పంటలు పండించే రైతే ముఖ్యమంత్రిగా ఉన్న తెలంగాణలో రైతురాజ్యం ఆవిర్భవించటంలో ఆశ్చర్యమేమున్నది. దేశంలోనే తెలంగాణలో రైతుల ఆత్మహత్యలు గణనీయంగా తగ్గాయన్న కేంద్రం ప్రకటనను ఈ నేపథ్యంలోనే అర్థం చేసుకోవాలి. రైతుల ఆత్మహత్యల రేటు తగ్గుదలలో తెలంగాణ ప్రథమ స్థానంలో ఉందని, ఆ తర్వాత బీజేపీ పాలిత మధ్యప్రదేశ్ ఉన్నదని లోక్సభలో కేంద్ర ప్రభుత్వం స్పష్టం చేసింది. రైతులు ఎవరైనా వ్యక్తిగత కారణాల రీత్యా బలవన్మరణానికి పాల్పడినా బాధాకరమే. కానీ వ్యవసాయ సంక్షోభం మాత్రం రాష్ట్రంలో లేదని చెప్పవచ్చు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వ్యవసాయ సంక్షోభానికి నిలువెత్తు నిదర్శనంగా నిలిచిన తెలంగాణ ప్రాంతం నేడు దేశంలోనే అత్యధికంగా వరి పండించే రాష్ట్రంగా ఎదిగిందనేది వాస్తవం.
రైతు సంక్షేమ రాష్ట్రంగా తెలంగాణ మారడం హఠాత్తుగా జరిగింది కాదు. రాష్ట్ర అవతరణ నాటినుంచి ముఖ్యమంత్రి కేసీఆర్ అనేక చర్యలు తీసుకున్నారు. రైతులకు 24 గంటలపాటు నాణ్యమైన కరెంటును ఉచితంగా అందిస్తున్నారు. సాగునీటి ప్రాజెక్టుల నిర్మాణంతో తెలంగాణ రైతులు కలలో కూడా ఊహించని రీతిలో కాల్వలను పంటపొలాల వద్దకే తీసుకొచ్చారు. చెరువుల పూడికతీత వంటి ఇతర చర్యలతో భూగర్భ జలమట్టం కూడా గణనీయంగా పెరిగి నీళ్లకు కొదవలేకుండా పోయింది. ఉమ్మడి రాష్ట్రంలో విత్తనాలు, ఎరువుల కోసం ఎర్రటి ఎండల్లో గంటలకొద్దీ క్యూలైన్లలో వేచిచూసిన దుస్థితి ఇప్పుడు లేదు. మౌలిక సదుపాయాలు కల్పించటమేగాక పంట పెట్టుబడి కోసం వడ్డీవ్యాపారుల మీద ఆధారపడకుండా 2018లో రైతుబంధు పథకాన్ని తీసుకొచ్చారు. ఈ వినూత్న పథకం పశ్చిమబెంగాల్, ఒడిశా తదితర రాష్ర్టాలకే కాదు.., ఏకంగా కేంద్ర ప్రభుత్వానికీ దిశానిర్దేశం చేసింది.
ఈ విధంగా పంటలు పండించేంత వరకే కాదు, ఆ తర్వాత కూడా ప్రతి దశలో రైతులకు రాష్ట్ర ప్రభుత్వం అండగా ఉంటున్నది. రైతులు ఐక్యంగా లేకపోవటం వల్లే దళారుల దోపిడీకి గురవుతున్నారని, వారిలో ఐక్యతను, సాగు మెళకువలను, మార్కెటింగ్ నైపుణ్యాలను పెంచాలన్న లక్ష్యంతో దాదాపు రూ.600 కోట్ల వ్యయంతో 2600కు పైగా రైతువేదికలను నిర్మించింది. క్రాప్ కాలనీల వంటి వినూత్న వ్యూహాలపై కూడా కసరత్తు చేస్తున్నది. వ్యవసాయంతో అనుసంధానమై ఉండే ఫుడ్ ప్రాసెసింగ్ పరిశ్రమలను నెలకొల్పుతున్నది. రాబోయే డిమాండ్ను గుర్తించి పంటలు వేయడం, మార్కెటింగ్ చేసుకోవడం మొదలైనవన్నీ ఎంతో సమన్వయంతో జరగవలసినవి. ప్రభుత్వం చేస్తున్న ఈ కృషిలో రైతులు మరింతగా భాగస్వాములు కావాలి. కాలానికి తగ్గట్లుగా వ్యవసాయ విధానాలను మార్చుకోవాలి. వ్యవసాయాన్ని పరిశ్రమ స్థాయికి తీసుకెళ్లి ధనిక రైతులుగా ఎదగాలి. దేశానికే ఆదర్శంగా తెలంగాణ రైతులు నిలవాలి.