కరోనా కారణంగా లాక్డౌన్ విధించడంతో గత రెండేండ్లలో వ్యాపారాలు పూర్తిగా నడవలేదు. దీం తో ప్రభుత్వానికి పన్నుల రూపంలో వచ్చే ఆదా యం పడిపోయి ఒక దశలో ప్రభుత్వ ఉద్యోగులకు జీతాలు ఇవ్వలేని పరిస్థితి కూడా ఏర్పడింది. ఏ ప్రభుత్వమైనా తమ నిధులను తగువిధంగా ప్రజల అవసరాలకు వినియోగించడం జరుగుతుంది. ఆరు దశాబ్దాలకుపైగా సాగిన వలస పాలనలో అన్యాయానికి గురైన తెలంగాణ సమాజాన్ని అభివృద్ధి చేయాలని ముఖ్యమంత్రి కేసీఆర్ ఎన్నోరకాల సంక్షేమ పథకాలను అమలు చేస్తున్నారు. సంక్షేమ పథకాలకు తోడుగా, కాళేశ్వరం నీటి పారుదల ప్రాజెక్టు వంటి అభివృద్ధి పథకాలనూ చేపట్టారు.
తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన వెంటనే ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలను ముఖ్యమంత్రి కేసీఆర్ ఏ మాత్రం ఆపలేదు. వీటికితోడు కరోనా సమయంలో కొత్త పథకాల ద్వారా ఆదుకోవడం విశేషం. పేద ప్రజలకు ఇస్తున్న రూపాయి కిలో బియ్యాన్ని కరోనా సమయంలో పూర్తిగా ఉచితంగా ఇచ్చారు. వివిధ రాష్ర్టాల నుంచి ఉపాధి కోసం తెలంగాణ రాష్ర్టానికి వలసవచ్చిన కార్మికులకు కూడా ఉచిత బియ్యం ఇచ్చి వారు తెలంగాణ రాష్ట్ర అభివృద్ధిలో భాగస్వాములు అని చెప్పి ఇతర రాష్ర్టాల ముఖ్యమంత్రులకు ఆదర్శంగా నిలిచారు. కరోనా అని బయటికి రావడానికే అందరూ భయపడుతున్న సమయంలో తమ ప్రాణాలను కూడా లెక్కచేయకుండా ప్రజా సేవ చేసిన పారిశుద్ధ్య కార్మికులకు, పోలీసులకు, ఆరోగ్యశాఖ సిబ్బందికి అదనంగా వేతనం ప్రకటించారు. ప్రభుత్వ ఉద్యోగులకు ఇటీవల వేతనాలు పెంచారు.
లాక్డౌన్ వల్ల పాఠశాలలు మూతపడటంతో, ఏ రాష్ట్రంలోనూ లేనివిధంగా ప్రైవేటు పాఠశాలలో పనిచేస్తున్న దాదాపు మూడు లక్షల మంది బోధన, బోధనేతర సిబ్బందికి నెలకు రూ.2000తోపాటు 25 కేజీల బియ్యాన్ని ఉచితంగా అందజేసిన ఏకైక ముఖ్యమంత్రి కేసీఆర్. బడుగు బలహీనవర్గాల వారికి ఆసరాగా ఉండాలనే ఉద్దేశంతో దోబీఘాట్లకు, సెలూన్ షాపులకు నెలకు 250 యూనిట్ల వరకు ఉచిత కరెంటు ఇవ్వాలని నిర్ణయించారు. ఆపద్బంధు పథకం పేరు మీద యువతకు నైపుణ్యం పెంచడం కోసం, మహిళా స్వావలంబన కోసం వంద కోట్లతో నూతన పథకాలను ప్రారంభించారు. గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో గతంలో ఐదు రూపాయలకు ఇచ్చే అన్నపూర్ణ భోజనాన్ని కూడా పూర్తి ఉచితంగా అందిస్తున్న ఘనత తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానిది. రైతులు పండించిన పంటకు సరైన మద్దతు ధరతో ప్రతి గింజను ప్రభుత్వమే కొనుగోలు చేస్తున్నది.
వైద్య విద్యను బలోపేతం చేయాలన్న ఉద్దేశంతో రాష్ట్రవ్యాప్తంగా ఏడు నూతన ప్రభుత్వ వైద్య కళాశాలలు ఏర్పాటుచేయాలని ముఖ్యమంత్రి నిర్ణయించారు. జూనియర్ డాక్టర్లు తమ సమస్యలను దృష్టికి తెచ్చిన వెంటనే 15 శాతం స్కాలర్షిప్ పెంచి వారి కోరికను నెరవేర్చారు. ప్రజలకు ఇస్తున్న టీకాపై పన్ను తగ్గించడానికి కూడా కేంద్రం అంగీకరించని సమయంలో రాష్ట్రంలోని ప్రజలు అందరికీ ఉచితంగా ఇస్తామని ప్రకటించారు మన ముఖ్యమంత్రి కేసీఆర్. కరోనా సంక్షోభ సమయంలో రాష్ట్ర ప్రభుత్వానికి ఆర్థికపరమైన భారం ఉన్నప్పటికీ ప్రజల సంక్షేమమే ముఖ్యమని ముందుకుసాగుతున్నారు. ఇది ముఖ్యమంత్రి కేసీఆర్కు ప్రజల సంక్షేమం పట్ల ఉన్న చిత్తశుద్ధికి నిదర్శనం.
కిశోర్ గౌడ్