అఫ్ఘానిస్థాన్ నుంచి సెప్టెంబర్ 11 నాటికి అమెరికా కూటమి సైన్యాన్ని ఉపసంహరించుకుంటున్న నేపథ్యంలో భారత్ వెంటనే అప్రమత్తం కావలసిన పరిస్థితి ఏర్పడింది. అఫ్ఘానిస్థాన్లో ప్రభుత్వమంటూ నామమాత్రంగానైనా ఉన్నదీ అంటే అది అమెరికా సైన్యం మద్దతుతోనే. కొన్ని పట్టణాలు ప్రభుత్వ ఆధీనంలో ఉన్నప్పటికీ, గ్రామీణ ప్రాంతాల్లో తాలిబన్ శాసనమే అమలవుతున్నది. అమెరికా వైమానిక దాడులకు దిగుతుందనే భయంతో ఇంతకాలం కొన్ని పట్టణాలనైనా తాలిబన్ వదిలి పెట్టింది. ఇప్పుడు ఆ భయం పోవడంతో సైనిక స్థావరాలపై దాడులను ప్రారంభించింది. అఫ్ఘానిస్థాన్ దక్షిణ ప్రాంతంలోని హెల్మాండ్ రాష్ట్రంలో సాగుతున్న దాడి ఇందుకు ఉదాహరణ. అఫ్ఘాన్ ప్రభుత్వం అమెరికా వెళ్లిపోయే వరకు నిలదొక్కుకున్నా, ఆ వెంటనే కూలిపోవడం ఖాయమనిపిస్తున్నది.
వచ్చే సెప్టెంబర్ పదకొండవ తేదీ నాటికి అమెరికాలోని డబ్ల్యుటీవో టవర్స్పై ఉగ్రవాద దాడి జరిగి సరిగ్గా రెండు దశాబ్దాలవుతుంది. ఈ దాడుల నేపథ్యంలోనే అఫ్ఘానిస్థాన్పై అమెరికా సైనిక చర్యకు దిగింది. కానీ ఈ సుదీర్ఘ కాలంలో తాలిబన్ను కట్టడి చేయలేక పోగా, తాను భారీ యుద్ధంలో కూరుకుపోయింది. ఇప్పుడు ఈ ఊబి నుంచి పరువు దెబ్బతినకుండా ఎలా బయటపడాలనేదే అమెరికా ప్రధాన లక్ష్యంగా మారిపోయింది. చివరికి గత్యంతరంలేక తన ప్రయోజనాల పరిరక్షణ కోసం తాలిబన్తోనే ఒప్పందం కుదుర్చుకుని సైనికులను ఉపసంహరించుకుంటున్నది. అమెరికా వెళ్లి పోవడాన్ని తన విజయంగా తాలిబన్ చిత్రీకరించుకోవడం ఖాయం. ఇరువై ఏండ్ల కిందటికి ఇప్పటికి తాలిబన్ మారిపోయిందనేది కొంద రి వాదన. కానీ కరడుగట్టిన మతఛాందస భావాలు గల తాలిబన్ తన మౌలిక సిద్ధాంతాలను మార్చుకుంటుందా అనేది సందేహమే.
అమెరికా వైదొలిగిన వెంటనే ఈ ప్రాంత భౌగోళిక రాజకీయాలు మారిపోతాయనేది స్పష్టం. ఈ మేరకు రష్యా, చైనా, ఇరాన్, పాకిస్థాన్ మొదలైన దేశాలు ఇప్పటికే పావులు కదుపుతున్నాయి. పలు దేశాలు తాలిబన్తో ఇప్పటికే అవగాహనకు వచ్చాయి. మధ్య ఆసియా దేశాలతో చైనా చర్చలు జరుపుతున్నది. పాకిస్థాన్ సైన్యాధ్యక్షుడు బజ్వా, గూఢచార సంస్థ ఐఎస్ఐ అధినేత ఫైజ్ హమీద్ ఇప్పటికే అఫ్ఘానిస్థాన్ వెళ్లి వచ్చారు. భారత్ ఇప్పటివరకు అఫ్ఘాన్ ప్రభుత్వంతో స్నేహ సంబంధాలను నెరిపిందే తప్ప తాలిబన్తో చర్చలు జరపలేదు. అమెరికా దళాల ఉపసంహరణ అనంతర పరిస్థితుల్లో మన దేశం రెండు రకాల జాగ్రత్తలు తీసుకోవలసి ఉన్నది. అందులో ఒకటి- మన దేశ భద్రతకు సంబంధించినది. తాలిబన్ సాధించిన విజయం ఉగ్రవాదులకు ఊపు ఇవ్వవచ్చు. ఈ పరిస్థితిని పాకిస్థాన్ ఉపయోగించుకోవచ్చు. రెండవది- మధ్య ఆసియా, దక్షిణాసియా రాజకీయాలపై ఈ ప్రభావం ఏ మేర ఉంటుందనేది కీలకం. ఈ పరిణామాల నేపథ్యంలో అఫ్ఘానిస్థాన్ శాంతి ప్రక్రియలో భారత్ తనవంతు పాత్ర పోషించాలి. భవిష్యత్తు పరిస్థితులకు అనుగుణంగా వ్యూహ రచన చేసుకోవాలి.