కల నిజమైందా లేదా? ఇవాళ తెలంగాణలో పండుతున్న ప్రతి వడ్ల విత్తులోని బియ్యం గింజను కడిగి చూడండి. అందులో కాళేశ్వరం తడి కనిపిస్తుంది. పారుతున్న పొలాన్ని అడిగి చూడండి. అందులో కాళేశ్వరం తడి కనిపిస్తుంది. గొంతులో జారుతున్న జలాన్ని అడగండి. అందులో కాళేశ్వరం తడి కనిపిస్తుంది. పులకిస్తున్న ప్రతి మట్టి రేణువులో, పచ్చబడ్డ ప్రతి ఆకులో కాళేశ్వరం తడి ఉంది. నిండిన చేదబావి, ఎగదన్నుతున్న బోరుబావి, గలగలల చెరువు గట్టు, చెంగున ఎగిరే చేప పిల్ల, దాపున ఊగే పచ్చని చెట్టు, నాగలి ఆగని సాగు భూమి, ఆగక పారే తుమ్మెద వాగు.. ఎక్కడైనా మనసుతో తడిమి చూడండి కాళేశ్వరం తడి తాకి తీరుతుంది. భూగర్భాన్ని తవ్వి తీసినా, భగీరథ ట్యాంకును తరచి చూసినా కాళేశ్వరం తడే! ఇప్పడు తెలంగాణ సాంతంగా తడిసింది. కాదంటామా? కాదనగలమా? కాళేశ్వరమనేది చిన్న కల కాదు. తెలంగాణ అనే సీతాకోక చిలుక మీద ఎన్ని రంగులున్నయో అన్ని రంగుల కల అది. బంగారు కల! కల ఎంత నిజమో… ప్రమాదమూ అంతే నిజం!
ఇంజినీర్లకు పాఠాల్లో చెప్తరట! ‘మీరెన్ని చేసినా, ఎంత ఫూల్ప్రూఫ్గా తయారు చేసినా, ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా, ప్రమాదమనేది జరుగుతూనే ఉంటది. ప్రమాదాన్ని నివారించడం అసాధ్యం. ప్రమాదాన్ని ఎదుర్కొనే పరిష్కారంకనుగొనటమే అసలు మార్గం’ అని!
మరిప్పుడు కాళేశ్వరం మునిగిపోయిందని ఎందుకింత గడబిడ చేస్తున్నరు? కాళేశ్వరంతో పచ్చబడ్డ నేలను ప్రస్తుతించరు గానీ, వానలకు మునిగితే మునిగిందని నిందలా? ఏమీ తెల్వని బడబడ సామి మొదలు, కేబినెట్ మంత్రిగా అన్నీ ఆమోదించిన ఆసామి, అన్నీ తనకే తెలుసనే ప్రొఫెసర్దాకా… బోడిగుండుకీ, మోకాలుకీ ముడిపెట్టినట్టు, కాళేశ్వరానికీ- భద్రాద్రి ముంపుకీ- బ్యాక్ వాటర్ మునకకీ లంకెపెడుతూ కొత్తకొత్త థియరీలు! ప్రపంచంలో వరదలు రావడం, పంపుహౌజులు మునుగుడు ఇదే మొదటిసారా? ఇంతకుముందెన్నడూ జరగలేదా? పంపుహౌజ్లు నదుల గట్టు మీద గాకుండా గుట్టల మీదుంటాయా?
2002లో ఊహించని వరద వచ్చి శ్రీశైలం డ్యాం దడదడలాడితే, కర్నూలంతా మునిగింది. తప్పు ఆ డ్యాం కట్టిన వాళ్లదా? అక్కడ కర్నూలు కట్టిన వాళ్లదా? అత్యంత సురక్షితం అనుకున్న వైజాగ్ హుద్హుద్తో హడలిపోతే అదెవరి తప్పు? దివిసీమ వరదలు ఎవరి తప్పు? ముంబై ప్రతి ఏటా మునుగుతున్నది. అది ఎవరి తప్పు? చినుకు పడితే చెన్నై గజగజలాడుతున్నది. అదెవరి తప్పు?
కొన్ని మన పర్సెప్షన్ను, దృష్టికోణాన్ని బట్టి ఉంటాయి. 3 లక్షల క్యూసెక్కుల ప్రవాహాన్ని మాత్రమే తట్టుకునేలా, అప్పుడెప్పుడో నిజాం కాలంలో కట్టిన కడెం ప్రాజెక్టు 6 లక్షల క్యూసెక్కుల వరద వచ్చినా, ఆనకట్టపై నుంచి నీళ్లు పొర్లినా తట్టుకుంది. దీన్ని ప్రాజెక్టుకు అంచనాలు సరిగా లేవనీ అన్వయించవచ్చు. మన ఇంజనీర్లు అద్భుతం అనీ అభివర్ణించవచ్చు.
మొన్న మొన్న కట్టిన కాళేశ్వరం ప్రాజెక్టు బరాజ్లు, వందేండ్లలో ఎన్నడూ లేనంత వరద వచ్చినా తట్టుకుని నిలిస్తే, దాన్ని పొగడాలా? లేక పంపుహౌజ్లు మునిగిపోయాయని తెగనాడాలా? ఈ మాత్రం జ్ఞానం లేకపోతే ఎలా? ఇంకొకామె అంటుందీ.. ‘మా నాన్న దేవాదుల కడితే, మునక సమస్యే రాలేదు’ అని. అదీ సంగతి. దేవాదులను ఎట్లా కట్టినారంటే… ఇంటేక్ వెల్లోకి కూడా నీళ్లు రానంత ఎత్తుగా! దేవాదుల మూడు పంపుల్లో ఒక్కటీ పూర్తిగా పని చేయనంత గొప్పగా! అదీ వారి తెలివి. అందుకే కదా ఇప్పుడక్కడ కేసీఆర్ మళ్లీ బరాజ్ కట్టాల్సి వస్తున్నది.
నీళ్లు పక్కనే ఉంటే మలుపుకుంటం. ఎత్తున ఉంటే కాల్వల్తో పారించుకుంటం. లోతుల ఉంటే తవ్వి తీసుకుంటం. ఎడారిలో ఉంటే నిల్వ చేసుకుంటం. వర్షపు నీళ్లను ఒడిసి పట్టుకుంటం. పారే నీళ్లకు అడ్డుకట్ట వేస్తం. నీళ్లే జీవితం, అందుకే నీళ్ల పక్కనే నగరం వెలిసింది. నాగరికత మెరిసింది. నీళ్లు కొన్నిసార్లు ఉచితంగా రావచ్చు. కొన్నిసార్లు వంద ఖర్చుపెడితే తప్ప రాకపోవచ్చు. ఆవుల్ని మలిపినోడు అర్జునుడు. నీళ్లను మలిపినోడు కేసీఆర్. ప్రాజెక్టులు కట్టకపోతే మునుగుతమా? కడితే మునుగుతమా? పంపుహౌజ్లు మునుగుతయని ప్రాజెక్టులు కట్టుకోకుండ ఉంటమా?
కాళేశ్వరం కట్టాల్సింది అక్కడ కాదు; ఆర్థికంగా వయబుల్ కాదు; బోలెడంత కరెంటు కావాలి; కమీషన్లు, అవినీతి జరిగింది.. ఈ ఆరోపణలన్నింటికీ కాలం చెల్లిపోయింది. ఇప్పడు పంప్హౌజ్లు మునిగాయని కొత్త లొల్లి. 36 ఏండ్లలో ఎన్నడూ లేనంత వానపడి, వందేండ్లలో ఎన్నడూ లేనంత వరద వచ్చి మన్నూ మిన్నూ ఏకమై, చిన్న అవాంతరం ఒకటి ఏర్పడితే, ‘దొరికిండుర బిడ్డ చూసుకుందాం, బాయిల పడ్డోని మీద బండెడు రాళ్లేద్దాం’ అన్నట్టుగా ఉన్నది ఈ వరుస. ఎడతెరిపి లేని వానలతో జనం అవస్థ పడుతుంటే, కాళేశ్వరాన్ని బోనులో నిలబెట్టే కుట్రలు. ఇదంతా ఎందుకు… వద్దా… కాళేశ్వరం వద్దా? కట్టొద్దా? దమ్ముంటే ఆ మాట అంటే తెలంగాణ జనమే జవాబు చెప్తరు కదా!
పార్లమెంటులో కాంగ్రెస్ ఎంపీ ప్రశ్న అడుగుతడు. బీజేపీ మంత్రి జవాబిస్తడు. ఇద్దరిదీ ఒకటే ఉద్దేశం. ‘జాతీయ హోదా లేదు. అనుమతులు తీసుకోలేదు.’ అని! ఇవే పార్టీలు, ఈ పార్టీల ప్రభుత్వాలే, ఇలాంటి నేతలే, ఉమ్మడి రాష్ట్రంలో తెలంగాణకు లాభం కలిగించే చోట ప్రతిపాదించిన ప్రాజెక్టులన్నింటినీ మార్చిన్రు. మన పొలం కాడి నీళ్లను తన్నుకుపోయిన్రు. కృష్ణా గోదావరి మీద మహారాష్ట్ర, కర్ణాటక రాష్ర్టాలు బరాజ్ల మీద బరాజ్లు కట్టి మనకు నీళ్లు రాకుండా ఆపితే అడిగిన దిక్కు లేదు. ఆపిన లెక్క లేదు. నిజాం ప్రతిపాదించి, ప్లానింగ్ కమిషన్ కూడా ఆమోదించిన వెయ్యి టీఎంసీల ఇచ్చంపల్లిని కట్టకపోతే అడిగినోడు లేడు. ఇప్పుడు మాత్రం కట్టిన కాళేశ్వరం మీద కారాలు, మిరియాలు. కట్టినోళ్ల మీద రాళ్లు!
విపత్తు చెప్పి వస్తుందా? ప్రాకృతిక విపత్తు నుంచి కొంత రక్షించుకోగలం గానీ దాన్ని పూర్తిగా ఆపే తెలివితేటలు మానవమాత్రులకు ఇంకా రాలేదు! ప్రకృతి ముందు మనం ఎంతటోళ్లం! మనిషి ఎదిగేందుకు ప్రయత్నం చేస్తడు. కొంత ఎదుగుతుంటడు. అంతమాత్రాన కష్టమో నష్టమో లేని జీవితం ఉండదు. ప్రకృతితో సహజీవనం చేయాల్సిందే! పాఠాలు నేర్చుకుని ముందుకు సాగాల్సిందే. ప్రాకృతిక విపత్తుకి మనిషిని బాధ్యుడిని చేయాలనుకునే దుర్మార్గమే దారుణం. కాళేశ్వరాన్ని వేలెత్తి చూపితే దాన్ని రాజకీయమని సరిపెట్టుకోలేం. అతి స్వల్పకాలంలో, 50 డిగ్రీల ఎండలో, భయపెట్టే వరదల్లో రాత్రింబవళ్లు పనిచేసి కాళేశ్వరం కట్టిన తెలంగాణ ఇంజినీర్లను అవమానించడమే ఇది. ట్రాజెడీ షుడ్బీ యుటిలైజ్డ్ యాజ్ ఏ సోర్స్ ఆఫ్ స్ట్రెంగ్త్ అంటుంది టిబెటన్ సామెత. ప్రాణనష్టం జరగలేదు. ఆస్తినష్టం జరగలేదు. పంపులు మునిగినయ్. దానికింత రాద్ధాంతమా?
ఒకవేళ అది కూడా జరగకూడదనే అనుకుందాం. ఇప్పుడున్న పార్టీ, అప్పుడున్న పార్టీలే కదా… ఈ ప్రాంతాన్ని ఎక్కువ కాలం ఏలింది? కాళేశ్వరం కట్టాల్సిన అగత్యమే లేకుండా ఆయా పార్టీలు అప్పుడే ప్రాజెక్టులు కట్టి, తెలంగాణలో ప్రతి ఎకరాకూ నీళ్లు పారించి ఉంటే, ఇప్పుడీ ముంపు సమస్యే ఉత్పన్నమయ్యేది కాదు కదా! పాపం… తెలంగాణ మునిగిపోతుందనే భయం తో కామోసు ప్రాజెక్టులే కట్టలేదు!
తెలంగాణకు వారసత్వంగా వచ్చిన వేలాది చెరువుల్ని ఒక్కనాడూ పట్టించుకోని దిక్కులేని మొహాలు పంపుహౌజ్ మునిగిందని ఏడ్వడం చూస్తుంటే నవ్వొస్తున్నది. ఆంధ్రా ప్రాజెక్టులకు హారతి పట్టి, జాతీయ హోదాలిచ్చి కూడా గడువులోగా పూర్తి చేయలేని వాళ్లకు, మూడున్నరేండ్లలోనే తెలంగాణ ప్రాజెక్టు పూర్తి చేసుకుందే అనే ఏడుపు, బాధ సహజం.
మనకు ఏదైనాకష్టం వచ్చినప్పుడు మనోడే అనుకున్నోడు వెంటనిలవాలి. అట్లాకాకుండా నవ్వితే మనసు బాధ పడుతుంది. కానీ ఎవరో నవ్వినంత మాత్రాన నడక ఆగదు. కొన్నిసార్లు కాలమే కావాలని కొన్ని పరీక్షలు పెడుతుంటది. ఎవరు ఎటువైపో దాంతో తేలిపోతుంది. నీళ్ల గోలెంలో పడిన నక్కకు పులిచారలు చెరిగిపోయి అసలు సంగతి బయటపడ్డట్టు.. ఇప్పుడు కాళేశ్వరం నీళ్లల్లో పడ్డ నేతల అసలు రంగులు బయట పడుతున్నాయి. ఎవరు తెలంగాణ వైపో, ఎవరు తెలంగాణ వ్యతిరేకుల వైపో కాళేశ్వరుడి సాక్షిగా రోజురోజుకూ తేటతెల్లమవుతూనే ఉన్నది. దొంగలకు సద్ది మోసే దోషులెవరనేది ఈ వాన, వరద కడిగి మరీ చూపిస్తున్నది. ఏ చిలక ఏ గూటిలో చేరిందో, ఎవరి మాటలు పలుకుతున్నదో వినవస్తూనే ఉన్నది. మనం బాగుపడితే ఓర్వలేనివాళ్లకు వంత పాడే తెలివితేటలు కొందరి సొంతం. ఏం చేస్తాం, మన ఖర్మ!
– తిగుళ్ల కృష్ణమూర్తి