాంధీ చేసిన కృషి, అది హిందూ అతివాదులకు నచ్చకపోవడం, గాంధీజీ హత్యకు గురైన సందర్భంలో ఆరెస్సెస్పై కొంతకాలం పాటు విధించిన నిషేధం వంటి అంశాలు 12వ తరగతి పొలిటికల్ సైన్స్ పుస్తకాల నుంచి మా యం అయ్యాయని నిపుణులు పేర్కొంటున్నారు.
వాస్తవంగా గాంధీజీ మన మధ్య ప్రస్తుతం లేకున్న ఆయన ఆచరించిన, ప్రబోధించిన స త్యం, అహింస, సహనం వంటి సూత్రాలు కొం తవరకు విద్యార్థి మూర్తిమత్వాన్ని ప్రభావితం చేస్తున్నాయి. అదేవిధంగా మొఘల్ సామ్రాజ్యం చాప్టర్లను ఎన్సీఈఆర్టీ తొలగించింది. 12 తరగతి చరిత్ర పుస్తకంలో ‘థీమ్స్ ఆఫ్ ఇండియన్ హిస్టరీ పార్ట్-2’లో ‘కింగ్ అండ్ క్రానికల్స్ : ది మొఘల్ కోర్ట్స్’ చాప్టర్లను ఉపసంహరించారు. 11వ తరగతి సోషియాలజీ పుస్తకంలో ‘అండర్స్టాండింగ్ సొసైటీ’లో..మతం, వర్గం, జాతులు ప్రజలను ఏవిధంగా విడదీస్తా యి? అనేదానికి గుజరాత్ అల్లర్లను ఉదాహరణగా చూపిన పేరాగ్రాఫ్ను తొలగించారు. ఎమర్జెన్సీ, ప్రచ్ఛన్నయుద్ధం, నక్సలైట్ ఉద్యమం తొలగించారు. 2002 మత హిం సకు సంబంధించిన అంశాలను కూడా తీసివేశా రు. ఇలాంటి చర్యల వల్ల బాలల్లో దేశ సమైక్యత, లౌకిక స్ఫూర్తి కొరవడి సంకుచిత భావజాలం అభివృద్ధి చెందనున్నది.
ఇప్పటికే నూతన విద్యా విధానం-2020 పై పలు విమర్శలున్నాయి. ఇప్పుడు చరిత్ర, రాజనీతి, సామాజిక శాస్ర్తాల పాఠ్యపుస్తకాల్లో తలపెడుతున్న మార్పులు చేర్పులు విద్యావేత్తలను నిర్ఘాంతపరుస్తున్నాయి. మరోవైపు చిన్నారుల్లో తార్కిక ఆలోచనలకు కేంద్ర బిందువైన డార్విన్ సిద్ధాంతం తొలగించడం విజ్ఞాన శాస్ర్తాన్ని అపహస్యం చేయడమేనని శాస్త్రవేత్తలు అభిప్రాయపడుతున్నారు. ఎన్సీఈఆర్టీ పదవ తరగతి సిలబస్ నుంచి డార్విన్ జీవపరిణామాల క్రమం, పునరుత్పత్తి పాఠ్యాంశాలు తొలగించడం మరో వివాదం గా మారింది. ఇందుకు అభ్యంతరం తెలుపు తూ పలువురు శాస్త్రవేత్తలు, సైన్స్ అధ్యాపకులు, మేధావులు ప్రభుత్వానికి బహిరంగలేఖ రాశారు. శాస్త్రీయ దృక్పథం అలవరచుకోవడానికి డార్విన్ సిద్ధాంతం ఎంతో ఉపకరిస్తుందని, అందువల్ల దీన్ని సెకండరీ స్థాయి పుస్తకాల్లో ఉంచాలని శాస్త్రవేత్తలు కోరారు. డార్విన్ పరిణామ క్రమాన్ని తొలగిస్తే భావి తరాలకు జీవుల పుట్టుక, ఆవిర్భావం గురించి ఏమి చెప్పాలనేది ఇప్పుడు ప్రధానమైన ప్రశ్న. దీనికి సైతం దైవత్వం, ఆధ్యాత్మికతతో ముడి పెడతారేమోనని అనుమానం పలువురిలో రేకెత్తుతున్నది. శాస్త్రీయ పరిష్కారాన్ని చూపిన ఈ సిద్ధాం తం జీవ శాస్త్రంలో నూతన దృ క్కోణాన్ని చూపింది. తొలగింపు పై ప్రభుత్వం పునరాలోచించాల్సిన అవసరం ఉందంటున్నా రు. చరిత్ర ద్వారా భవిష్యత్తు ను నిర్మించుకుంటారు. మానవాళి బంగారు భవిష్యత్తుకు దారి చూ పేది విజ్ఞాన శాస్త్రం. ఈ నేపథ్యం లో ఎన్సీఈఆర్టీ పాఠ్యాంశాల హేతుబద్ధీకరణ పేరుతో పాఠ్యపుస్తకాల్లో ఇష్టారీతిన మార్పులు చేయడం వల్ల పునాదులు లేని నవతరం తయారవుతుందని విద్యావేత్తలు అభిప్రాయపడుతున్నారు.
మన దేశంలో విద్య ఉమ్మడి జాబితాలో ఉన్న ది. విద్యావ్యవస్థలో జాతీయస్థాయిలో చోటుచేసుకున్న మార్పులు రాష్ర్టాల్లో కూడా ప్రభావితం చేయనున్నాయి. ఇప్పటికే జాతీయ విద్యావిధా నాన్ని పలు రాష్ర్టాలు వ్యతిరేకిస్తున్నాయి. ఈ తరుణంలో ఇలాంటి సహేతుకం కాని మార్పులు విద్యార్థుల, ఉపాధ్యాయులు, తల్లిదండ్రుల్లో గం దరగోళాన్ని సృష్టిస్తున్నాయి. సీబీఎస్ఈ అనుబంధ పాఠశాలల్లో దేశవ్యాప్తంగా కోట్లాదిమంది విద్యార్థులు ఎన్సీఈఆర్టీ పాఠ్యపుస్తకాలు అభ్యసిస్తున్నారు. వీరంతా సంకుచిత భావజాలాల్లో కూరుకుపోయే ప్రమాదం ఉన్నది. కావున లౌకిక ప్రజాస్వామ్య దేశంలో పాఠ్యాంశాల మార్పులు చేర్పుల్లో పక్షపాత ధోరణి వీడాలి. విద్యార్థి సం ఘాలు, పౌరసమాజం భాగస్వామ్యంతో చర్చిం చి సమాజ అవసరాలకు అ నుగుణంగా పాఠ్యాంశాల ప్ర క్షాళన చేయడానికి కార్యాచర ణ రూపొందించాలి. ప్రభుత్వాలు తమ విధానాలకు అ నుగుణంగా పాఠ్యాంశాల్లో మార్పులు చేయకూడదు. వీటి రూపకల్పనలో మేధో మథనం జరిగినప్పుడే పోటీ ప్రపంచంలో దేశభవితకు చుక్కానిలా నిలిచేలా మన పాఠ్యాంశాలుంటాయి.
సంపతి రమేష్ మహారాజ్: 79895 79428