రాష్ట్రంలో 2021 వార్షిక వ్యవసాయం జూన్ నుంచి మొదలవుతుంది. ఈ నేపథ్యంలో సాగు విధానంలో విప్లవాత్మకమైన మార్పులు తీసుకురావాలని ముఖ్యమంత్రి కేసీఆర్ భావిస్తున్నారు. ఇటీవల ప్రగతిభవన్లో వ్యవసాయ అధికారులతో మొదటి పంట వార్షిక వ్యవసాయ విధానం గురించి చర్చించారు. ఈ సంవత్సరం కోటి ఎకరాల్లో వరి పండించేవిధంగా తెలంగాణ వ్యవసాయ అధికారులు సంసిద్ధత కావాలని ఆదేశించారు. వ్యవసాయ విధానంలో నూతన పద్ధతులను అవలంబించే విధంగా వ్యవసాయాధికారులు గ్రామీణ ప్రాంతాల్లో రైతులకు తగిన సూచనలివ్వాలని ఆదేశించారు.
వ్యవసాయ విధానంలో ముఖ్యంగా వరిసాగులో పాత పద్ధతులకు స్వస్తి పలకాలి. ఆధునికమైన వ్యవసాయ విధానంలో పంటలు సాగుచేయాలి. వరిసాగులో వెదజల్లే విధానం ఎంతో బాగుంటుందని దీనితో 30-35 శాతం ఖర్చు తగ్గుతుంది. దిగుబడి కూడా ఎక్కువ ఉంటుందని వ్యవసాయ నిపుణులు అంటున్నారు. ఇప్పటివరకు రాష్ట్రంలో ఈ విధానం అమలుచేయలేదు. ప్రస్తు త పరిస్థితుల్లో వ్యవసాయరంగానికి పెద్దగా ఇబ్బంది కలిగించే విషయం కూలీల కొరత. వరి నాట్లు సమయానికి వెయ్యలేకపోవడం, అధిక ఖర్చు కావడం తదితర కారణాల నేపథ్యంలో వెదజల్లే పద్ధతి స్వీకరించడం మంచిది. ఇబ్బందికరమైన పరిస్థితుల్లో ఉన్న రైతాంగానికి ఈ విధానాన్ని అనుసరించమని ప్రభుత్వం సూచిస్తున్నది. ఈ విధానం విప్లవాత్మకమైనదని చెప్పవచ్చు.
వెదజల్లే పద్ధతి ద్వారా రాష్ట్రవ్యాప్తంగా రైతులకు 10 వేల కోట్లు మిగులుతాయని అంచనా. ఈ విధానంతో ఒకటి రెండు క్వింటాళ్లు అధిక దిగుబడి వచ్చే అవకాశం ఉన్నట్లు నిపుణులు అంటున్నారు. నారుపోసే విధానం వల్ల ఎకరానికి మామూలుగానైతే 25 కిలోలు అవసరమైతే వెదజల్లే విధానానికి 8 కిలోలు అయితే సరిపోతుంది. భూమిని ఒకటికి రెండుసార్లు మెత్తగా దున్ని ఒక క్రమపద్ధతిలో మడిని చదును చేసుకునే విధంగా తగిన ఏర్పాట్లు చేసుకోవాలి. విత్తనాలను క్రమపద్ధతిలో మడిలో వెదజల్లిన తర్వాత నీళ్లు పెట్టుకోవాలి. ఇప్పటికే రాష్ట్రంలో వరి నాటే విధానానికి చాలామంది రైతులు స్వస్తి పలికారు.
ఆధునికమైన పద్ధతుల్లో వరి నాటే విధానం అమల్లోకి వచ్చిందని ముఖ్యంగా డ్రమ్స్ సిస్టం, నాగలి ద్వారా వేసే విధానం, వెదజల్లే విధానం ప్రస్తుతం అందుబాటులో ఉన్నాయని శాస్త్రవేత్తలు అంటున్నారు. ఈ తరహా వ్యవసాయ విధానం రాష్ట్రంలో అమలవుతున్నదని, ఎక్కువగా ఖమ్మం, వరంగల్, ములుగు, జనగామ జిల్లాల్లో ఆధునికమైన వెదజల్లే విధానాన్ని అనుసరిస్తున్నారని పలువురు శాస్త్రవేత్తలు వెల్లడించారు. ఈ ఆధునిక పద్ధతి ద్వారా రైతులకు చాలావరకు ఖర్చు తగ్గుతుందని దిగుబడి కూడా రెండు మూడు బస్తాలు అదనంగానే ఉంటుందని వారు చెప్తున్నారు. కాబట్టి రైతులు ఎక్కువ శాతం ఈ ఆధునిక వ్యవసాయ విధానాన్ని రైతులు వినియోగించుకోవడం మంచి ది. ప్రభు త్వం కూడా ఇందుకు కావాల్సిన సహాయ సహకారాలు తగు సూ చనలు సలహాలు అందించాలని భావిస్తున్నది. ఈ నేపథ్యంలోనే రైతులను చైతన్యవంతులను చేయాలని వ్యవసాయాధికారులకు కేసీఆర్ సూచించారు.
వ్యవసాయరంగంలో నానాటికి ఖర్చులు పెరుగుతున్నాయి. ముఖ్యం గా వ్యవసాయానికి ప్రధానంగా అవసరమయ్యేది నీరు. ఆ తర్వాత కూలీ ల సమస్య కూడా ఉంటుంది. కానీ ఆధునిక వ్యవసాయ విధానం అనుసరిస్తే ఈ సమస్యలు ఉండవు. కానీ ఈ కొత్త విధానాలు గ్రామీణ ప్రాంతాల్లో చాలామందికి తెలియదు. అందువల్లనే దీనినొక ప్రధానాంశంగా ముఖ్యమంత్రి భావించారు. వ్యవసాయ అధికారులతో చర్చించినప్పుడు తనకు తానుగా ఈ ప్రతిపాదన ముందుకు తెచ్చారు. ఆధునిక విధానం అనుసరించేవిధంగా రైతులను ప్రోత్సహించాలని, ఇందుకు కావలసిన ప్రణాళికలు సిద్ధం చేయాలని వ్యవసాయాధికారులను ఆదేశించారు. పాత పద్ధతి కొద్దిగా వ్యయప్రయాసలతో కూడుకున్నది. విత్తనాల అవసరం కూడా ఎక్కువగా ఉంటుంది పాత పద్ధతిలో ఒక ఎకరానికి 25 నుంచి 30 కిలోలు అవసరమైతే వెదజల్లే విధానంలో 8 కిలోలతో సరిపోతుందని శాస్త్రవేత్తలు అంటున్నారు.
ముఖ్యమంత్రి ఆదేశాల నేపథ్యంలో వ్యవసాయాధికారులు కొత్త పద్ధతులను ప్రచారం చేయడానికి రంగంలోకి దిగాలి. గ్రామీణ ప్రాంతాల్లో పర్యటించి రైతులను సంఘటిత పరచాలి. ఆధునిక వ్యవసాయ విధానాలపై చైతన్యపరచాలి. ముఖ్యమంత్రి స్వయంగా చెప్పిన నేపథ్యంలో కొత్త పద్ధతులపై రైతులకు వెంటనే నమ్మకం ఏర్పడుతుంది. దీనివల్ల వ్యవసాయాధికారుల ప్రయత్నం మరింత సులభతరం అవుతాయి.
(వ్యాసకర్త: పీఆర్వో, యూనివర్సిటీ ఆర్ట్స్ అండ్ సైన్స్ కళాశాల వరంగల్)
డాక్టర్ రక్కిరెడ్డి ఆదిరెడ్డి