‘పార్టీ నుంచి వలసలకు నేనే కారణమన్నారు. మునుగోడులో పార్టీ ఓటమిలో అభ్యర్థి తప్పేమీ లేదు, అధ్యక్షుడే సరిగ్గా ప్లాన్ చేయలేదంటున్నారు. మంత్రి గంగుల ఇంటిపై ఈడీ దాడి చేస్తే సొంత జిల్లా నేతలపై దాడి చేయిస్తారా? అని నిందిస్తున్నారు. చివరికి ఖమ్మం జిల్లాకు చెందిన ఎంపీ రవిచంద్ర గ్రనైట్ వ్యాపార సంస్థలపై ఈడీ దాడులను నాకే అంటగడుతూ సొంత సామాజికవర్గం మున్నూరుకాపు నేతలపై దాడులు చేయిస్తారా? అని ప్రశ్నిస్తున్నారు. మరోవైపు బీసీ అయి ఉండి బీసీ నేతలపై దాడులు చేయిస్తారా? అని నిరసన ప్రదర్శనలు చేస్తున్నారు. ఏది జరిగినా బీజేపీలో తాను ఒక్కడినే ఉన్నట్టు, అన్నింటికీ నేనే కారణం అయినట్టు ఇంటా, బయటా తననే టార్గెట్ చేస్తున్నా… ఎందుకు స్పందించడం లేదు’ అని రాష్ట్ర బీజేపీఅధ్యక్షుడు బండి పార్టీ నేతలపై చిర్రుబుర్రులాడుతున్నారట.
హుజూరాబాద్ ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థి డిపాజిట్ కోల్పోవడం పట్ల గల్లీ నుంచి ఢిల్లీ దాకా టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్రెడ్డి వైఫల్యంపై తీవ్రస్థాయిలో కాంగ్రెస్ శ్రేణు లు విరుచుకుపడ్డాయి. తాజాగా మునుగోడు ఉప ఎన్నికలోనూ అదేమాదిరిగా కాంగ్రెస్ డిపాజిట్ కోల్పోయింది. మునుగోడులో కాంగ్రెస్ గెలువడం చారిత్రక అవసరం. కనికరించండి ప్లీజ్ అని రేవంత్రెడ్డి కన్నీళ్లతో వేడుకున్నా ఫలితం లేకపోయింది. ఈ ఓటమిపై పార్టీ నేతలు స్పందించకముందే ‘ఓట్లు ఎన్ని వచ్చాయన్నది ముఖ్యం కాదు, ఎంత చిత్తశుద్ధితో కష్టపడ్డారన్నదే ముఖ్యం’ అంటూ రేవంత్రెడ్డి కొత్త పల్లవి అందుకున్నారు. మునుగోడు ఫలితంపై ఏమంటారని పార్టీ సీనియర్ నేత వీహెచ్ను మీడియా ప్రశ్నిస్తే, అధ్యక్షుడే అలా అన్నాక, ఇక మేం అనడానికి ఏముందని ఎదురు ప్రశ్నించారు.
– వెల్జాల