ఉలి తుదన్ మోపి శిల్పియే మలచె నేని/ గాల దన్నబడు కఱకు రాలవెన్ని; జీవ రేఖల యందాల ప్రోవులగుచు/ వర కళామూర్తులనుచు బేర్వడయ గలవో? సేతు కలిత మహానదీ మాత యేదొ/ చలువ కాలువ కేలింత చాచి నివిరె; నేని, మండు టెడారుల నెన్ని యెన్ని/ భాగములు సస్యపులికితా భోగములయి/ రత్న రాసులు పండించి క్రాల గలవొ..? ‘ఎవ్వడెరుగు’ అంటూ కవి చిలకమఱ్ఱి ఈ ప్రాంత రైతు భవితవ్యాన్ని కలగన్నాడు. ఈ ప్రాంత మట్టిని ప్రేమించి రైతు శ్రేయస్సు కోసం నిబద్ధతతో కృషిచేస్తే.. కఠిన శిల అయినా శిల్పి ఉలితో అందమైన శిల్పమైనట్లుగా ఈ ప్రాంతంలో నదులు పారి, ఎడారులు సస్యశ్యామలమై రత్నరాసులు పండుతాయని ఆకాంక్షించాడు. తెలంగాణ రైతు గోస గురించి రాసిన కవులందరూ ధాన్యరాసులను కోరుకున్నారు. ఆ కవిగాయకుల కలలు పండి బీడు భూములన్నీ మాగాణాలై నేడు తెలంగాణ దేశానికే ధాన్యాగారమైంది.
అమ్మబోతే అడివి- కొనబోతే కొరివి అన్నది ఒకనాటి తెలంగాణ రైతు దీన స్థితి. ఆరుగాలం కష్టించి పండించిన పంట చేతికొచ్చిన తర్వాత దాన్ని అమ్ముకోవటా నికి రైతు పడిన కష్టాలు వర్ణనాతీతం. దళారుల మోసాలు, గిట్టుబాటు ధరలు రాని మార్కెట్ మాయాజాలం రైతును కన్నీటిమయం చేసేవి. రాష్ట్ర అవతరణ తర్వాత స్వయం పాలనలో ఒక్కటొక్కటిగా రైతు కష్టాలన్నీ తీరాయి. కాళేశ్వరం లాంటి మహాద్భుత ప్రాజెక్టుతో కరువునేల సస్యశ్యామలమై తెలంగాణ భూమి పచ్చని రంగేసుకున్నది. సాగునీరు పుష్కలంగా అంది ఊర్లన్నీ ధాన్యరాసులతో అలరారుతున్నాయి. ఈ పంటను అమ్ముకోవటంలో ఎదురయ్యే ఇబ్బందుల న్నింటినీ రాష్ట్ర ప్రభుత్వం తొలగించి రైతును అక్కున చేర్చుకున్నది. వరుసగా మూడో కారులో కూడా వరిధాన్యాన్ని గ్రామాల్లోనే, గ్రామాలకే పోయి మరీ కొనుగోలు చేసి, రెండు మూడు రోజుల్లోనే, రైతు ఖాతాల్లో పైసలు జమ చేస్తున్నది.
ఈ యాసంగిలో అంచనాలకు మించి వరిధాన్యం చేతికొచ్చింది. కోటి 32 లక్షల టన్నుల అంచనా దిగుబడిలో 80 లక్షల టన్నులను కొనుగోలు చేసేందుకు రాష్ట్ర సర్కార్ సమాయత్తమైంది. దీనికిగాను ఆరు వేలకు పైగా మార్కెట్ కేంద్రాలను ఏర్పాటు చేసి కర్షకుల అమ్మకం కష్టాలను కడతేర్చుతున్నది. ఇప్పటికే 15 లక్షల టన్నుల ధాన్యాన్ని సేకరించి సుమారు మూడు వేల కోట్ల రూపాయలను రైతుల ఖాతాలో వేసింది. దేశవ్యాప్తంగా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు రైతులు పండించిన పంటను కొనుగోలు చేసే బాధ్యత నుంచి తప్పుకుంటున్నాయి. ఏకంగా రైతు మార్కెట్లనే ఎత్తివేసే దిశగా అడుగులు వేస్తున్న స్థితిలో రాష్ట్ర ప్రభుత్వం రైతు వద్దకే వెళ్లి ప్రతిధాన్యపు గింజనూ కొంటున్నది. కార్పొరేట్ శక్తుల మార్కెట్ మాయాజాలం నుంచి కాపాడటానికి కంకణం కట్టుకొని పనిచేస్తున్నది. కరోనా కష్టకాలంలో కూడా మద్దతు ధరతో ధాన్యాన్ని కొనుగోలు చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం రైతులకు అండగా నిలవటం చరిత్రాత్మకం.